Friday, 3 July 2026

కథ: జోడు బిందెల సైకిల్

 కథ: జోడు బిందెల సైకిల్



"ఈ ఊరికి పిల్లని ఇవ్వాలంటే ఆలోచించాల్సిందే.. గుక్కెడు మంచినీళ్లు సంపాదించడానికి ఎన్ని కష్టాలు పడాలో! వాడుకునే నీటి కోసం, తాగునీటి కోసం ఎంత దూరం వెళ్లాలో, అత్తారింటికి వెళ్లిన ఆడపిల్లకి చాకిరి తప్పదు." చిన్నతనంలో మా దూరపు బంధువు అన్నమాట.

ఇప్పుడంటే మా ఊరిలో ఒక్క స్విచ్ వేస్తే మోటర్ ద్వారా నీరు డాబా పైన ట్యాంకర్లలో క్షణాల్లో నిండిపోతుంది. నిమిషాల్లో మినరల్ వాటర్ ఇంటికి వచ్చేస్తుంది.

ఒకప్పుడు నీటి కోసం నిజంగానే ఎన్నో కష్టాలు పడింది మా ఊరు.. అప్పటి మా ఊరి (2000 సంవత్సరం సమయంలో) నీటి సంగతులు. తెల్లవారకముందే మగవాళ్ళు భుజాల మీద కావిళ్ళు వేసుకుని కుర్రాలమ్మ చెరువు వద్ద ఉన్న బావి దగ్గరకు లేదా బేకయ్య బావి దగ్గరకు పరుగులు తీసేవారు. ఆడవాళ్లు తల మీద తళతళలాడే గుండిగ బిందెలను పెట్టుకుని ఎంతో దూరం నుంచి మంచినీరు మోసుకొచ్చేవారు.





మా ఊర్లో తాగినన్ని పాలు, ఎంతో పాడి ఉండేది.మా ఊరు నుంచి బయటికి పాల క్యాన్లు వెళ్ళేవి.
ఎండాకాలం వచ్చిందంటే పొరుగూరు నుంచి ఎంతోమంది కల్లు తాగడానికి, తాడి చెట్ల వనంలాంటి మా ఊరు వచ్చేవారు. సైకిల్ పైన కల్లు డబ్బాలతో మా ఊరు నుండి బయటికి వెళ్లేది. కానీ మంచినీళ్ల కోసం మేము ఎన్నో కిలోమీటర్లు ఎండనక, వాననక, చలి అనక పక్కనున్న పొరుగూరుకు కాలినడకన లేదా సైకిల్ మీద వెళ్లి నీటిని నింపుకుని వచ్చేవాళ్ళం.

********

సైకిల్ పైన నా చిన్నప్పుడు మొదటిసారి నీళ్లు తెచ్చిన జ్ఞాపకం..



నా జత పిల్లలందరూ సైకిల్ మీద దూరం నుంచి మంచినీళ్లు తెస్తున్నారు. నేను కూడా ఆరోజు ఉదయం సమరోత్సాహంతో గుర్రం పైన సిద్ధమైన సైనికుడు లాగా నా సైకిల్ తీసి ఇంటి ముందర స్టాండ్ వేసాను.
నాన్న "చిన్నోడా.. నువ్వు రెండు బిందెలు లాగలేవు గానీ, నీకు ఒక బిందె కడతాను, ఇంట్లోకి వెళ్లి బిందె తీసుకుని రా" అని చెప్పాడు.
ఇంట్లోంచి బిందెను తీసుకొచ్చిన నన్ను చూసి నాన్న నవ్వుతూ "ఇది గుండిగ బిందె నాన్న, సైకిల్ క్యారేజ్ మీద కూర్చోదు" అని చెప్పి, తను ఒక బిందె తెచ్చి అమ్మ చేతికి ఇచ్చాడు. అమ్మ గడ్డి వాములో నాలుగు గడ్డి పూచలతో శుభ్రంగా ఆ బిందెను తోమి నా చేతికి ఇచ్చింది.
నాన్న ఒక గోనె సంచి తెచ్చి సైకిల్ క్యారేజ్ మీద పరిచి, దాని మీద బిందె మరియు నీళ్లు వడపోసుకోవడానికి ఓ గుడ్డను కప్పి, సైకిల్ ట్యూబ్ తో గట్టిగా కట్టాడు.

నేను బిందె సైకిల్ మీద గట్టిగా ఉందా లేదా అని కుదుపి చూశాను. "ఇంటికి తిరిగొచ్చేదాకా నీకు ఇంకేం అనుమానం లేదు" అని నాన్న ధైర్యం చెబుతూ.. "చూడు బిందెని నీళ్ళతో నింపుకొని వస్తున్నప్పుడు లారీ లేదా బస్సు లాంటివి ఎదురైతే పక్కన దిగి నుంచో.. కట్టిన బిందెను కిందకు దించకుండా ఒక్కొక్క బకెట్ నీరు బావిలోంచి తీసుకొచ్చి ఇందులో పోయి" అని కొన్ని సూచనలు చెప్పాడు.

నేను సైకిల్ పైన రామాలయం దాకా వచ్చాక, మా స్నేహితుడు సుభాని నాలాగే మంచినీళ్ల కోసం ఒంటి బిందెతో సైకిల్ మీద వస్తూ "ఏం మామ, మొదటిసారి మంచినీళ్లు తీసుకురావడానికి వెళ్తున్నావా?" అన్నాడు.నేను అవునని తలూపాను. "సరే పద, ఇద్దరం వెళ్దాం" అన్నాడు. మనవాడు నాకన్నా ముందే సైకిల్ నేర్చుకుని, రోజూ మంచినీళ్లు తీసుకొస్తున్న అనుభవజ్ఞుడు. ఆ క్షణాన తను మంచినీరు తీసుకురావడంలో డిగ్రీ చేసిన వ్యక్తి లాగా ఆకాశం అంత ఎత్తున నాకు కనిపించాడు, ఓ మంచి తోడు వచ్చాడనే భరోసా దొరికింది నాకు.

