జులై నెలలో చదివిన పుస్తకాలు
2. కలవపూడి కథలు: సాంబశివ తడవర్తి
జులై నెలలో చదివిన పుస్తకాలు
కథ: జోడు బిందెల సైకిల్
"ఈ ఊరికి పిల్లని ఇవ్వాలంటే ఆలోచించాల్సిందే.. గుక్కెడు మంచినీళ్లు సంపాదించడానికి ఎన్ని కష్టాలు పడాలో! వాడుకునే నీటి కోసం, తాగునీటి కోసం ఎంత దూరం వెళ్లాలో, అత్తారింటికి వెళ్లిన ఆడపిల్లకి చాకిరి తప్పదు." చిన్నతనంలో మా దూరపు బంధువు అన్నమాట.
ఇప్పుడంటే మా ఊరిలో ఒక్క స్విచ్ వేస్తే మోటర్ ద్వారా నీరు డాబా పైన ట్యాంకర్లలో క్షణాల్లో నిండిపోతుంది. నిమిషాల్లో మినరల్ వాటర్ ఇంటికి వచ్చేస్తుంది.
ఒకప్పుడు నీటి కోసం నిజంగానే ఎన్నో కష్టాలు పడింది మా ఊరు.. అప్పటి మా ఊరి (2000 సంవత్సరం సమయంలో) నీటి సంగతులు. తెల్లవారకముందే మగవాళ్ళు భుజాల మీద కావిళ్ళు వేసుకుని కుర్రాలమ్మ చెరువు వద్ద ఉన్న బావి దగ్గరకు లేదా బేకయ్య బావి దగ్గరకు పరుగులు తీసేవారు. ఆడవాళ్లు తల మీద తళతళలాడే గుండిగ బిందెలను పెట్టుకుని ఎంతో దూరం నుంచి మంచినీరు మోసుకొచ్చేవారు.
సైకిల్ పైన నా చిన్నప్పుడు మొదటిసారి నీళ్లు తెచ్చిన జ్ఞాపకం..
నేను బిందె సైకిల్ మీద గట్టిగా ఉందా లేదా అని కుదుపి చూశాను. "ఇంటికి తిరిగొచ్చేదాకా నీకు ఇంకేం అనుమానం లేదు" అని నాన్న ధైర్యం చెబుతూ.. "చూడు బిందెని నీళ్ళతో నింపుకొని వస్తున్నప్పుడు లారీ లేదా బస్సు లాంటివి ఎదురైతే పక్కన దిగి నుంచో.. కట్టిన బిందెను కిందకు దించకుండా ఒక్కొక్క బకెట్ నీరు బావిలోంచి తీసుకొచ్చి ఇందులో పోయి" అని కొన్ని సూచనలు చెప్పాడు.
నేను సైకిల్ పైన రామాలయం దాకా వచ్చాక, మా స్నేహితుడు సుభాని నాలాగే మంచినీళ్ల కోసం ఒంటి బిందెతో సైకిల్ మీద వస్తూ "ఏం మామ, మొదటిసారి మంచినీళ్లు తీసుకురావడానికి వెళ్తున్నావా?" అన్నాడు.నేను అవునని తలూపాను. "సరే పద, ఇద్దరం వెళ్దాం" అన్నాడు.
మనవాడు నాకన్నా ముందే సైకిల్ నేర్చుకుని, రోజూ మంచినీళ్లు తీసుకొస్తున్న అనుభవజ్ఞుడు. ఆ క్షణాన తను మంచినీరు తీసుకురావడంలో డిగ్రీ చేసిన వ్యక్తి లాగా ఆకాశం అంత ఎత్తున నాకు కనిపించాడు, ఓ మంచి తోడు వచ్చాడనే భరోసా దొరికింది నాకు.
మా ఊరి డొంక దాటి ఇద్దరం కలిసి తారు రోడ్డు ఎక్కాము.
"త్వరగా పదరోయ్, అసలే ఎండాకాలం.. నీళ్లు దొరకవు" అని సుభాని గట్టిగా సైకిల్ పెడల్ తొక్కడం మొదలుపెట్టాడు.
నేను మొట్టమొదటిసారి మంచినీళ్ల కోసం వెళుతూ ఉండటం వలన, మంచినీళ్లు తీసుకుని వచ్చే పోయే సైకిళ్లను, వ్యక్తులను చూస్తూ నా సైకిల్ తొక్కుతున్నాను.
ఖాళీ బిందెలతో నీటి కోసం బయలుదేరినవి, బంగారం లా మంచినీటిని నింపుకొని ఏనుగులాగా నిండుగా ఎదురు వస్తున్న సైకిళ్లు.
ఎండాకాలం వీచే గాలికి మా ఖాళీ బిందెల్లో గాలి సవ్వడి చేస్తోంది.. నిండు బిందెలతో వచ్చే సైకిళ్లు చైన్లు కరకర శబ్దం చేస్తున్నాయి.
నీళ్ల కోసం వెళ్లే వారి ముఖాల్లో ఆందోళన.. "అసలే ఎండాకాలం, మంచినీళ్లు ఉంటాయా ఉండవా" అని.. వచ్చేవారి ముఖాల్లో విరిసిన ఆనందం "హమ్మయ్య, ఈ రోజుకి మంచినీళ్లు దొరికాయి" అని.
ముందుగా నీళ్లు తీసుకుని వస్తున్న ఊరు పెద్ద నాగేశ్వరరావు గారి అబ్బాయి సతీష్ మామ ఎదురయ్యారు.. నేను "రేయ్ సుభాని, ఆయన సైకిల్ తొక్కుకుంటూ వస్తున్న విధానం చూశావా.. ఖాళీ బిందెతో ఇంటికి వస్తున్నట్టు అనిపిస్తుందిరా.. బావిలో నీళ్లు లేవేమో.."
సుభాని నవ్వుతూ "రేయ్.. సతీష్ బాబాయ్ గురించి నీకు తెలియదు.. సైకిల్ తొక్కడంలో అతను నెంబర్ వన్! బరువు ఉన్నా లేకపోయినా, ఆయన తొక్కుడు మాత్రం మారదు రా!."
సతీష్ మామా దగ్గరకు వచ్చాక తెలిసింది ఆయన మంచినీళ్లతో వస్తున్నాడని..
మమ్మల్ని చూసి "ఏంటి కుర్రాళ్లు.. మంచినీళ్లకు వెళ్తున్నట్టున్నారే.. ఆలాపున్నయ్య బావి కాడికా, పుట్టగుంట బావి కాడకా..? పుట్టగుంట బావికే వెళ్ళండి... ఆలాపున్నయ్య బావిలో నీళ్లు మారాయి, పుట్టగుంట అయితే బాగుంటాయి.. నేనూ అక్కడి నుంచే.." అని చెప్పి రయ్యిన వెళ్ళిపోయాడు.
ఇద్దరం కలిసి పుట్టగుంట బావి దగ్గరికి చేరుకున్నాం. రోడ్డుకి దగ్గరలో ఉన్న కాల్వ పక్కన కింద బావి ఉంటుంది.. నేను రోడ్డుపైనే సైకిల్ స్టాండ్ వేసి ఒక్కో బకెట్ తెచ్చి నీళ్లు పోద్దాం అనుకుంటే...
సుభాని "నేరుగా సైకిల్ ని బావి దగ్గరికి పోనిద్దాం, నీళ్లు నింపాక ఇద్దరం సైకిల్ ని పైకి నెడదాం" అని చెప్పాడు.
బావి పక్కన స్టాండ్ వేసి సగం బిందెలు నింపాక "ఇప్పుడు స్టాండ్ తీసి పైకి వెళ్దాం పద" అని తాను అన్నాడు.
నేను: "ఇదేంట్రా సగం బిందెలతో మనం ఇంటికి వెళ్ళడానికా ఇంత దూరం వచ్చింది??"
సుభాని: "పూర్తి బిందెలతో మనం సైకిల్ రోడ్డు పైకి ఎక్కిస్తే సగం నీళ్లు కింద పోతాయిరా.. అందుకే సగం వరకు పోశాను, పైకి వెళ్ళాక మిగతా ఖాళీ నింపుదాం."
తను హ్యాండిల్ పట్టుకుంటే, నేను కింద నుండి రోడ్డు పైకి సైకిల్ తోసాను.. మొత్తానికి ఇద్దరం నీళ్లు నింపుకుని ఇంటికి బయలుదేరాం.
"సుభాని, కొంచెం నా వెనుక నీ సైకిల్ నడపరా.. నా సైకిల్ రోడ్డు గుంటల్లో దిగితే బిందె పక్కకి పడిపోతుందేమో అని సందేహంగా ఉంది" అని నేను అడిగాను.