మా ఊరి డొంక దాటి ఇద్దరం కలిసి తారు రోడ్డు ఎక్కాము. "త్వరగా పదరోయ్, అసలే ఎండాకాలం.. నీళ్లు దొరకవు" అని సుభాని గట్టిగా సైకిల్ పెడల్ తొక్కడం మొదలుపెట్టాడు.
నేను మొట్టమొదటిసారి మంచినీళ్ల కోసం వెళుతూ ఉండటం వలన, మంచినీళ్లు తీసుకుని వచ్చే పోయే సైకిళ్లను, వ్యక్తులను చూస్తూ నా సైకిల్ తొక్కుతున్నాను. ఖాళీ బిందెలతో నీటి కోసం బయలుదేరినవి, బంగారం లా మంచినీటిని నింపుకొని ఏనుగులాగా నిండుగా ఎదురు వస్తున్న సైకిళ్లు. ఎండాకాలం వీచే గాలికి మా ఖాళీ బిందెల్లో గాలి సవ్వడి చేస్తోంది.. నిండు బిందెలతో వచ్చే సైకిళ్లు చైన్లు కరకర శబ్దం చేస్తున్నాయి.



నీళ్ల కోసం వెళ్లే వారి ముఖాల్లో ఆందోళన.. "అసలే ఎండాకాలం, మంచినీళ్లు ఉంటాయా ఉండవా" అని.. వచ్చేవారి ముఖాల్లో విరిసిన ఆనందం "హమ్మయ్య, ఈ రోజుకి మంచినీళ్లు దొరికాయి" అని.

ముందుగా నీళ్లు తీసుకుని వస్తున్న ఊరు పెద్ద నాగేశ్వరరావు గారి అబ్బాయి సతీష్ మామ ఎదురయ్యారు.. నేను "రేయ్ సుభాని, ఆయన సైకిల్ తొక్కుకుంటూ వస్తున్న విధానం చూశావా.. ఖాళీ బిందెతో ఇంటికి వస్తున్నట్టు అనిపిస్తుందిరా.. బావిలో నీళ్లు లేవేమో.."
సుభాని నవ్వుతూ "రేయ్.. సతీష్ బాబాయ్ గురించి నీకు తెలియదు.. సైకిల్ తొక్కడంలో అతను నెంబర్ వన్! బరువు ఉన్నా లేకపోయినా, ఆయన తొక్కుడు మాత్రం మారదు రా!."

సతీష్ మామా దగ్గరకు వచ్చాక తెలిసింది ఆయన మంచినీళ్లతో వస్తున్నాడని..
 మమ్మల్ని చూసి "ఏంటి కుర్రాళ్లు.. మంచినీళ్లకు వెళ్తున్నట్టున్నారే.. ఆలాపున్నయ్య బావి కాడికా, పుట్టగుంట బావి కాడకా..? పుట్టగుంట బావికే వెళ్ళండి... ఆలాపున్నయ్య బావిలో నీళ్లు మారాయి, పుట్టగుంట అయితే బాగుంటాయి.. నేనూ అక్కడి నుంచే.." అని చెప్పి రయ్యిన వెళ్ళిపోయాడు.



ఇద్దరం కలిసి పుట్టగుంట బావి దగ్గరికి చేరుకున్నాం. రోడ్డుకి దగ్గరలో ఉన్న కాల్వ పక్కన కింద బావి ఉంటుంది.. నేను రోడ్డుపైనే సైకిల్ స్టాండ్ వేసి ఒక్కో బకెట్ తెచ్చి నీళ్లు పోద్దాం అనుకుంటే...
సుభాని "నేరుగా సైకిల్ ని బావి దగ్గరికి పోనిద్దాం, నీళ్లు నింపాక ఇద్దరం సైకిల్ ని పైకి నెడదాం" అని చెప్పాడు.

బావి పక్కన స్టాండ్ వేసి సగం బిందెలు నింపాక "ఇప్పుడు స్టాండ్ తీసి పైకి వెళ్దాం పద" అని తాను అన్నాడు. నేను: "ఇదేంట్రా సగం బిందెలతో మనం ఇంటికి వెళ్ళడానికా ఇంత దూరం వచ్చింది??"
సుభాని: "పూర్తి బిందెలతో మనం సైకిల్ రోడ్డు పైకి ఎక్కిస్తే సగం నీళ్లు కింద పోతాయిరా.. అందుకే సగం వరకు పోశాను, పైకి వెళ్ళాక మిగతా ఖాళీ నింపుదాం."
తను హ్యాండిల్ పట్టుకుంటే, నేను కింద నుండి రోడ్డు పైకి సైకిల్ తోసాను.. మొత్తానికి ఇద్దరం నీళ్లు నింపుకుని ఇంటికి బయలుదేరాం.



"సుభాని, కొంచెం నా వెనుక నీ సైకిల్ నడపరా.. నా సైకిల్ రోడ్డు గుంటల్లో దిగితే బిందె పక్కకి పడిపోతుందేమో అని సందేహంగా ఉంది" అని నేను అడిగాను.
సుభాని: "ఏం కాదురా, గుంటల్లో నెమ్మదిగా నడుపు, నేను వెనుకనే ఉంటా కదా, నువ్వు ముందు పదా."

నేను ముందు.. తను నా వెనుక.. ఇద్దరం బయలుదేరాం..
రోడ్డు మీద గుంటల్లో సైకిల్ దిగినప్పుడల్లా నేను నా చేయి వెనక పెట్టి బిందెను తడిమి చూస్తున్నాను, ఏమైనా కదిలిందేమోనని.. వెనకనుంచి సుభాని "రేయ్, నువ్వు ముందుకు చూసి సైకిల్ నడపరోయ్.. ఈ మట్టపూడి రోడ్డు గుంటల్లో పడ్డామంటే సైకిలు చేలోకి వెళ్లాల్సిందే, జాగ్రత్త."

మా ఊరి అడ్డరోడ్డు మలుపు దగ్గరికి చేరుకున్నాం.. దూరంగా లారీ హారన్ చప్పుడు వినిపించింది. అంతే, నా గుండెల్లో రైళ్లు పరుగులు తీసినట్టు అనిపించింది. నేను సడెన్ గా సైకిల్ దిగేసాను.
సుభాని: "ఏమైందిరా.."
నేను: "లారీ వస్తుంది మామ.. అది మన పక్కనుంచి వెళితే.. గాలి దాని వైపుకు లాగినట్లుగా అనిపిస్తుంది, బ్యాలెన్స్ తప్పుతుందేమోనని దిగాను."
సుభాని: "మాష్టారు.. లారీ మనకి అర కిలోమీటర్ దూరంలో కామేశ్వరమ్మ గుడి దగ్గర ఉంది రా బాబు.. ఇలా అయితే ఈరోజు మనం ఇంటికి వెళ్లినట్లే.."



లారీ మమ్మల్ని దాటాక ప్రయాణం మొదలుపెట్టాం. మా సైకిల్ ఇప్పుడు మా ఊరి డొంక మీదకి ఎక్కింది.
ఆ క్షణాన, ఒక్కసారిగా మా ఊరి గాలి నా దేహానికి తాకేసరికి.. గుండెల నిండా ఏదో తెలియని ఆనందం. ఎంతో విలువైన వస్తువుని సంపాదించి మా ఊరికి, ఇంటికి తీసుకెళ్తున్నానే గొప్ప సంతోషం పొందాను.
నేను సైకిల్ మీద నీటితో వస్తున్నట్లు తెలిసే విధంగా వెళ్లే దారిలో మా మిత్రులు అందర్నీ పలకరించాను.. ఇంటికి చేరగానే అమ్మానాన్న నన్ను చూసి ఆనందించారు..

కుటుంబానికి ఒకరోజు సరిపడా మంచినీళ్లు తీసుకొచ్చి ఏదో ఘనకార్యం చేసిన వ్యక్తిలా పొంగిపోతూ అమ్మ దగ్గరికి వెళ్లి ఒక రెండు రూపాయలు లంచం అడిగాను. అమ్మ నవ్వుతూ నా చేతిలో పెట్టింది. డబ్బు తీసుకొని పెద్దోడు కొట్టు వైపు కొబ్బరి బిళ్ళలు, జీడీలు కొనుక్కోవడానికి పరుగులు తీశాను.





**********

రోజులు గడుస్తున్నాయి.. నేను తరగతులు మారుతున్నాను.. కానీ మంచినీళ్ల కష్టాలు అలాగే ఉన్నాయి. నేను ఒంటి బిందె నుంచి ఇప్పుడు జోడి బిందెలకు మారాను. ఒకప్పుడు ఒంటి బిందె కట్టడానికి కచ్చితంగా నాన్న ఉండాల్సిందే. ఇప్పుడు జోడి బిందెలు కట్టుకుని వెళ్లే అనుభవం నాకు వచ్చింది. ఈ నీటి కోసం చేసే ప్రయాణంలో ఎన్నో మధుర జ్ఞాపకాలు. పెద్దవాళ్లు, చిన్నవాళ్లు ఊరిలో అందరితో పరిచయాలు.. ఊర్లో సంగతులు, బడిలో విశేషాలు, టీవీలో వచ్చే క్రికెట్ ముచ్చట్లు.. కబుర్లు చెప్పుకుంటూ సాగేవి మంచి నీటి కోసం చేసే సైకిల్ ప్రయాణాలు. దూరం వెళ్ళలేక 2 లీటర్ల డబ్బాలో మంచినీళ్ళు తీసుకొని రమ్మని ముసలి వాళ్లు ఇచ్చేవారు.



మంచి నీళ్ల కోసం వెళ్లే దారిలో అడ్డరోడ్డులో సారథి కొట్టు దగ్గర ఆగి, ప్రతిరోజు న్యూస్ పేపర్ చూడటం ఓ అద్భుతమైన జ్ఞాపకం. ముందుగా వెనక పేజీలో క్రికెట్ వార్తలతో మొదలుపెట్టి తరువాత సినిమా పేజీ చూడటం.. ఎవరైనా క్రికెట్ పేపర్ చదువుతుంటే వాళ్లు చదవడం పూర్తి అయ్యే వరకు ఎదురు చూడటం.. ఆదివారం అయితే డిస్ట్రిక్ట్ పేపర్ లో ఏ టీవీలో ఏ సినిమా ఎన్ని గంటలకి అన్న విశేషాలు తెలుసుకుని మిత్రులతో పంచుకోవటం.

ఓ రోజు నేను లక్ష్మయ్య అన్నయ్య ఇద్దరం కలిసి మంచినీళ్లకి వెళ్ళాం.
లక్ష్మయ్య అన్నయ్య చెప్తుండేవాడు "బడికి కొత్త సైకిల్, మంచినీళ్లకి పాత సైకిల్" అని..
నేను కూడా నా కొత్త సైకిల్ ఇంటి దగ్గర పెట్టి నాన్న సైకిల్ మీద మంచి నీళ్ళు తీసుకొస్తున్నాను ఆ పూట..
రాత్రి జరిగిన క్రికెట్ మ్యాచ్ విశేషాలు తను చెబుతున్నాడు.. "ఆహా.. ఏం కొట్టాడు సెహ్వాగ్.. న్యూజిలాండ్ బౌలర్లను చితకొట్టేశాడు అనుకో.." మరోవైపు నేను తను చెబుతున్న మాటలను మ్యాచ్ హైలెట్స్ దృశ్యం రూపంలో మార్చుకుని సైకిల్ తొక్కుతున్నాను.

బిందెల్లో నీటితో ఉన్న సైకిల్ మా ఊరి కృష్ణుడు గుడి దాటి కొంచెం ముందుకు వెళ్ళింది.. అంతే, వెనుక నుంచి "అరెరే.. సైకిల్ చక్రం ఊడింది, సైకిల్ చక్రం ఊడింది.." అని మాటలు వినిపించాయి.
నా సైకిల్ ముందు ఒక చక్రం జోరుగా పరుగులు తీస్తుంది.. నా సైకిల్ బాగానే నడుస్తుంది కదా..
ఎవరిదిరా ఈ సైకిల్ చక్రం అని చూస్తే.. అది నా సైకిల్ ముందు చక్రమే. ఒక్కసారి నా గుండె జల్లుమంది,
ఒంటి చక్రం మీదే జోడి బిందెలతో నా సైకిల్ కొన్ని అడుగులు ముందుకు వెళ్ళింది. హ్యాండిల్ పట్టుకుని నెమ్మదిగా నేను కిందకి దిగాను..




వెనకవైపు రెండు బిందెలు నిండా నీళ్లు ఉండటం, సైకిల్ నిదానంగా నడుస్తూ ఉండటంతో బ్యాలెన్స్ అయిందని అనిపించింది. నా సైకిల్ ముందు చక్రం చేసిన ఫీట్ చూసి దగ్గరలో ఉన్నవారు నవ్వులు చిందించారు. అక్కడ ఆడుకుంటున్న పిల్లలు ఊడిన చక్రం తెచ్చి తిరిగి నాకు ఇచ్చారు..
ముందు చక్రాన్ని బిగించి నేను నడుస్తూ నెమ్మదిగా సైకిల్ ను ఇంటికి చేర్చాను.
******

అది మంచి నడి వేసవి కాలం..ఓ రోజు ఉదయం 10:30 గంటల సమయం.
వేసవిలో చెలరేగే సూర్యుడు ఆ రోజు మరింత నిప్పులు చెరుగుతున్నాడు. మరో వైపు మట్టి డొంకలో ఇసుక, వేడి గాలికి సుడులు కొడుతూ పైకి లేస్తోంది. ఎండను లెక్క చేయకుండా పిల్లలు అందరం శేషు మామయ్య ఇంటి దగ్గర క్రికెట్ ఆటలో మునిగి తేలుతూ ఉన్నాం.. మా ఈడు కుర్రాల్లో చేయి తిరిగిన ఆటగాడు తేజ, గంటనుంచి అవుట్ అవ్వకుండా బ్యాటింగ్ చేస్తూనే ఉన్నాడు. ఫీల్డింగ్ చేస్తున్న మేము ఆరోజు ఎండకి తడిసి ముద్ద అయ్యాం.