సుభాని: "ఏం కాదురా, గుంటల్లో నెమ్మదిగా నడుపు, నేను వెనుకనే ఉంటా కదా, నువ్వు ముందు పదా."
నేను ముందు.. తను నా వెనుక.. ఇద్దరం బయలుదేరాం..
రోడ్డు మీద గుంటల్లో సైకిల్ దిగినప్పుడల్లా నేను నా చేయి వెనక పెట్టి బిందెను తడిమి చూస్తున్నాను, ఏమైనా కదిలిందేమోనని..
వెనకనుంచి సుభాని "రేయ్, నువ్వు ముందుకు చూసి సైకిల్ నడపరోయ్.. ఈ మట్టపూడి రోడ్డు గుంటల్లో పడ్డామంటే సైకిలు చేలోకి వెళ్లాల్సిందే, జాగ్రత్త."
మా ఊరి అడ్డరోడ్డు మలుపు దగ్గరికి చేరుకున్నాం.. దూరంగా లారీ హారన్ చప్పుడు వినిపించింది. అంతే, నా గుండెల్లో రైళ్లు పరుగులు తీసినట్టు అనిపించింది. నేను సడెన్ గా సైకిల్ దిగేసాను.
సుభాని: "ఏమైందిరా.."
నేను: "లారీ వస్తుంది మామ.. అది మన పక్కనుంచి వెళితే.. గాలి దాని వైపుకు లాగినట్లుగా అనిపిస్తుంది, బ్యాలెన్స్ తప్పుతుందేమోనని దిగాను."
సుభాని: "మాష్టారు.. లారీ మనకి అర కిలోమీటర్ దూరంలో కామేశ్వరమ్మ గుడి దగ్గర ఉంది రా బాబు.. ఇలా అయితే ఈరోజు మనం ఇంటికి వెళ్లినట్లే.."
లారీ మమ్మల్ని దాటాక ప్రయాణం మొదలుపెట్టాం. మా సైకిల్ ఇప్పుడు మా ఊరి డొంక మీదకి ఎక్కింది.
ఆ క్షణాన, ఒక్కసారిగా మా ఊరి గాలి నా దేహానికి తాకేసరికి.. గుండెల నిండా ఏదో తెలియని ఆనందం. ఎంతో విలువైన వస్తువుని సంపాదించి మా ఊరికి, ఇంటికి తీసుకెళ్తున్నానే గొప్ప సంతోషం పొందాను.
నేను సైకిల్ మీద నీటితో వస్తున్నట్లు తెలిసే విధంగా వెళ్లే దారిలో మా మిత్రులు అందర్నీ పలకరించాను.. ఇంటికి చేరగానే అమ్మానాన్న నన్ను చూసి ఆనందించారు..
కుటుంబానికి ఒకరోజు సరిపడా మంచినీళ్లు తీసుకొచ్చి ఏదో ఘనకార్యం చేసిన వ్యక్తిలా పొంగిపోతూ అమ్మ దగ్గరికి వెళ్లి ఒక రెండు రూపాయలు లంచం అడిగాను. అమ్మ నవ్వుతూ నా చేతిలో పెట్టింది.
డబ్బు తీసుకొని పెద్దోడు కొట్టు వైపు కొబ్బరి బిళ్ళలు, జీడీలు కొనుక్కోవడానికి పరుగులు తీశాను.
రోజులు గడుస్తున్నాయి.. నేను తరగతులు మారుతున్నాను.. కానీ మంచినీళ్ల కష్టాలు అలాగే ఉన్నాయి. నేను ఒంటి బిందె నుంచి ఇప్పుడు జోడి బిందెలకు మారాను.
ఒకప్పుడు ఒంటి బిందె కట్టడానికి కచ్చితంగా నాన్న ఉండాల్సిందే. ఇప్పుడు జోడి బిందెలు కట్టుకుని వెళ్లే అనుభవం నాకు వచ్చింది.
ఈ నీటి కోసం చేసే ప్రయాణంలో ఎన్నో మధుర జ్ఞాపకాలు. పెద్దవాళ్లు, చిన్నవాళ్లు ఊరిలో అందరితో పరిచయాలు.. ఊర్లో సంగతులు, బడిలో విశేషాలు, టీవీలో వచ్చే క్రికెట్ ముచ్చట్లు.. కబుర్లు చెప్పుకుంటూ సాగేవి మంచి నీటి కోసం చేసే సైకిల్ ప్రయాణాలు. దూరం వెళ్ళలేక 2 లీటర్ల డబ్బాలో మంచినీళ్ళు తీసుకొని రమ్మని ముసలి వాళ్లు ఇచ్చేవారు.
మంచి నీళ్ల కోసం వెళ్లే దారిలో అడ్డరోడ్డులో సారథి కొట్టు దగ్గర ఆగి, ప్రతిరోజు న్యూస్ పేపర్ చూడటం ఓ అద్భుతమైన జ్ఞాపకం. ముందుగా వెనక పేజీలో క్రికెట్ వార్తలతో మొదలుపెట్టి తరువాత సినిమా పేజీ చూడటం.. ఎవరైనా క్రికెట్ పేపర్ చదువుతుంటే వాళ్లు చదవడం పూర్తి అయ్యే వరకు ఎదురు చూడటం.. ఆదివారం అయితే డిస్ట్రిక్ట్ పేపర్ లో ఏ టీవీలో ఏ సినిమా ఎన్ని గంటలకి అన్న విశేషాలు తెలుసుకుని మిత్రులతో పంచుకోవటం.
ఓ రోజు నేను లక్ష్మయ్య అన్నయ్య ఇద్దరం కలిసి మంచినీళ్లకి వెళ్ళాం.
లక్ష్మయ్య అన్నయ్య చెప్తుండేవాడు "బడికి కొత్త సైకిల్, మంచినీళ్లకి పాత సైకిల్" అని..
నేను కూడా నా కొత్త సైకిల్ ఇంటి దగ్గర పెట్టి నాన్న సైకిల్ మీద మంచి నీళ్ళు తీసుకొస్తున్నాను ఆ పూట..
రాత్రి జరిగిన క్రికెట్ మ్యాచ్ విశేషాలు తను చెబుతున్నాడు.. "ఆహా.. ఏం కొట్టాడు సెహ్వాగ్.. న్యూజిలాండ్ బౌలర్లను చితకొట్టేశాడు అనుకో.."
మరోవైపు నేను తను చెబుతున్న మాటలను మ్యాచ్ హైలెట్స్ దృశ్యం రూపంలో మార్చుకుని సైకిల్ తొక్కుతున్నాను.
బిందెల్లో నీటితో ఉన్న సైకిల్ మా ఊరి కృష్ణుడు గుడి దాటి కొంచెం ముందుకు వెళ్ళింది..
అంతే, వెనుక నుంచి "అరెరే.. సైకిల్ చక్రం ఊడింది, సైకిల్ చక్రం ఊడింది.." అని మాటలు వినిపించాయి.
నా సైకిల్ ముందు ఒక చక్రం జోరుగా పరుగులు తీస్తుంది.. నా సైకిల్ బాగానే నడుస్తుంది కదా..
ఎవరిదిరా ఈ సైకిల్ చక్రం అని చూస్తే.. అది నా సైకిల్ ముందు చక్రమే. ఒక్కసారి నా గుండె జల్లుమంది,
ఒంటి చక్రం మీదే జోడి బిందెలతో నా సైకిల్ కొన్ని అడుగులు ముందుకు వెళ్ళింది.
హ్యాండిల్ పట్టుకుని నెమ్మదిగా నేను కిందకి దిగాను..
అది మంచి నడి వేసవి కాలం..ఓ రోజు ఉదయం 10:30 గంటల సమయం.
వేసవిలో చెలరేగే సూర్యుడు ఆ రోజు మరింత నిప్పులు చెరుగుతున్నాడు. మరో వైపు మట్టి డొంకలో ఇసుక, వేడి గాలికి సుడులు కొడుతూ పైకి లేస్తోంది.
ఎండను లెక్క చేయకుండా పిల్లలు అందరం శేషు మామయ్య ఇంటి దగ్గర క్రికెట్ ఆటలో మునిగి తేలుతూ ఉన్నాం..
మా ఈడు కుర్రాల్లో చేయి తిరిగిన ఆటగాడు తేజ, గంటనుంచి అవుట్ అవ్వకుండా బ్యాటింగ్ చేస్తూనే ఉన్నాడు. ఫీల్డింగ్ చేస్తున్న మేము ఆరోజు ఎండకి తడిసి ముద్ద అయ్యాం.
ఇంతలో రోడ్డుమీద ఓ దృశ్యం కనిపించింది, నడుచుకుంటూ వస్తున్న నాన్న కాళ్ల దగ్గర కొంత రక్తపు మరకలతో గీరుకుపోయి ఉంది.. తన పక్కనే మా సైకిల్ నడిపించుకుంటూ వస్తున్న మా ఊరి బాబాయ్.. సైకిల్ కింద పడినట్లు సొట్టబడిన బిందెలు, వాటికి అయిన మట్టి, భారంగా నడుస్తున్న నాన్న కాళ్లను చూస్తే అర్థం అయ్యింది.ఆ క్షణాన నాన్న దగ్గరికి వెళ్దామా వద్దా అనే సందిగ్ధంలో నేను.. ఎందుకంటే ఆ రోజు ఉదయం మంచినీళ్లు తీసుకురామని అమ్మ నాకు చెప్పింది.
ఉదయాన్నే నాన్న తాడి చెట్లు ఎక్కి, ఒక గొడ్ల చావిడిని తాటాకుతో కప్పడానికి వెళ్ళాడు. పని పూర్తయ్యి ఇంటికి వచ్చిన నాన్న ఇంట్లో మంచినీళ్లు లేవని తెలిసి, అలాగే ఎండలో మంచి నీటి కోసం వెళ్ళాడు. వేసవిలో నాన్న విరామం లేకుండా తాటి చెట్లు మూడు పూటలా ఎక్కడం, తాటి ఆకులతో పూరి ఇళ్లు, చావిడిలు కప్పడం చేస్తూ ఉండేవాడు. పని పూర్తయ్యాక ఆ ఇంటి వారు నాన్నకి మద్యం లేదా కల్లు తమ సంతోషం మేరకు పోసేవారు.. మరి ఆ రోజు ఓ వైపు తీవ్రమైన ఎండ ప్రభావమో, విశ్రాంతి లేకపోవడం, కొంత కల్లు తాగడం వలనో కళ్ళు తిరిగి పడిపోయాడు.
నాన్న నడుచుకుంటూ మా వైపు వచ్చే కొలది నా గుండె కొట్టుకునే వేగం మరింత పెరిగింది. నాన్న దగ్గరికి వెళ్లి సైకిల్ పట్టుకుందామంటే భయం వేసింది.. "నువ్వు ఎందుకు మంచినీళ్లు తీసుకురాలేదు?" అని తిడతారనే భయం ఒక వైపు. తండ్రి విశ్రాంతి లేకుండా ఇంత కష్టపడుతున్నా, ఆటల్లో పడి ఒక చిన్న పని కూడా చేయలేకపోయాను అనే బాధ మరోవైపు.. నామీద నాకే కోపం.
నడుస్తున్న సైకిల్ పైన సొట్ట పడిన జోడు బిందెల్లో అడుగున ఉన్న కదిలే నీటి లాగే..
నా మనసులో ఆలోచనలు కూడా నన్ను ఆ క్షణాన కుదిపేశాయి..
వేసవి దాటికి మా వీధిలో కాలే ఇసుకలో నా పాదాలు కూరుకుపోయినట్లు, కదలలేక ముందుకు సాగలేక..
నాన్న వెనుకే నా అడుగులు బరువైన గుండెతో ఇంటి వైపు భారంగా కదిలాయి.
సమాప్తం
మీ చిన్నతనంలో నీటి కోసం ఇలా సైకిల్ మీద వెళ్లారా? లేదా ఇంకేదైనా మర్చిపోలేని పల్లెటూరి జ్ఞాపకం ఉందా? కింద కామెంట్స్ లో తెలియజేయండి.
జిగిరి:
మనిషికి - ఆటవిక జీవికి మధ్య అద్భుతమైన అనుబంధాన్ని చూపించిన కథ జిగిరి.Music & Vocals : Suno AI పల్లవి: నవ మాసాలు నన్ను మోసిన ఓ తల్లి నా జన్మకై నువ్వు పునర్జన్మించావు మళ్ళీ దైవం రూపేనా ఇలలో వెలసిన కల్పవల్లి ప్రతిఫలం కోరక ప్రేమ వెన్నెల కురిపించే నిండు జాబిల్లి.. నవ మాసాలు నన్ను మోసిన ఓ తల్లి నా జన్మకై నువ్వు పునర్జన్మించావు మళ్ళీ చరణం 1: అమ్మా.. తల్లితనం కోసం తల్లడిల్లి.. ఎన్ని నోములు నోచావో.. ఎన్ని పూజలు చేసావో.. నలుసుగా నీ కడుపున పడితే.. ఎన్ని దీక్షలు చేసావో.. ఎన్ని కష్టాలు కోర్చావో.. పుడమికి నే వచ్చినప్పుడు.. ఎంత మురిసి పోయావో... ఎంత కరిగి పోయావో.. నా తొలి అడుగు పడితే.. ఎంత ఆనందించావో.. ఎంత పరవశించావో.. [Chorus] నవ మాసాలు నన్ను మోసిన ఓ తల్లి నా జన్మకై నువ్వు పునర్జన్మించావు మళ్ళీ చరణం 2: నీ చేతి గోరుముద్దలో.. అమృతం అద్దావు నీ నోట లాలిపాటతో.. నిద్రలో ముంచావు నీ ఒడినే బడిగా మార్చి.. పలుకులు నేర్పావు కంటికి కునుకు లేకనే.. నను కాచుకున్నావు బిడ్డ అడుగు బయట పెడితే.. మనిషి ఇంట్లో.. కనులు వాకిట్లో.. ఆ ఎదురు చూపులకు నే ఎదురైతే.. కోటి కాంతుల తేజాన్ని కళ్ళలో కురిపించావు [Chorus] నవ మాసాలు నన్ను మోసిన ఓ తల్లి నా జన్మకై నువ్వు పునర్జన్మించావు మళ్ళీ చరణం 3: ఆకాశమంత అవధి లేని ప్రేమే నీదమ్మా భూమాతకు సాటి సహనం ఓర్పే నీదమ్మా గంగమ్మలా ఉప్పొంగే అనురాగం నీదమ్మా గాలిలా నను వెన్నంటి ఊపిరి నీవమ్మా అగ్ని తేజస్సుతో నిత్యం యజ్ఞమే నీవమ్మా పంచభూతాలకు ప్రతిరూపమే నీవేనమ్మా ఇలలోన నడయాడే దైవమే నీవేనమ్మా నవ మాసాలు నన్ను మోసిన ఓ తల్లి నా జన్మకై నువ్వు పునర్జన్మించావు మళ్ళీ దైవం రూపేనా ఇలలో వెలసిన కల్పవల్లి ప్రతిఫలం కోరక ప్రేమ వెన్నెల కురిపించే నిండు జాబిల్లి.. నవ మాసాలు నను మోసిన ఓ తల్లి.. నిత్యం నీ మదిలో నను మోస్తావు మళ్ళీమళ్ళీ.. నీ ఋణం తీర్చుటకు ఈ జన్మ సరిపోదు నను కన్న తల్లి.. 07/05/2026
మార్చి నెలలో నేను చదివిన పుస్తకం ఉషశ్రీ భాగవతం. "భాగవతం చదివితే బాగు అవుతాం" అని పెద్దల మాట.
నాకు పురాతన దేవాలయాలు సందర్శించడం అంటే ఎంతో ఇష్టం. ఆ దేవాలయ గోడలు మీద రామాయణ భారత భాగవత శిల్పాలను చెక్కిన విధానం చూస్తుంటే ఆ శిల్పాల యొక్క అందంతోపాటు , ఆ కథల యొక్క అంతర్యాన్ని తెలుసుకోవాలనిపిస్తుంది. అందులో భాగంగా భాగవతం చదవాలని అనుకున్నాను. ఉషశ్రీ గారి భాగవతం పుస్తకం ఎంచుకున్నాను.
ఎన్నో కథలు.. ఎన్నెన్నో వింతలూ విశేషాలు..
ఉషశ్రీ గారి వచనం అమృతం.
ఈ భాగవత కథల్లో నాకు నచ్చిన కొన్ని విశేషాలను మీతో పంచుకుంటాను.
ముందుగా తండ్రి మాట కోసం, తండ్రి కోసం తపించిన ముగ్గురు కొడుకులు.. అందులో ఒకరు తండ్రి మాటకై రాజ్యం వదిలి అడవికి వెళితే, మరొకరు తండ్రి అజ్ఞను శిరసావహిస్తూ తన తల్లి శిరసునే ఖండించిన వ్యక్తి, మరో వ్యక్తి తన తండ్రి కోసం తన యవ్వనాన్ని తండ్రికి ధారపోసి, తండ్రి ముసలితనాన్ని తాను స్వీకరించిన వ్యక్తి.. ఈ ముగ్గురు కథలు భాగవతంలో చదువుతుంటే అద్భుతంగా ఆదర్శంగా అనిపించాయి.. ఆ ముగ్గురు ఎవరో మీరు గుర్తించగలరా? కామెంట్ బాక్స్ లో జత చేయండి.