ఇంతలో రోడ్డుమీద ఓ దృశ్యం కనిపించింది, నడుచుకుంటూ వస్తున్న నాన్న కాళ్ల దగ్గర కొంత రక్తపు మరకలతో గీరుకుపోయి ఉంది.. తన పక్కనే మా సైకిల్ నడిపించుకుంటూ వస్తున్న మా ఊరి బాబాయ్.. సైకిల్ కింద పడినట్లు సొట్టబడిన బిందెలు, వాటికి అయిన మట్టి, భారంగా నడుస్తున్న నాన్న కాళ్లను చూస్తే అర్థం అయ్యింది.ఆ క్షణాన నాన్న దగ్గరికి వెళ్దామా వద్దా అనే సందిగ్ధంలో నేను.. ఎందుకంటే ఆ రోజు ఉదయం మంచినీళ్లు తీసుకురామని అమ్మ నాకు చెప్పింది.



ఉదయాన్నే నాన్న తాడి చెట్లు ఎక్కి, ఒక గొడ్ల చావిడిని తాటాకుతో కప్పడానికి వెళ్ళాడు. పని పూర్తయ్యి ఇంటికి వచ్చిన నాన్న ఇంట్లో మంచినీళ్లు లేవని తెలిసి, అలాగే ఎండలో మంచి నీటి కోసం వెళ్ళాడు. వేసవిలో నాన్న విరామం లేకుండా తాటి చెట్లు మూడు పూటలా ఎక్కడం, తాటి ఆకులతో పూరి ఇళ్లు, చావిడిలు కప్పడం చేస్తూ ఉండేవాడు. పని పూర్తయ్యాక ఆ ఇంటి వారు నాన్నకి మద్యం లేదా కల్లు తమ సంతోషం మేరకు పోసేవారు.. మరి ఆ రోజు ఓ వైపు తీవ్రమైన ఎండ ప్రభావమో, విశ్రాంతి లేకపోవడం, కొంత కల్లు తాగడం వలనో కళ్ళు తిరిగి పడిపోయాడు.

నాన్న నడుచుకుంటూ మా వైపు వచ్చే కొలది నా గుండె కొట్టుకునే వేగం మరింత పెరిగింది. నాన్న దగ్గరికి వెళ్లి సైకిల్ పట్టుకుందామంటే భయం వేసింది.. "నువ్వు ఎందుకు మంచినీళ్లు తీసుకురాలేదు?" అని తిడతారనే భయం ఒక వైపు. తండ్రి విశ్రాంతి లేకుండా ఇంత కష్టపడుతున్నా, ఆటల్లో పడి ఒక చిన్న పని కూడా చేయలేకపోయాను అనే బాధ మరోవైపు.. నామీద నాకే కోపం.

నడుస్తున్న సైకిల్ పైన సొట్ట పడిన జోడు బిందెల్లో అడుగున ఉన్న కదిలే నీటి లాగే..
నా మనసులో ఆలోచనలు కూడా నన్ను ఆ క్షణాన కుదిపేశాయి..
వేసవి దాటికి మా వీధిలో కాలే ఇసుకలో నా పాదాలు కూరుకుపోయినట్లు, కదలలేక ముందుకు సాగలేక.. నాన్న వెనుకే నా అడుగులు బరువైన గుండెతో ఇంటి వైపు భారంగా కదిలాయి.



  • సమాప్తం


    మీ చిన్నతనంలో నీటి కోసం ఇలా సైకిల్ మీద వెళ్లారా? లేదా ఇంకేదైనా మర్చిపోలేని పల్లెటూరి జ్ఞాపకం ఉందా? కింద కామెంట్స్ లో తెలియజేయండి.

Monday, 1 June 2026

పుస్తకం : జిగిరి లో నాకు నచ్చిన విశేషాలు.

 జిగిరి:

మనిషికి - ఆటవిక జీవికి మధ్య అద్భుతమైన అనుబంధాన్ని చూపించిన కథ జిగిరి.



వేసవి సెలవుల్లో ఇంటికి వెళ్తూ బ్యాగ్ నిండా బట్టలు , ల్యాప్టాప్ పెట్టుకున్నాను. ప్రయాణం చేస్తూ నా బ్యాగ్ లో ఏదైనా పుస్తకం పెట్టుకోవడం అలవాటు. ఈసారి బ్యాగ్ బాగా నిండిపోయింది. చిన్నదంటే చాలా చిన్నది ఏదైనా పుస్తకం పెట్టుకుందామని నా పుస్తకాల అల్మారా చూశాను. ఎప్పటినుంచో చదువుదామని అనుకుంటున్నా జిగిరి అనే చిన్ని 100 పేజీలు పుస్తకం నా బ్యాగ్ లోకి ప్రయాణంలో తోడుగా చేరింది.

కథ ఏంటంటే : తాత ముత్తాతలు నుంచి ఎలుగుబంటులను ఆడించే కుటుంబం ఇమామ్ ది. తను కూడా ఎలుగుబంటిని (షాదుల్) ఆడిస్తూ జీవనాధారం సాగిస్తూ ఉంటాడు, మన కథ ప్రారంభంలో ప్రభుత్వం ఆటవిక జంతువుల్ని వదులుకోవాలని చెబుతుంది , అందుకు ప్రతిగా రెండు ఎకరాల భూమిని ఇస్తానని మాట ఇస్తుంది . కానీ మన కథానాయకుడు ఇమామ్ కు 20 సంవత్సరాల నుంచి ఎలుగుతో  ఉన్న పుత్ర సమానమైన అనుబంధం వలన వదులుకోవడానికి ఇష్టపడడు. ఇందుకు వ్యతిరేకంగా ఇమామ్ కొడుకు చాంద్ రెండు ఎకరాల కోసం ఎలుగు(షాదుల్) ని చంపడానికి కూడా వెనకాడడు. తండ్రి కొడుకులు మధ్య జరిగే సంఘర్షణే ఈ కథ . కథలో ఒకవైపు మానవత్వాన్ని మరోవైపు స్వార్ధాన్ని రచయిత పెద్దింటి అశోక్ కుమార్ గారూ అద్భుతం ఆవిష్కరించారు.