మరో కథలో మనవడి ప్రేమ కోసం తాత చేసిన అద్భుతమైన యుద్ధం.. ఈ యుద్ధంలో తాత వెయ్యి చేతుల వ్యక్తిని మరియు శివున్ని ఎదిరించి మనవడి ప్రేమని గెలిపిస్తాడు.. ఆ తాత- ఆ మనవడు ఎవరో చెప్పండి చూద్దాం..?
ఇంకో కథ చూస్తే అందులో ఊర్వశి- పురారవుల ప్రేమ కథ. ఊర్వశి ప్రేమ కోసం పురారవుడు తపించిన విధానం.. ఆ ప్రేమను అంగీకరించడానికి ఊర్వశి విధించిన వింతైన షరతులు(తన రెండు గొర్రెలను బిడ్డలు లాగా చూడాలి, తన ముందు దిగంబరంగా ఉండరాదు) చదువుతుంటే వింతగా అనిపించాయి..
అతిధిని సేవించకుండా ముందే ఆహారం స్వీకరించాడని ఓ ముని కోపగ్రస్తుడైతే ఆ ఋషి జటములోనుంచి ఉద్భవించిన రాక్షసుడు.. తన భక్తుడి కోసం వచ్చిన సుదర్శన చక్రం.. ఆ మునిని ముల్లోకాలు తిప్పి తిరిగి భక్తుని దగ్గరికి వచ్చి శరణు వేడిన విధానం ..అంబరీషుని కథ చదువుతుంటే భగవంతున్ని నమ్మితే ఆయనే నీ తోడు, నీడై ఉంటాడు అనిపించింది.
దక్ష యజ్ఞంలో భాగంగా వీరభద్రుని దాటికి సూర్యుడు దంతాలు కోల్పోవడం.. మెత్తనివే ఆహార పదార్థాలు ఆయనకు ఆహారం అని ఈ భాగవతం చదివాకే నేను తెలుసుకున్నాను.
కృష్ణుడు కి 16 వేల మంది గోపికలు కదా.. మరి వారందరితో ఆయన ఎంత అనురాగంగా ఉంటున్నాడో చూడాలని నారదమునికి ఓసారి కోరిక కలుగుతుంది. కృష్ణుని అంతఃపురమునకు వెళ్తే ఆయన చూపించని లీలలు అద్భుతంగా అనిపించాయి..
ఓ చోట ఒక భార్య వింజామర విసురుతుంటే కృష్ణుడు కబుర్లు చెబుతూ కనిపిస్తాడు. మరోచోట సింహాసనం అధిష్టించి నారద మహర్షిని చూడగానే దిగివచ్చి నమస్కారం చేసి సాదరంగా ఆహ్వానిస్తాడు. ఇంకోచోట కృష్ణుడు తన భార్య తో కలిసి చదరంగం ఆడుతూ ఉంటాడు. మరోచోట తన ప్రియురాలికి ముత్యాల హారం వేస్తూ ఉంటాడు, మరోచోట తన కుమారులతో ముచ్చట్లు లాడుతూ ఉంటాడు.. ఇలా ఒకే వ్యక్తి అనేక చోట్ల చూపించే శ్రీకృష్ణ లీలలు ఈ భాగవతం కథలో అద్భుతంగా అనిపించాయి.
అంతే కాదు కర్మేంద్రియాలు, పంచేంద్రియాలు, పంచభూతాలు వాటి తత్వాలు ఇలాంటి ఎన్నో విశేషాలను చాలా చక్కగా వివరించారు ఉషశ్రీ గారు ఈ భాగవతం కథలో ఓ చోట.మధ్య మధ్యలో పోతన గారి అందమైన పదాలతో కూడిన భాగవత పద్యాలను కూడా ఈ పుస్తకంలో జత చేశారు.. ఈ పుస్తకం లో ఆ పద్యాలు చదివాక భాగవతం పూర్తి పద్యాలతో చదవాలి అనిపించింది. పద్యాలు పైకి చదువుతుంటే పదాలు, వినసొంపుగా అందంగా ఉన్నాయి.
క్షీరసాగర మథనంలో ఓ పద్యం చూడండి..
హరి సూచిన సిరి సూడదు..
సిరి సూచిన హరియుజూడ సిగ్గును పొందున్..
హరియును సిరియును తమలో..
సరిజూపుల చూడ మరుడు సందడి చేసెన్
పోతన గారి గురించి ఇంటర్నెట్లో చదివాను. ఆయన ఒకపక్క హలం పట్టి వ్యవసాయం చేస్తూనే మరోపక్క ఈ అద్భుతమైన భాగవతాన్ని రచించారని తెలుసుకునే ఆశ్చర్యపోయాను. ఓ చోట ప్రహ్లాదుడు "గృహస్థుడు కి కర్మ ప్రధానం" అని చెబుతారు. అలాగే పోతన తన ప్రధాన జీవనోపాధి అయిన వ్యవసాయం కర్మ చేస్తూ.. మరోవైపు ఈ అద్భుతమైన భాగవతం రచించి ఆచరణలో చూపించారు. నాకు చాలా ప్రేరణగా అనిపించింది. భవిష్యత్తులో పోతన గారు జన్మించిన స్థలాన్ని.. భాగవతాన్ని రాముడు కి అంకితం ఇచ్చిన ప్రదేశాలు సందర్శించాలి అనుకుంటున్నాను.
సులభమైన వచనంలో అందించిన ఉషశ్రీ గారి శైలి అద్భుతం.. ఏకబిగిన చదివించేది ఆయన శైలి. సంక్షిప్త రూపంలో ఉన్న ఉషశ్రీ భాగవతం చదివాక పూర్తి స్థాయిలో ఆ కథలు అన్ని మళ్ళీ చదవాలని మనస్సు ఉవ్విళ్ళూరుతుంది.
మీరు కూడా భాగవతం చదివి ఉంటే ఏ పుస్తకం చదివారో.. మీ అనుభవాలు చెప్పండి.
తాటి సెట్టు కథనే వినరో పాట వినడానికి: తాటి సెట్టు కథనే వినరో
[పల్లవి]
ఉగాది 2026 పాట వినడానికి: : ఉగాది 2026 Song
తెలుగింటి ఉగాది.. వెలుగులకు పునాది.. వసంతాన ఉగాది.. చిగురాశల యుగాది.. [Chorus] తెలుగింటి ఉగాది.. వెలుగులకు పునాది.. వసంతాన ఉగాది.. చిగురాశల యుగాది.. [Charanam 1] ఇంట పచ్చ తోరణములు ఆభరణములై తోచే.. చైత్రాన మధుమాసం దరహాసముతో మెరిసే.. కాలరూపమున జగన్మాతను వసంత నవరాత్రులలో కొలిచే.. ప్రకృతిలో.. ప్రతి బతుకున.. కొత్త ఆశలు చిగురించే.. ప్రకృతిలో.. ప్రతి బతుకున.. కొత్త ఆశలు చిగురించే.. [Chorus] తెలుగింటి ఉగాది.. వెలుగులకు పునాది.. వసంతాన ఉగాది.. చిగురాశల యుగాది.. [Charanam 2] రైతన్న హలం పట్టి ఏరువాక సాగెను.. పండితుడు గళం ఎత్తి పంచాంగం చదివెను.. భావకవి కలం పట్టి ప్రకృతిని వర్ణించెను.. కోకిలమ్మ కొమ్మలెక్కి రాగమాలపించెను.. కోకిలమ్మ కొమ్మలెక్కి రాగమాలపించెను.. [Chorus] తెలుగింటి ఉగాది.. వెలుగులకు పునాది వసంతాన ఉగాది.. చిగురాశల యుగాది [Charanam 3] షడ్రుచులను కలగలిపి.. దైవానికి నివేదించి ప్రసాదంగా స్వీకరించి.. బ్రతుకున అన్వయించి కష్ట-సుఖాలను సమదృష్టితో చూడమని ముందుకు మున్ముందుకు సాగమని కష్ట-సుఖాలను సమదృష్టితో చూడమని ముందుకు మున్ముందుకు సాగమని సందేశం ఇచ్చెను. ఈ ఉగాది పచ్చడి! [Chorus] తెలుగింటి ఉగాది.. వెలుగులకు పునాది వసంతాన ఉగాది.. చిగురాశల యుగాది
హే.. వచ్చే వచ్చే ఉగాది.. కొత్త ఆశల యుగాది హే హే.. వచ్చే వచ్చే ఉగాది.. కొత్త ఆశల యుగాది వచ్చే వచ్చే ఉగాది.. కొత్త ఆశల యుగాది!
ఫిబ్రవరిలో చదివిన ఓ పుస్తకం "అభినిర్యాణం"
"సోలో ట్రిప్స్ అనేవి ఒక వరం. మనం ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆలోచనల ఉత్కంఠ ఒకలా ఉంటుంది.. అదే ఇతరులతో ఉన్నప్పుడు వాళ్లకు తగినట్లు ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఎక్కడికైనా వెళ్లాలి అంటే ఏదో ఒక తోడు ఉంటే బాగుండు అని కోరుకుంటారు. నిజానికి ఒక మనిషికి అత్యంత అమూల్యమైన తోడు ఈ ప్రకృతి. ఏంటి నమ్మరా ? అయితే ఒకసారి ఒంటరిగా ప్రయాణం చేసి చూడండి తిరిగి వచ్చాక మీరే చెప్తారు అనుభూతి గురించి"
పుస్తకంలో ఈ వాక్యాలు నన్ను చాలా బాగా ఆకట్టుకున్నాయి
ప్రయాణాలన్నా ,పురాతన దేవాలయాలు- అక్కడ విశేషాలు తెలుసుకోవాలని ఎంతో ఆసక్తి కనపరిచే నాకు "అభినిర్యాణం" అనే పుస్తకం పుస్తకాలు పండుగలో చాలా ఆసక్తికరంగా కనిపించింది.
ఈ పుస్తకంలో కథ సమాంతరంగా రెండు కాలాల్లో సాగుతూ ఉంటుంది..
ప్రస్తుత కాలంలో అభి అనే యువకుడు మరియు రాయల కాలంలో భారతదేశం యొక్క సంస్కృతి, కళలు తెలుసుకోవాలని ఉత్సాహంతో భారత్ కు వచ్చిన రాయ్ అనే ఇంగ్లాండ్ దేశస్తుడు.. ఇలా ఇద్దరు రెండు వేరు వేరు కాలాల్లో చేసిన ప్రయాణమే అభి నిర్యాణం..
అభి తన ప్రాజెక్ట్ వర్క్ కోసం తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి వెళ్తాడు, అక్కడ దేవాలయంలో అనంతమైన నిధి ఉన్న ఆరో గది విశేషాలు తెలుసుకుంటాడు. దానికి సంబంధించిన తాళపత్ర గ్రంథాలు కూడా దొరుకుతాయి, కానీ ఆ తాళపత్ర గ్రంధాలు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు 5 వారాల సమయంలో నాగబంధనం ఉన్న గది తాళం చెవి సంపాదించాలి లేకపోతే ప్రాణగండం ఉంటుంది..
ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు, ఒంటరిగా ప్రయాణం చేయాలి.. చీకటంటే భయపడే అభి ఏ విధంగా తాళం చెవి సంపాదించాడు. ఆ ప్రయాణంలో ఎదురైన సాహసోపేతమైన సంఘటనలు.. వేరు వేరు కాలాల్లో ప్రయాణించే రాయ్ మరియు అభికి ఉన్న సంబంధం ఏంటి అనేది పుస్తకం చుదువుతుంటే చాలా ఆసక్తిగా అనిపిస్తుంది.
ఈ కథలో విశేషం ఏంటంటే కథానాయకులు అభి , రాయ్ ఇద్దరు కూడా కళను ఆరాధించే వారే.. అభి Profesional photographer మరియు రాయ్ కుంచె తో అద్భుతమైన సృష్టి చేసే చిత్రాకారుడు. ఇద్దరు ఈ ప్రయాణంలో తమ కంటితో చూసిన ఘట్టాలను అందమైన దృశ్యాలులాగా రచయిత చదువరులకు కళ్ళకు కట్టినట్లు చూపించారు.
తిరువనంతపురంలో అభి చూసిన సంఘటన
"సూర్యుడు నిజంగా చిన్నపిల్లాడిలా గోడను పట్టుకుని మెట్లు దిగుతున్నట్లు మెల్లగా కిందకి దిగుతుంటే గోపురం మధ్యభాగం నుండి కనిపించింది." ఆ దృశ్యాన్ని అందమైన ఫోటో తీసాడు అభి.
హంపీలో రాయ్ చూసిన సంఘటన
" అది విజయ విఠల దేవాలయం.. ప్రాంగణం నాట్య ప్రదర్శనకు సిద్ధం అయ్యింది, అతిరథమహారధులు అంతా వీక్షిస్తున్నారు.. సంగీతం పలికించే స్థంబాలు దగ్గర సంగీత విద్వాంసులు వెదురు కర్రలతో స్థంభాన్ని తాకుతుంటే ఒక్కో స్థంభం దగ్గర ఒక్కో శృతి, సరిగమలకు అనుగుణంగా అణువుఅణువున యజ్నంలా నాట్యం చేస్తున్న నర్తకి." ఓ అందమైన దృశ్యాన్ని రాయ్ చిత్రీకరించాడు..
నాగబంధనం ఉన్న ఆరవ గది తాళం వెతికే క్రమంలో మనం కూడా వివిధ ప్రదేశాల్లో ప్రయాణం చేస్తాం..
హంపిలో విజయనగర కాలం లోకి..
ద్వారకాలో గోమతి నది సముద్రం సంగమం అయ్యే ప్రదేశానికి..
పురాతన కాశీలో మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్ ల వద్దకు..
బుద్దగయాలో ప్రేతశిల - యమధర్మరాజు దేవాలయం ఉన్న ఎత్తైన కొండ పర్వతం మీదకు..
ఇలా కథ రెండు వేరు వేరు శతాబ్దాలలో ఆ ప్రాంతం విశేషాలను పాఠకుడు కి చెబుతూ ఎన్నో మలుపులు తిరుగుతూ ఆరవ గది తాళం చెవి శోధించడంలో ఉత్కంఠను కలిగిస్తుంది.
రచయిత ప్రవర్ష్ మనకు ఈ పుస్తక పఠన ప్రయాణంలోఎన్నో విశేషాలను చాలా బాగా పరిశోధించి చెప్పారు..
1.తిరువనంత పురం అనంత పద్మనాభ స్వామి విగ్రహం వెనుక ఉన్న కథ.
2.హంపీలో దేవాలయంలో రక్షణలా కనిపించే యాళీ.
3.కాశీలో అఘోరాలు జీవన విధానం, బెనారస్ చీరలు ప్రాముఖ్యత.
4.మొఘల్ నవాబుల కాలంలో దేవదాసీలు
5.బ్రటీష్ రాజ్యంలో భారత్ ను వంశం చేసుకోవాలనే కోరిక కలిగిన విధానం.
6.ఆలయంలో పూజలు అందుకునే దేవతామూర్తి శిల్పం తయారిలో వివిధ రకాల అంచెలు - శిల్ప కళ విశేషాలు..
ఈ పుస్తకం చదివాక మన భారతదేశంలో అనేక ప్రదేశాలను సందర్శించిన అనుభూతి కలిగింది .
- శ్రీనివాస చక్రవర్తి.
నా జీవితం నల్లేరు మీద బండి - సాకం నాగరాజు. ఒక పుస్తక ప్రేమికుని ఆత్మకథ
"ఒకసారి ఈ పుస్తకం చదవడం మొదలుపెడితే అదే మనల్ని చదివించుకుంటూ ముందుకు తీసుకు పోతుంది, అంత బాగా రాశారు" అని గల్లా అరుణకుమారి గారు ముందు మాటలో చెప్పినట్లే ఉంది ఈ పుస్తక పఠనం.
పుస్తకాలు అంటే అంతులేని అభిమానం ఉన్న వ్యక్తి . ఒక యజ్ఞం లాగా ఎందరో బడి చిన్నారులకు ,పెద్దలకు పుస్తకాలు అందించి సాహిత్యం పట్ల అభిరుచిని పెంచడానికి కృషి చేసిన వ్యక్తి గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో పుస్తకాన్ని చదవడం మొదలుపెట్టాను.
"బాల్యం అనేది మీకైనా నాకైనా అది ఒక చలమ తవ్వే కొద్ది ఊరుతూనే ఉంటుంది" అంటూ నాగరాజు గారు బాల్య జ్ఞాపకాలని మన ముందు పరిచారు.
ఆహా ఏమి రుచి:
"ఓ రోజు మా అవ్వతో పాటు మా మిరప తోట దాకా వెళ్లాను. పొలానికి గాని అడవికి గాని వెళ్తే ఆకలి ఎక్కువగా అవుతుంది. అప్పుడు తిన్న అన్నం భలే రుచి. దీన్ని ఎంజాయ్ చేయడానికి ఎన్నో సార్లు పొలానికి/అడవికి వెళ్లాను".