ఈ చిన్న నవలలో నాకు నచ్చిన విశేషాలు. 1. చిన్న ఎలుగు (షాదుల్)ను సంపాదించడం కోసం అడవికి వెళ్లి ఇమామ్ చేసిన అద్భుతమైన సాహసం కార్యం.2. ఇమామ్ భార్య బీబమ్మ ఎలుగు చిన్నగా ఉన్నప్పుడు ఒక వైపు చాంద్ కి మరోవైపు ఎలుగు (షాదుల్) కి పాలు ఇస్తూ పొందే మాతృభావన. 3. ఒక ఊరులో పేరు పొందిన కుస్తీ యోదుడితో ఎలుగు కుస్తీ పట్టే ఘట్టం. 4. చాంద్ ఎలుగును చంపడానికి గుంట తీసి అందులో షాదుల్ ను తోస్తుంటే ఆట ఆడిస్తున్నాడు అనుకుని అమాయకంగా గుంటకి అటూ, ఇటూ గెంతడం.5. చివరి ఘట్టంలో షాదుల్ ను తిరిగి అడవిలో వదులుదాం అని వెళ్ళినప్పుడు ఇమామ్ పొందిన మానసిక సంఘర్షణను తారాస్థాయిలో ఆవిష్కరించారు రచయిత.

పెద్దింటి అశోక్ కుమార్ గారు ఎలుగులను ఆడించేవారి జీవితాలను మంచి సునిశిత పరిశీలనతో కళ్ళకు కట్టినట్లు చూపించారు.ఎన్నో భాషల్లోకి అనువాదం అయిన ఈ నవలలోజంతువు నుంచి మానవత్వం పొందిన ఆటవిక మృగాన్ని స్వార్థం వలన మనిషి నుండి మృగంగా మారిన వైనాన్ని ఏకబిగిన చదివించే విధంగా రచించారు.మీరు కూడా చదివారా ఈ పుస్తకం మీకు ఎలా అనిపించింది?

Thursday, 7 May 2026

Song : నవ మాసాలు నన్ను మోసిన ఓ తల్లి

Mother's day 2026 special song
సృష్టిలో అమ్మ ప్రేమ అద్భుతం అనంతం..
నిత్యం బిడ్డలు శ్రేయస్సునే కోరే అమ్మ భూమి పైన నడిచే ప్రత్యేక్ష దైవం.
అందుకే మన పూర్వీకులు కూడా "మాతృదేవోభవ" అనే మాటతో అమ్మకు మొదటి స్థానం ఇచ్చారు.
లోకంలో తల్లులు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ అక్షర అంజలి.

పాట రచనలో సహకారం అందించిన వెంకోరా అన్నయ్యకు మరియు మనోహర్ K గారికి ప్రత్యేక ధన్యవాదాలు.

Full Lyrical Song on YouTube : నవ మాసాలు నన్ను మోసిన ఓ తల్లి

Music & Vocals : Suno AI పల్లవి: నవ మాసాలు నన్ను మోసిన ఓ తల్లి నా జన్మకై నువ్వు పునర్జన్మించావు మళ్ళీ దైవం రూపేనా ఇలలో వెలసిన కల్పవల్లి ప్రతిఫలం కోరక ప్రేమ వెన్నెల కురిపించే నిండు జాబిల్లి.. నవ మాసాలు నన్ను మోసిన ఓ తల్లి నా జన్మకై నువ్వు పునర్జన్మించావు మళ్ళీ చరణం 1: అమ్మా.. తల్లితనం కోసం తల్లడిల్లి.. ఎన్ని నోములు నోచావో.. ఎన్ని పూజలు చేసావో.. నలుసుగా నీ కడుపున పడితే.. ఎన్ని దీక్షలు చేసావో.. ఎన్ని కష్టాలు కోర్చావో.. పుడమికి నే వచ్చినప్పుడు.. ఎంత మురిసి పోయావో... ఎంత కరిగి పోయావో.. నా తొలి అడుగు పడితే.. ఎంత ఆనందించావో.. ఎంత పరవశించావో.. [Chorus] నవ మాసాలు నన్ను మోసిన ఓ తల్లి నా జన్మకై నువ్వు పునర్జన్మించావు మళ్ళీ చరణం 2: నీ చేతి గోరుముద్దలో.. అమృతం అద్దావు నీ నోట లాలిపాటతో.. నిద్రలో ముంచావు నీ ఒడినే బడిగా మార్చి.. పలుకులు నేర్పావు కంటికి కునుకు లేకనే.. నను కాచుకున్నావు బిడ్డ అడుగు బయట పెడితే.. మనిషి ఇంట్లో.. కనులు వాకిట్లో.. ఆ ఎదురు చూపులకు నే ఎదురైతే.. కోటి కాంతుల తేజాన్ని కళ్ళలో కురిపించావు [Chorus] నవ మాసాలు నన్ను మోసిన ఓ తల్లి నా జన్మకై నువ్వు పునర్జన్మించావు మళ్ళీ చరణం 3: ఆకాశమంత అవధి లేని ప్రేమే నీదమ్మా భూమాతకు సాటి సహనం ఓర్పే నీదమ్మా గంగమ్మలా ఉప్పొంగే అనురాగం నీదమ్మా గాలిలా నను వెన్నంటి ఊపిరి నీవమ్మా అగ్ని తేజస్సుతో నిత్యం యజ్ఞమే నీవమ్మా పంచభూతాలకు ప్రతిరూపమే నీవేనమ్మా ఇలలోన నడయాడే దైవమే నీవేనమ్మా నవ మాసాలు నన్ను మోసిన ఓ తల్లి నా జన్మకై నువ్వు పునర్జన్మించావు మళ్ళీ దైవం రూపేనా ఇలలో వెలసిన కల్పవల్లి ప్రతిఫలం కోరక ప్రేమ వెన్నెల కురిపించే నిండు జాబిల్లి.. నవ మాసాలు నను మోసిన ఓ తల్లి.. నిత్యం నీ మదిలో నను మోస్తావు మళ్ళీమళ్ళీ.. నీ ఋణం తీర్చుటకు ఈ జన్మ సరిపోదు నను కన్న తల్లి.. 07/05/2026

Sunday, 12 April 2026

ఉషశ్రీ భాగవతం పుస్తక పఠనం

 


మార్చి నెలలో నేను చదివిన పుస్తకం ఉషశ్రీ భాగవతం. "భాగవతం చదివితే బాగు అవుతాం" అని పెద్దల మాట.




నాకు పురాతన దేవాలయాలు సందర్శించడం అంటే ఎంతో ఇష్టం. ఆ దేవాలయ గోడలు మీద రామాయణ భారత భాగవత శిల్పాలను చెక్కిన విధానం చూస్తుంటే ఆ శిల్పాల యొక్క అందంతోపాటు , ఆ కథల యొక్క అంతర్యాన్ని తెలుసుకోవాలనిపిస్తుంది. అందులో భాగంగా భాగవతం చదవాలని అనుకున్నాను.  ఉషశ్రీ గారి భాగవతం పుస్తకం ఎంచుకున్నాను. 

ఎన్నో కథలు.. ఎన్నెన్నో వింతలూ విశేషాలు..

ఉషశ్రీ గారి వచనం అమృతం. 


ఈ భాగవత కథల్లో నాకు నచ్చిన కొన్ని విశేషాలను మీతో పంచుకుంటాను. 

ముందుగా తండ్రి మాట కోసం, తండ్రి కోసం తపించిన ముగ్గురు కొడుకులు.. అందులో ఒకరు తండ్రి మాటకై రాజ్యం వదిలి అడవికి వెళితే, మరొకరు తండ్రి అజ్ఞను శిరసావహిస్తూ తన తల్లి శిరసునే ఖండించిన వ్యక్తి, మరో వ్యక్తి  తన తండ్రి కోసం తన యవ్వనాన్ని తండ్రికి ధారపోసి, తండ్రి ముసలితనాన్ని తాను స్వీకరించిన వ్యక్తి.. ఈ ముగ్గురు కథలు భాగవతంలో చదువుతుంటే అద్భుతంగా ఆదర్శంగా అనిపించాయి.. ఆ ముగ్గురు ఎవరో మీరు గుర్తించగలరా? కామెంట్ బాక్స్ లో జత చేయండి. 


మరో కథలో మనవడి ప్రేమ కోసం తాత చేసిన అద్భుతమైన యుద్ధం.. ఈ యుద్ధంలో తాత వెయ్యి చేతుల వ్యక్తిని మరియు శివున్ని ఎదిరించి మనవడి ప్రేమని గెలిపిస్తాడు.. ఆ తాత- ఆ మనవడు ఎవరో చెప్పండి చూద్దాం..?



ఇంకో కథ చూస్తే అందులో ఊర్వశి- పురారవుల ప్రేమ కథ. ఊర్వశి ప్రేమ కోసం పురారవుడు తపించిన విధానం.. ఆ ప్రేమను అంగీకరించడానికి ఊర్వశి విధించిన వింతైన షరతులు(తన రెండు గొర్రెలను బిడ్డలు లాగా చూడాలి, తన ముందు దిగంబరంగా ఉండరాదు) చదువుతుంటే వింతగా అనిపించాయి..


అతిధిని సేవించకుండా ముందే ఆహారం స్వీకరించాడని ఓ ముని కోపగ్రస్తుడైతే ఆ ఋషి జటములోనుంచి ఉద్భవించిన రాక్షసుడు.. తన భక్తుడి కోసం వచ్చిన సుదర్శన చక్రం.. ఆ మునిని ముల్లోకాలు తిప్పి తిరిగి భక్తుని దగ్గరికి వచ్చి శరణు వేడిన విధానం ..అంబరీషుని కథ చదువుతుంటే భగవంతున్ని నమ్మితే ఆయనే నీ తోడు, నీడై ఉంటాడు అనిపించింది.


దక్ష యజ్ఞంలో భాగంగా వీరభద్రుని దాటికి సూర్యుడు దంతాలు కోల్పోవడం.. మెత్తనివే ఆహార పదార్థాలు ఆయనకు ఆహారం అని ఈ భాగవతం చదివాకే నేను తెలుసుకున్నాను.


కృష్ణుడు కి 16 వేల మంది గోపికలు కదా.. మరి వారందరితో ఆయన ఎంత అనురాగంగా ఉంటున్నాడో చూడాలని నారదమునికి ఓసారి కోరిక కలుగుతుంది. కృష్ణుని అంతఃపురమునకు వెళ్తే ఆయన చూపించని లీలలు అద్భుతంగా అనిపించాయి..

ఓ చోట ఒక భార్య వింజామర విసురుతుంటే కృష్ణుడు కబుర్లు చెబుతూ కనిపిస్తాడు. మరోచోట సింహాసనం అధిష్టించి నారద మహర్షిని చూడగానే దిగివచ్చి నమస్కారం చేసి సాదరంగా ఆహ్వానిస్తాడు. ఇంకోచోట కృష్ణుడు తన భార్య తో కలిసి చదరంగం ఆడుతూ ఉంటాడు. మరోచోట తన ప్రియురాలికి ముత్యాల హారం వేస్తూ ఉంటాడు, మరోచోట తన కుమారులతో ముచ్చట్లు లాడుతూ ఉంటాడు.. ఇలా ఒకే వ్యక్తి అనేక చోట్ల చూపించే శ్రీకృష్ణ లీలలు ఈ భాగవతం కథలో అద్భుతంగా అనిపించాయి.


అంతే కాదు కర్మేంద్రియాలు, పంచేంద్రియాలు, పంచభూతాలు వాటి తత్వాలు ఇలాంటి ఎన్నో విశేషాలను చాలా చక్కగా వివరించారు ఉషశ్రీ గారు ఈ భాగవతం కథలో ఓ చోట.మధ్య మధ్యలో పోతన గారి అందమైన పదాలతో కూడిన భాగవత పద్యాలను కూడా ఈ పుస్తకంలో జత చేశారు..  ఈ పుస్తకం లో ఆ పద్యాలు చదివాక భాగవతం పూర్తి పద్యాలతో చదవాలి అనిపించింది. పద్యాలు పైకి చదువుతుంటే పదాలు, వినసొంపుగా అందంగా ఉన్నాయి.


క్షీరసాగర మథనంలో ఓ పద్యం చూడండి..


హరి సూచిన సిరి సూడదు..

సిరి సూచిన హరియుజూడ సిగ్గును పొందున్..

హరియును సిరియును తమలో..