పుస్తకంలో ఈ మాటలు చదువుతున్నప్పుడు నాకు చిన్నప్పటికి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. మా అమ్మ నాన్నలకు ఉడత సాయం చేయడానికి నేను కూడా చిన్నప్పుడు మా పొలం వెళుతుండేవాడిని. అప్పుడు పచ్చడితో కలిపిన ముద్దలు తిన్న ఎంతో రుచిగా ఉండేవి. ఇదే విషయం మా నాన్నకు చెప్తే ఇక్కడున్న ప్రదేశంలో చల్లని తాడి చెట్లు నీడ, గాలి, పనిచేసి అలసిపోవడం వలన ఈ వాతావరణంలో నీకు తిన్నది బాగా రుచిగా అనిపిస్తుంది అని చెప్పారు. నాగరాజు గారు చెప్పిన ఈ సంఘటన నా బాల్యంలోకి తీసుకెళ్ళింది.
డబ్బు అత్యాశ - గుణపాఠం:
చిన్నప్పుడు నాగరాజు గారి ఇంట్లో డబ్బులు కోసం చిరు దొంగతనాలు చేసేవారట. అప్పుడు ఆ డబ్బులు చూసిన ఇద్దరు మిత్రులు "నీ వద్ద ఉన్న డబ్బును ఇంకా ఎన్నో రెట్లు డబ్బుగా చేస్తాము" అని ఆశ చూపించి పొలం తీసుకుని వెళ్తారు . అక్కడ ఒక గుంత తవ్వి ఆ గొంతులో ఈ ధనాన్ని పూడ్చిపెట్టి ఇలా చెప్తారు "మూడు రోజుల్లో ఈ గుంతలో డబ్బు చెట్టు మొలుస్తుంది. తర్వాత ఆ చెట్టు రోజు డబ్బు కాస్తుంది, కాకపోతే మూడు రోజుల వరకు మనం ఈ చోటికి రాకూడదు అదే నియమం" . ఆరోజు రాత్రి నాగరాజు గారికి నిద్ర పట్టలేదట ఉదయాన్నే లేచి గుంత దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తే.. ఆశ్చర్యం.. ఆ గుంత తవ్వేసి ఖాళీగా ఉంది. ఈ సంఘటన తనకి ఓ గొప్ప గుణపాఠం అంటారు ఆయన, దీని ద్వారా ఆయన ఎప్పుడు కూడా డబ్బు గూర్చి అత్యాశకు పోయి చీటీలు, స్కీం లాంటివాడి కట్టలేదట.
ఇలా ఎన్నో బాల్య జ్ఞాపకాలు ఉమ్మడి కుటుంబం, తను చేసిన చిరు దొంగతనాలు, అవ్వ చేతి ముద్ద.. ఈ పుస్తకంలో పంచుకున్నారు..
విద్యార్థి దశలోని నాయకుడిగా పనిచేసారు ఒకోసారి చదువులో వెనక పడుతున్నానని ఆలోచన కూడా ఉండేది. చదువు పూర్తికాగానే హైదరాబాద్లో బృందావన్ హోటల్లో ఐదు సంవత్సరాలు పాటు పనిచేశారు,తరువాత తెలుగు అధ్యాపకుడిగా ప్రయాణం మొదలు పెడతారు.
అధ్యాపకునిగా మొదటి తరగతి:
నాగరాజు గారి మాటల్లో"నా మొదటి క్లాసు డిగ్రీ మొదటి ఏడాది విద్యార్థులకు శ్రీ శ్రీ ప్రతిజ్ఞ పాఠం చెప్పాను, గీతాన్ని లైన్ తర్వాత లైను నాటికియంగా చదివాను, అంతే క్లాస్ అయ్యాక ఒక అమ్మాయి దేవుడా ఇతనా మా తెలుగు లెక్చరర్ కర్మ ..కర్మ.. అంది. ఆరోజు నుంచి క్లాస్ కి భయంగా ప్రిపేర్ అయ్యేవాడిని , ఒకసారి క్లాస్ కి సరిగ్గా ప్రిపేర్ కాలేదు. తరగతికి వెళ్లి అభాసు పాలయ్యే బదులు సెలవు చీటీ తీసుకొని ప్రిన్సిపాల్ గారికి ఇస్తే.. "కాలేజీకి వచ్చి సెలవు చీటీ ఇవ్వడానికి సమయం ఉంది కానీ గంట సేపు పాఠం చెప్పలేవా" అని అన్నారట..
30 సంవత్సరాలు అధ్యాపకుడిగా పనిచేసిన ఆయన ఇలా ఎన్నో విషయాల్ని నిజాయితీగా ఇలా పంచుకున్నారు.
మిత్రులు చెప్పిన మాటలు:
1."ఏ పని లేకపోతే అది మిట్ట మధ్యాహ్నం అయినా పడి తిరుగుతూ వుండు, ఖాళీగా మాత్రం ఉండకు పగటిపూట పడుకోకు" ఇది వజ్రం లాంటి మాట అంటారు నాగరాజు గారు.
ఆయన అలాగే పాటించి కాలికి బంగారం కట్టుకుని తిరిగారట.
2."కాలేజీ ,బజారు, ఫంక్షన్ కి ముస్తాబయి ఎంత నీటుగా ఉంటామో ఇంట్లోనూ మనం ఆ రీతిగా శుభ్రంగా ఉండాలి.. భార్య బిడ్డలు ముందు కూడా" . నిజంగా ఇది ఎంతో అమూల్యమైన మాట కదా..
పాఠాలు ఆసక్తి కలిగించడానికి:
పాఠాలు చెబుతున్నప్పుడు ఉపోద్ఘాతాలతో తాను చేసిన ప్రయోగాలను వివరంగా చెప్పారు ముఖ్యంగా శాకుంతలోపాఖ్యానం , ద్రౌపదిపరివేదనను ఉదాహరణ ద్వారా బాగా చెప్పారు. సందులు , చందస్సు ,అలంకారాలు లాంటి వాటిని నిజ జీవితాలకి కనెక్ట్ చేసి ఆయన చెప్పిన వివరణ చాలా బాగుంది. ఇందులో ఆయన చెప్పిన సూచనలు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు ఎంతో బాగా ఉపయోగపడతాయి.
తెలుగు భాషొద్యమ సమితి ద్వారా ఎన్నో పుస్తకాలు, ఎందరికో కవులకు ప్రోత్సాహం:
"2001వ సంవత్సరం నామినితో పరిచయం ద్వారా నా జీవితాన్ని పుస్తకం వైపు మలుపు తిప్పింది" అని చెబుతారు.
పెళ్లి, పుట్టినరోజు ,మరణం, గృహప్రవేశం.. సందర్భం ఏదైనా వ్యక్తుల పేరు మీద తీసుకు వచ్చిన పుస్తక సంకలనాలు , కొత్త పాఠకులు కావడానికి సాధనం అయ్యాయట. వేలాది మందికి సాహిత్యం పట్ల అభిరుచిని కలిగించాయి. "నా చేతుల మీదగా 50 పుస్తకాలు ప్రతీది చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ" అంటున్నారు.
పుస్తకాలు అచ్చు వేయడం ఒక ఎత్తైతే వాటిని పాఠకులకు చేర్చడం మరో ఎత్తు "స్కూటర్ బండిమీద పెట్టుకొని స్కూళ్లకు తిరిగి.. చిన్నారులకు , పాఠకులకు పుస్తకం గురించి చెప్పాలి.. ఇదో పుస్తక యజ్ఞం".
పెళ్లి పత్రిక తో పాటు ఓ కథ :
నాగరాజు గారి మాటల్లో "నేను పాపా నాయుడు పేట కాలేజ్ లో పనిచేసేటప్పుడు క్లాసులో శంకరంమంచి గారి కథ 'అంపకం' చదివి వినిపించాను ఆ కథ విన్నాక ఆడపిల్లల కంట్లో తడి చూశాను" . ఆ కంటి తడే ఎందరి పెళ్లి పత్రికల్లో అనుబంధం అయింది. పెళ్లి పత్రిక కవర్ లో ఆహ్వాన పత్రిక మరియు 'అంపకం' కథారాజం రెండు వచ్చాయి..
అసలు ఎందుకు నాగరాజు గారు ఎన్నో పుస్తకాలు ప్రచురించీ, ఎందరికో పంచుతున్నారంటే ఆయన మాటల్లో "డిగ్రీలో నేను చదివిన ఆ తొలి పుస్తకాలే నా దొంగ బుద్ధిని మార్చి జీవితాన్ని ఒక గొప్ప మలుపు తిప్పాయి.. పుస్తకదానం సమాజంలో ఒక వ్యక్తిగా నా కనీస బాధ్యత, అందుకోసమే ఈ తాపత్రయం.."
ఇంటింటా గ్రంథాలయం కొలువుదీరాలి:
"తల్లిదండ్రులు మీరు కూడా మీ పిల్లల్ని కథలు చదవమనండి రాయమనండి ఒక పుస్తకం కొనుక్కొని సొంత గ్రంథాలయానికి శ్రీకారం చుట్టుమనండి, ఇంటింటా గ్రంథాలయం కొలువుదీరాలి" ఇవి పుస్తకంలోని చివరి మాటలు..
127 పేజీల ఈ చిరు పుస్తకంలో సాకం నాగరాజు గారు తన జీవిత అనుభవాలన్నీ మన ముందు ఎంతో నిజాయితీగా కళ్ళ కట్టినట్లుగా చెప్పారు. ముందుమాటలో తాడి ప్రకాష్ గారు అన్నట్లుగా "ఊరుకో నాగరాజు వుంటే బావుణ్ణు"..
పుస్తకాభిమాని నాగరాజు గారు ఈ పుస్తకంలో సందర్భానికి తగ్గట్లుగా పేర్కొన్న కొన్ని పుస్తకాలు.
1. శ్రీశ్రీ మహాప్రస్థానం : విద్యార్థిగా ఉన్నప్పుడు తనకు ఒక కొత్త చూపుని ఈ కవిత్వం ఇచ్చిందని ఆయన చెప్పారు.
2. దిగంబర కవిత్వం: డిగ్రీ చదువుతున్నప్పుడు లైబ్రరీ నుంచి తీసుకున్న ఈ పుస్తకాన్ని ఓ రాత్రంతా కూర్చుని చదివారట.
3. తిక్కన భారతం: డిగ్రీ లో చదివిన పుస్తకం ఇందులో ఘట్టాలు కళ్ళకు కట్టినట్లుగా వర్ణించారట..
4. స్వీట్ హోమ్: నాగరాజు గారు పంచిన పుస్తకాలను చదివి ఓ యువతి ఇలా రాశారట. పెళ్లయిన స్త్రీ స్వీట్ హోమ్ చదివితే "అరెరే మనం బుచ్చిబాబు లాంటి భర్తను మిస్సయ్యామే అని నొచ్చుకుంటుంది", పెళ్లి కాని అమ్మాయి చదివితే "మనకు బుచ్చిబాబు లాంటి అబ్బాయి వస్తే బాగుంటుంద"ని ఆశపడుతుంది.
5. కన్యాశుల్కం : రావిశాస్త్రి గారు ఈ పుస్తకాన్ని "మానవమాత్రుల మాత్రం రాసింది కాదు, దేవతలు రాసింది ఈ పుస్తకం" అని కొనియాడారు. ఈ పుస్తకాన్ని నాగరాజు గారు తమ కూతురికి చదివి వినిపించేవారట.
6. తెలుగు కథకు జేజే: తెలుగు కథల కథా సంకలనం "నిండు పళ్ళబుట్ట" అని అనేక పత్రికలు ప్రశంసలు కురిపించాయి.
7. యేసోపు కథలు: కవితలు లాంటి కథలు పిల్లల పుస్తకం మరియు పెద్దల పుస్తకం.
8. మిట్టూరోడి పుస్తకం: మాండలికానికి గుడి కట్టిన పుస్తకం. 9.దువ్వూరి వెంకటరమణ శాస్త్రి ఆత్మకథ : చిత్రాకారులు బాపు మెచ్చిన జీవితకథ
నేను నాగరాజు గారికి "నా జీవితం నల్లేరు మీద బండి" పుస్తకం పంపమని మెసేజ్ చేసాను. సార్ నాకు మరిన్ని పుస్తకాలు కూడా పోస్ట్ లో పంపారు.
పుస్తకం కోసం 94403 31016 సంప్రదించవచ్చు.
- శ్రీనివాస చక్రవర్తి.
వలస - ఈ ఏడాది నేను చదివిన తొలి నవల
"పిల్ల జాగ్రత్తమ్మ.. పిల్లల తరువాతే ఏదైనా .."
ఓ తండ్రి చెప్పిన మాట..
"తల్లిదండ్రులు కొంతవరకే వస్తారు, పిల్లలు కొంత దూరం మనతో నడిచి వేరే దారి పడతారు. కలిసి ఉండేది భార్యాభర్తలిద్దరే.. ఆ అమ్మాయి నీకోసం ఇంత దూరం వస్తుంది, జాగ్రత్తగా చూసుకో" ఓ తల్లి పెళ్లి కాబోతున్న తన కొడుకుతో అన్న మాటలు ఇవి..
తల్లిదండ్రులు పిల్లల కోసం ఏం విధంగా తపిస్తారో ఈ పుస్తకం ద్వారా రచయిత సుస్మితా గారు చాలా బాగా చెప్పారు.
జీవితంలో ఓ మంచి స్థాయికి ఎదగాలని ఎన్నో కలలు కని అమెరికా వలస వెళ్ళిన NRI ల జీవిత కథలు ఇవి. ఏకబిగిన చదివించే విధంగా ఉంది పుస్తకం..
ఈ పుస్తకం నేను FB group వాడ్రేవు సాహిత్య కుటుంబం సభ్యులు కొప్పారపు లక్ష్మి నరసింహరావు గారి ద్వారా అందుకోవడం జరిగింది. మా ఇంటికి బుక్ పోస్ట్ రాగానే ఆసక్తిగా కవర్ తెరిచి చూసాను. నా సతీమణి ఈ పుస్తకం కవర్ పేజ్ మరియు టైటిల్ చూసి ఆపకుండా రెండు గంటలు ఏకధాటిగా చదివించింది. రాత్రి భోజనం సమయంలో కథ ఏంటి అని తనను అడిగాను. "ఇందులో ఒక కథ కాదు నాలుగైదు కథలు ఒకేసారి నడుస్తున్నాయి. చాలా ఆసక్తికరంగా ఉంది రచన శైలి " అని తను చెప్పింది. గత 5 రోజులు ప్రతి రోజూ ఉదయం ఓ రెండు గంటలు పాటు పుస్తకం చదివాను. అద్భుతమైన రచనా శైలి. చదవడం పూర్తి అయ్యాక మనసు భారం అయ్యింది.
చివర్లో ఈ లైన్ చదువుతుంటే మనసు ఏదో లాగా అయిపోయింది.
"ఇల్లు ఖాళీ అయిపోయింది. అనుభవిస్తామని ఒక్కో వస్తువు తెచ్చి పేర్చుకున్న ఇల్లు, ఒక్కో సదుపాయంగా తీర్చుకున్న ఇల్లు, ఒక్కో అనుభవం.. నువ్వు, ఏడుపూ.. అన్నిటికీ సాక్ష్యమైన ఇల్లు ఖాళీ అయిపోయింది.."
ఈ పుస్తకంలో తల్లిదండ్రులు పిల్లల పెంపకంలో ఎదుర్కొనే సవాళ్ళను కళ్ళకు కట్టినట్టు చెప్పారు. ముఖ్యంగా అమ్మలు పిల్లలు గురించి పడే తపన చిన్న పిల్లలు తిండి విషయం నుంచి యుక్త వయస్సు, పెళ్ళి , వారి పిల్లలకు కాన్పులు చేసి చూసుకోవడం... పిల్లల పెంపకంలో ఒక్కో భాగంలో ఒక్కో సవాల్.. అన్నీటిని తల్లిదండ్రులు ఎంత ఓర్పుగా నిర్వహిస్తారో చక్కగా వివరించారు. పుస్తకం చదివాక ఆలోచిస్తుంటే మన తల్లితండ్రులుకి మనం ఎంత ఋణపడి ఉన్నామో కదా అనిపిస్తుంది.
ఈ పుస్తకం చదివాక హర్షణీయం Podcast లో సుస్మితా గారి Interview విన్నాను. ఆమె గత 30 సంవత్సరాలు తన చుట్టూ జరిగిన అనేక విశేషాలను పరిశీలించి ఈ పుస్తక రూపంలో రాశారు అంటా. ముఖ్యంగా ఈ పుస్తకంలో సంభాషణలు చాలా బాగున్నాయి. సుస్మితా గారు సంభాషణలు గురించి మాట్లాడుతూ "పుస్తకం రాసే క్రమంలో సంభాషణలు రాసాక ఒక గదిలో కూర్చుని వాటిని పైకి చదివి చూసేవారట.. నోరు తిరగకపోయిన, గొంతులో ఆయాసం లాంటిది అనిపించినా ఆ సంభాషణలను సవరించారట"
వలస పుస్తకం గురించి Interview link https://open.spotify.com/episode/5PGKeH5YdpqHbNACpoJR0E?si=nHrm2o3fQ02tbkKDPEYxlQ&t=2852&ct=2852
ఓ మంచి పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చి చదవమని ప్రోత్సహించిన కొప్పారపు లక్ష్మి నరసింహరావు గారికి మరోసారి ధన్యవాదాలు.