సరిజూపుల చూడ మరుడు సందడి చేసెన్


పోతన గారి గురించి ఇంటర్నెట్లో చదివాను. ఆయన ఒకపక్క హలం పట్టి వ్యవసాయం చేస్తూనే మరోపక్క ఈ అద్భుతమైన భాగవతాన్ని రచించారని తెలుసుకునే ఆశ్చర్యపోయాను. ఓ చోట ప్రహ్లాదుడు "గృహస్థుడు కి కర్మ ప్రధానం" అని చెబుతారు. అలాగే పోతన తన ప్రధాన జీవనోపాధి అయిన వ్యవసాయం కర్మ చేస్తూ.. మరోవైపు ఈ అద్భుతమైన భాగవతం రచించి ఆచరణలో చూపించారు. నాకు చాలా ప్రేరణగా అనిపించింది. భవిష్యత్తులో పోతన గారు జన్మించిన స్థలాన్ని.. భాగవతాన్ని రాముడు కి అంకితం ఇచ్చిన ప్రదేశాలు సందర్శించాలి అనుకుంటున్నాను.


సులభమైన వచనంలో అందించిన ఉషశ్రీ గారి శైలి అద్భుతం.. ఏకబిగిన చదివించేది ఆయన శైలి. సంక్షిప్త రూపంలో ఉన్న ఉషశ్రీ భాగవతం చదివాక పూర్తి స్థాయిలో ఆ కథలు అన్ని మళ్ళీ చదవాలని మనస్సు ఉవ్విళ్ళూరుతుంది.

మీరు కూడా భాగవతం చదివి ఉంటే ఏ పుస్తకం చదివారో.. మీ అనుభవాలు చెప్పండి.


Friday, 3 April 2026

తాటి సెట్టు కథనే వినరో Song

తాటి సెట్టు కథనే వినరో  పాట వినడానికితాటి సెట్టు కథనే వినరో

[పల్లవి]

తాటి సెట్టు కథనే వినరో..కల్పవృక్షం చరితను కనరో..నిలువెత్తు నిలబడిన రూపం..గ్రామ ప్రజలకు అసలైన నేస్తం!

[చరణం 1] ఎండకు వానకు కాచే నీడయ్యింది..కాలువ దాటగ వంతెన అయ్యింది.. ఎండిన మట్టలు వంట చెరుకైంది..అమృతం సరిసమానమైన కల్లు నిచ్చింది!

తాటి సెట్టు కథనే వినరో..కల్పవృక్షం చరితను కనరో..

[చరణం 2]బ్రహ్మంగారి కాలజ్ఞానం..తాలపత్ర భాండాగారం..విజ్ఞానానికి తాటి సెట్టే మూలాధారం..గ్రామ దేవత గుడి ముందర..పోతురాజు రూపమై కొలువైంది!

తాటి సెట్టు కథనే వినరో..కల్పవృక్షం చరితను కనరో..



[చరణం 3]పిల్లల చేతిలో కిరికిరి బండై..తాటి బూరల అల్లరి రాగమై..అట్లతద్దిన ఊయలై మనసును ఊపింది..పేదవాని ఇంటికి నిట్టాడై నిలిచింది!

తాటి సెట్టు కథనే వినరో..కల్పవృక్షం చరితను కనరో..


[చరణం 4]ముంజలై..  తేగలై.. తాటి బెల్లమై..ఎన్నో రుచులతో విందులు చేసింది..బుట్టలై.. చాపలై.. విసనకర్రలై..ఎన్నో రూపాలై సేవలు చేసింది..కొమ్మల్లేని చెట్టైనా కోటి ఉపయోగాలు..తరతరాల తెలుగువారి తీపి జ్ఞాపకాలు!

తాటి సెట్టు కథనే వినరో..కల్పవృక్షం చరితను కనరో..నిలువెత్తు నిలబడిన రూపం..గ్రామ ప్రజలకు అసలైన నేస్తం!

Thursday, 2 April 2026

ఉగాది 2026 Song

ఉగాది  2026  పాట వినడానికి: : ఉగాది 2026 Song 

తెలుగింటి ఉగాది.. వెలుగులకు పునాది..
వసంతాన ఉగాది.. చిగురాశల యుగాది..
[Chorus]
తెలుగింటి ఉగాది.. వెలుగులకు పునాది..
వసంతాన ఉగాది.. చిగురాశల యుగాది..

[Charanam 1]
ఇంట పచ్చ తోరణములు ఆభరణములై తోచే..
చైత్రాన మధుమాసం దరహాసముతో మెరిసే..
కాలరూపమున జగన్మాతను వసంత నవరాత్రులలో కొలిచే..
ప్రకృతిలో‌.. ప్రతి బతుకున.. కొత్త ఆశలు చిగురించే..
ప్రకృతిలో‌.. ప్రతి బతుకున.. కొత్త ఆశలు చిగురించే.. 


[Chorus]
తెలుగింటి ఉగాది.. వెలుగులకు పునాది..
వసంతాన ఉగాది.. చిగురాశల యుగాది..



[Charanam 2]
రైతన్న హలం పట్టి ఏరువాక సాగెను..
పండితుడు గళం ఎత్తి పంచాంగం చదివెను..
భావకవి కలం పట్టి ప్రకృతిని వర్ణించెను..
కోకిలమ్మ కొమ్మలెక్కి రాగమాలపించెను..
కోకిలమ్మ కొమ్మలెక్కి రాగమాలపించెను..

[Chorus]
తెలుగింటి ఉగాది.. వెలుగులకు పునాది
వసంతాన ఉగాది.. చిగురాశల యుగాది

[Charanam 3]
షడ్రుచులను కలగలిపి.. దైవానికి నివేదించి
ప్రసాదంగా స్వీకరించి.. బ్రతుకున అన్వయించి
కష్ట-సుఖాలను సమదృష్టితో చూడమని
ముందుకు మున్ముందుకు సాగమని
కష్ట-సుఖాలను సమదృష్టితో చూడమని
ముందుకు మున్ముందుకు సాగమని
సందేశం ఇచ్చెను. ఈ ఉగాది పచ్చడి!
[Chorus]
తెలుగింటి ఉగాది.. వెలుగులకు పునాది
వసంతాన ఉగాది.. చిగురాశల యుగాది
హే.. వచ్చే వచ్చే ఉగాది.. కొత్త ఆశల యుగాది హే హే.. వచ్చే వచ్చే ఉగాది.. కొత్త ఆశల యుగాది వచ్చే వచ్చే ఉగాది.. కొత్త ఆశల యుగాది!