- శ్రీనివాస చక్రవర్తి.
ఈస్తటిక్స్ కథలు - 2025
ఈ ఏడాది నా పుస్తక పఠనం ఖమ్మం ఈస్తటిక్స్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కథలు పోటీలో ఎన్నికైన ఉత్తమ కథలు సంకలనంతో ప్రారంభించాను. ప్రతి కథ కూడా ఒక మంచి ఆలోచన నుంచి పుట్టిన అద్భుతమైన సృజన. ప్రకృతి పట్ల, స్త్రీలు , మూఢాచారాలు, విపత్తులు, శ్రమ జీవనం, మానవుని అత్యాశ ఇలా అనేక అంశాలను ఈ కథల్లో చాలా బాగా సృజించారు రచయితలు.
ఇందులో నాకు బాగా నచ్చిన కొన్ని కథలు పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తాను.
1.కావలి : అనగనగా భీమప్ప అనే రైతు ఆయనకు సుమారు 60-70 ఏళ్ళ వయసు.ఓ రోజు రాత్రి భీమప్ప శెనగ చేనుకు కాపలా కాయడానికి వరుసకి అల్లుడు అయిన వ్యక్తితో వెళ్తారు.. రాత్రి వంతుల వారీగా చేనుకు కాపలా కాయడానికి ఇద్దరూ సిద్ధం అవుతారు. ఆ సమయంలో అనుకోకుండా ఆకాశంలో మెరుపులు ఆ వెలుతురులో దూరాన పది మంది యువకులు మద్యం మత్తులో ఓ స్త్రీని బలాత్కారం చేయబోతుంటారు వారిని ఎదుర్కొనేందుకు భీమప్ప చేసిన అద్భుతమైన పోరాటమే ఈ కథ. కథలో సంభాషణలు చాలా అద్భుతంగా రాశారు రచయిత.
2.శివుడాజ్ఞ: అది ప్రసిద్ధి చెందిన పాలేశ్వర దేవాలయం ఒక పక్క పారే ఏరు, దాని చుట్టు పక్కల అనేక గ్రామాలు. ప్రతి ఏడాది కార్తీక పౌర్ణమికి జనసందోహంతో నిండిపోయి ఉంటుంది ఆ గుడి.కానీ ఈ ఏడాది అలా లేదు కారణం మానవుడు చేసిన ఓ తప్పిదం వలన ఏరు పొంగి వరద ముంపునకు గురి అవుతుంది. ఆ ఉధృతికి పశువులు కట్టేసిన కట్టుకొయ్యల వద్దే చనిపోతాయి. వరద నుంచి బయట పడిన ఒకామె చివరి క్షణంలో ఇంటిలో ఉన్న బంగారం విషయం గుర్తుకు వచ్చి బీరువా వద్దకు వెళ్ళేసరికి వరద క్షణాల్లో ముంచెత్తడం వలన బీరువా గడి పట్టుకొనే ప్రాణాలు కోల్పోతుంది. అనేకమంది ఆ వరద ధాటికి మృత్యువాత పడతారు.. గుడిలో శివలింగం కూడా ఆ వరదలో కొట్టుకు పోతుంది. ఆ ప్రాంతం నుంచి సౌదీలో చెక్క పనికి వెళ్ళిన ఒక హిందూ- ఒక ముస్లిం మిత్రులు వరద మరియు కొట్టుకుపోయిన శివ లింగం విషయం తెలుసుకొని దేవాలయం కోసం అక్కడ నుంచి వారు ఒక భారీ చెక్క శివలింగాన్ని దీక్షతో తయారు చేసి తీసుకొని వస్తారు. అక్కడ కొంతమంది ప్రజలు ఒక ముస్లిం చేసిన శివ లింగాన్ని అంగీకరించరు. తరువాత ఏం జరిగింది ? ఇంతకీ మానవుడు చేసిన ఏ తప్పిదం వలన వరద వచ్చింది ? కథకు కీలకమైన "శివుడు ఆజ్ఞ" ఏంటో ఈ కథ చదివి తెలుసుకోవాల్సిందే..
3.అంజమ్మ : ఈరోజుల్లో మానవుడు అత్యాశతో అడవులను ఆక్రమించడం వలన అడువుల్లో ఉండే జంతు జాలానికి నివాస యోగ్యమైన చోటు దొరకడం లేదు, ఫలితంగా అవి ఊరులు మీదకు వస్తున్నాయి. అత్యాశతో అడవులను నాశనం చేయడంతో ప్రకృతి లో సమతుల్యం కూడా దెబ్బతింటుంది. ఇలాంటి అంశాన్ని తీసుకుని రచయిత అంజమ్మ అనే కోతితో ఓ మంచి కథ రాశారు. అంజమ్మకి కూడా తన తోటి వారిలాగా పిల్లలు కనాలని ఉంటుంది కానీ మానవుడు చేసిన ఓ పని వలన తనకు పిల్లలు పుట్టే యోగ్యం ఉండదు. ఇంతకీ మనిషి ఏం చేసాడు, ఆ విషయం అంజమ్మ కి ఎలా తెలిసింది? ప్రకృతి జీవజాలం సమతుల్యత యెక్క ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు ఈ కథ చదివితే మనకు బాగా తెలుస్తాయి.
4.భాగ్యలక్ష్మి : అనగనగా ఒక అడవి ప్రాంతం అక్కడ తరతరాలుగా వస్తున్న ఓ ఆచారం బాలింతలు, నెలసరి వచ్చిన స్త్రీలు ఇంటిలో ఉండరాదు.. ఊరికి కిలోమీటర్ దూరంలో ఏర్పాటు చేసిన కుటీరం (క్వారంటైన్) లో ఉండాలి. దాని వలన స్త్రీలు ఎందరో ఇబ్బంది పడుతూ ఉంటారు.. దానికి తోడు ఊరు పెద్ద అండతో ఆడవారిని లైంగిక హింస చేసే మానవ మృగాలు. ఆ సమయంలో జరిగిన ఓ సంఘటన చూసి భాగ్యలక్ష్మి అనే వనిత కదిలిపోతుంది.. ఇంతకీ ఆ సంఘటన ఏంటి.. తరతరాలుగా వస్తున్న మూఢాచారాలు రూపుమాపలనే భాగ్యలక్ష్మి ప్రయత్నం ఫలించిందా అనేది అసలు కథ.
5.ఓ నల్ల హంస కథ : ప్రకృతిని, చుట్టు పక్కల ఉండే వాతావరణాన్ని ఆరాధించే స్త్రీ "సహజ". తనకు ప్రతీదీ ప్రకృతి సిద్ధంగా జరగాలి అని ఆకాంక్ష. తన కూతురుని కూడా అలాగే ప్రకృతిలో పెంచుతుంది. Good touch - Bad touch.. ఇతరులతో ఎలా ఉండాలి ఇలా ఎన్నో విషయాలు నేర్పిస్తుంది. ఓరోజు యుక్త వయసు వచ్చిన కూతురు తో మాట్లాడుతూ ఉండగా "నీకు ఎవరైనా ఇష్టమా" అని అడుగుతుంది. అప్పుడు కూతురు తన క్లాస్మేట్ గాయత్రి అంటే ఆకర్షణ కలుగుతుంది అని చెబుతుంది.. ప్రతీదీ ప్రకృతికి అనుగుణంగా జరగాలని కోరుకునే సహజ కూతురు చెప్పిన విషయాన్ని స్వీకరిస్తుందా.. ఇంతకీ హంస ఎవరూ అనేది మనం తెలుసుకోవాల్సిన అసలు కథ.
6.మూడో నేత్రం : కొత్తగా పెళ్ళి అయిన జంట తొలి మూడు నెలలు సరదాగా ఆనందంగా గడిచిపోతాయి. పెళ్లి సెలవులు తరువాత భర్త కువైట్ వెళతాడు . ప్రతి రోజూ ప్రతి క్షణం భార్యను చూడాలని ఇంట్లో ఒక CC కెమెరా ఏర్పాటు చేస్తాడు.. అక్కడి నుంచి జరిగే పరిణామాలే ఈ కథ..
ఇలా సాగే ఈస్తటిక్స్ కథలు అన్ని కూడా చాలా బాగున్నాయి. సాహిత్యం అంటే కేవలం కాలక్షేపానికి కాదు మనిషిని ఆలోచింపజేసేది, సమాజాన్ని చెతన్యవంతం చేసేది అనే విధంగా ఈ కథ సంకలనాన్ని సంపాదకులు తీర్చిదిద్దారు.
- శ్రీనివాస చక్రవర్తి.