Sunday, 22 February 2026

పుస్తకం - అభినిర్యాణం

 


ఫిబ్రవరిలో చదివిన ఓ పుస్తకం "అభినిర్యాణం"





"సోలో ట్రిప్స్ అనేవి ఒక వరం. మనం ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆలోచనల ఉత్కంఠ ఒకలా ఉంటుంది.. అదే ఇతరులతో ఉన్నప్పుడు వాళ్లకు తగినట్లు ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఎక్కడికైనా వెళ్లాలి అంటే ఏదో ఒక తోడు ఉంటే బాగుండు అని కోరుకుంటారు. నిజానికి ఒక మనిషికి అత్యంత అమూల్యమైన తోడు ఈ ప్రకృతి. ఏంటి నమ్మరా ? అయితే ఒకసారి ఒంటరిగా ప్రయాణం చేసి చూడండి తిరిగి వచ్చాక మీరే చెప్తారు అనుభూతి గురించి" 

పుస్తకంలో ఈ వాక్యాలు నన్ను చాలా బాగా ఆకట్టుకున్నాయి 


ప్రయాణాలన్నా ,పురాతన దేవాలయాలు- అక్కడ విశేషాలు తెలుసుకోవాలని ఎంతో ఆసక్తి కనపరిచే నాకు "అభినిర్యాణం" అనే పుస్తకం పుస్తకాలు పండుగలో చాలా ఆసక్తికరంగా కనిపించింది.


ఈ పుస్తకంలో కథ సమాంతరంగా రెండు కాలాల్లో సాగుతూ ఉంటుంది..

ప్రస్తుత కాలంలో అభి అనే యువకుడు మరియు రాయల కాలంలో భారతదేశం యొక్క సంస్కృతి, కళలు తెలుసుకోవాలని ఉత్సాహంతో భారత్ కు వచ్చిన రాయ్ అనే ఇంగ్లాండ్ దేశస్తుడు.. ఇలా ఇద్దరు రెండు వేరు వేరు కాలాల్లో చేసిన ప్రయాణమే అభి నిర్యాణం.. 


అభి తన ప్రాజెక్ట్ వర్క్ కోసం తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి వెళ్తాడు, అక్కడ దేవాలయంలో  అనంతమైన నిధి ఉన్న ఆరో గది విశేషాలు తెలుసుకుంటాడు.  దానికి సంబంధించిన తాళపత్ర గ్రంథాలు కూడా దొరుకుతాయి, కానీ ఆ తాళపత్ర గ్రంధాలు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు 5 వారాల సమయంలో నాగబంధనం ఉన్న గది తాళం చెవి సంపాదించాలి లేకపోతే ప్రాణగండం ఉంటుంది..

ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు, ఒంటరిగా ప్రయాణం చేయాలి.. చీకటంటే భయపడే అభి ఏ విధంగా తాళం చెవి సంపాదించాడు. ఆ ప్రయాణంలో ఎదురైన సాహసోపేతమైన సంఘటనలు.. వేరు వేరు కాలాల్లో ప్రయాణించే రాయ్ మరియు అభికి ఉన్న సంబంధం ఏంటి అనేది పుస్తకం చుదువుతుంటే చాలా ఆసక్తిగా అనిపిస్తుంది.


ఈ కథలో విశేషం ఏంటంటే కథానాయకులు అభి , రాయ్ ఇద్దరు కూడా కళను ఆరాధించే వారే.. అభి Profesional photographer మరియు రాయ్ కుంచె తో అద్భుతమైన సృష్టి చేసే చిత్రాకారుడు. ఇద్దరు ఈ ప్రయాణంలో తమ కంటితో చూసిన ఘట్టాలను అందమైన దృశ్యాలులాగా రచయిత చదువరులకు కళ్ళకు కట్టినట్లు చూపించారు.

తిరువనంతపురంలో అభి చూసిన సంఘటన

"సూర్యుడు నిజంగా చిన్నపిల్లాడిలా గోడను పట్టుకుని మెట్లు దిగుతున్నట్లు మెల్లగా కిందకి దిగుతుంటే గోపురం మధ్యభాగం నుండి కనిపించింది." ఆ దృశ్యాన్ని అందమైన ఫోటో తీసాడు అభి.


హంపీలో రాయ్ చూసిన సంఘటన 

" అది విజయ విఠల దేవాలయం.. ప్రాంగణం నాట్య ప్రదర్శనకు సిద్ధం అయ్యింది, అతిరథమహారధులు అంతా వీక్షిస్తున్నారు.. సంగీతం పలికించే స్థంబాలు దగ్గర సంగీత విద్వాంసులు వెదురు కర్రలతో స్థంభాన్ని తాకుతుంటే ఒక్కో స్థంభం దగ్గర ఒక్కో శృతి, సరిగమలకు అనుగుణంగా అణువుఅణువున యజ్నంలా నాట్యం చేస్తున్న నర్తకి." ఓ అందమైన దృశ్యాన్ని రాయ్ చిత్రీకరించాడు..


నాగబంధనం ఉన్న ఆరవ గది తాళం వెతికే క్రమంలో మనం కూడా వివిధ ప్రదేశాల్లో ప్రయాణం చేస్తాం..

హంపిలో విజయనగర కాలం లోకి..

ద్వారకాలో గోమతి నది సముద్రం సంగమం అయ్యే ప్రదేశానికి..

పురాతన కాశీలో మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్ ల వద్దకు..

బుద్దగయాలో ప్రేతశిల -  యమధర్మరాజు దేవాలయం ఉన్న ఎత్తైన కొండ పర్వతం మీదకు..


ఇలా కథ రెండు వేరు వేరు శతాబ్దాలలో ఆ ప్రాంతం విశేషాలను పాఠకుడు కి చెబుతూ ఎన్నో మలుపులు తిరుగుతూ ఆరవ గది తాళం చెవి శోధించడంలో ఉత్కంఠను కలిగిస్తుంది.


రచయిత ప్రవర్ష్ మనకు ఈ పుస్తక పఠన ప్రయాణంలోఎన్నో విశేషాలను చాలా బాగా పరిశోధించి చెప్పారు..

1.తిరువనంత పురం అనంత పద్మనాభ స్వామి విగ్రహం వెనుక ఉన్న కథ.

2.హంపీలో దేవాలయంలో రక్షణలా కనిపించే యాళీ.

3.కాశీలో అఘోరాలు జీవన విధానం, బెనారస్ చీరలు ప్రాముఖ్యత.

4.మొఘల్ నవాబుల కాలంలో దేవదాసీలు 

5.బ్రటీష్ రాజ్యంలో భారత్ ను వంశం చేసుకోవాలనే కోరిక కలిగిన విధానం.

6.ఆలయంలో పూజలు అందుకునే దేవతామూర్తి శిల్పం తయారిలో వివిధ రకాల అంచెలు - శిల్ప కళ విశేషాలు..


ఈ పుస్తకం చదివాక మన భారతదేశంలో అనేక ప్రదేశాలను సందర్శించిన అనుభూతి కలిగింది .


- శ్రీనివాస చక్రవర్తి.