Monday, 1 June 2026

పుస్తకం : జిగిరి లో నాకు నచ్చిన విశేషాలు.

 జిగిరి:

మనిషికి - ఆటవిక జీవికి మధ్య అద్భుతమైన అనుబంధాన్ని చూపించిన కథ జిగిరి.



వేసవి సెలవుల్లో ఇంటికి వెళ్తూ బ్యాగ్ నిండా బట్టలు , ల్యాప్టాప్ పెట్టుకున్నాను. ప్రయాణం చేస్తూ నా బ్యాగ్ లో ఏదైనా పుస్తకం పెట్టుకోవడం అలవాటు. ఈసారి బ్యాగ్ బాగా నిండిపోయింది. చిన్నదంటే చాలా చిన్నది ఏదైనా పుస్తకం పెట్టుకుందామని నా పుస్తకాల అల్మారా చూశాను. ఎప్పటినుంచో చదువుదామని అనుకుంటున్నా జిగిరి అనే చిన్ని 100 పేజీలు పుస్తకం నా బ్యాగ్ లోకి ప్రయాణంలో తోడుగా చేరింది.

కథ ఏంటంటే : తాత ముత్తాతలు నుంచి ఎలుగుబంటులను ఆడించే కుటుంబం ఇమామ్ ది. తను కూడా ఎలుగుబంటిని (షాదుల్) ఆడిస్తూ జీవనాధారం సాగిస్తూ ఉంటాడు, మన కథ ప్రారంభంలో ప్రభుత్వం ఆటవిక జంతువుల్ని వదులుకోవాలని చెబుతుంది , అందుకు ప్రతిగా రెండు ఎకరాల భూమిని ఇస్తానని మాట ఇస్తుంది . కానీ మన కథానాయకుడు ఇమామ్ కు 20 సంవత్సరాల నుంచి ఎలుగుతో  ఉన్న పుత్ర సమానమైన అనుబంధం వలన వదులుకోవడానికి ఇష్టపడడు. ఇందుకు వ్యతిరేకంగా ఇమామ్ కొడుకు చాంద్ రెండు ఎకరాల కోసం ఎలుగు(షాదుల్) ని చంపడానికి కూడా వెనకాడడు. తండ్రి కొడుకులు మధ్య జరిగే సంఘర్షణే ఈ కథ . కథలో ఒకవైపు మానవత్వాన్ని మరోవైపు స్వార్ధాన్ని రచయిత పెద్దింటి అశోక్ కుమార్ గారూ అద్భుతం ఆవిష్కరించారు.

ఈ చిన్న నవలలో నాకు నచ్చిన విశేషాలు. 1. చిన్న ఎలుగు (షాదుల్)ను సంపాదించడం కోసం అడవికి వెళ్లి ఇమాన్ చేసిన అద్భుతమైన సాహసం కార్యం.2. ఇమాన్ భార్య బీబమ్మ ఎలుగు చిన్నగా ఉన్నప్పుడు ఒక వైపు చాంద్ కి మరోవైపు ఎలుగు (షాదుల్) కి పాలు ఇస్తూ పొందే మాతృభావన. 3. ఒక ఊరులో పేరు పొందిన కుస్తీ యోదుడితో ఎలుగు కుస్తీ పట్టే ఘట్టం. 4. చాంద్ ఎలుగును చంపడానికి గుంట తీసి అందులో షాదుల్ ను తోస్తుంటే ఆట ఆడిస్తున్నాడు అనుకుని అమాయకంగా గుంటకి అటూ, ఇటూ గెంతడం.5. చివరి ఘట్టంలో షాదుల్ ను తిరిగి అడవిలో వదులుదాం అని వెళ్ళినప్పుడు ఇమామ్ పొందిన మానసిక సంఘర్షణను తారాస్థాయిలో ఆవిష్కరించారు రచయిత.

పెద్దింటి అశోక్ కుమార్ గారు ఎలుగులను ఆడించేవారి జీవితాలను మంచి సునిశిత పరిశీలనతో కళ్ళకు కట్టినట్లు చూపించారు.ఎన్నో భాషల్లోకి అనువాదం అయిన ఈ నవలలోజంతువు నుంచి మానవత్వం పొందిన ఆటవిక మృగాన్ని స్వార్థం వలన మనిషి నుండి మృగంగా మారిన వైనాన్ని ఏకబిగిన చదివించే విధంగా రచించారు.మీరు కూడా చదివారా ఈ పుస్తకం మీకు ఎలా అనిపించింది?

Thursday, 7 May 2026

Song : నవ మాసాలు నన్ను మోసిన ఓ తల్లి

Mother's day 2026 special song
సృష్టిలో అమ్మ ప్రేమ అద్భుతం అనంతం..
నిత్యం బిడ్డలు శ్రేయస్సునే కోరే అమ్మ భూమి పైన నడిచే ప్రత్యేక్ష దైవం.
అందుకే మన పూర్వీకులు కూడా "మాతృదేవోభవ" అనే మాటతో అమ్మకు మొదటి స్థానం ఇచ్చారు.
లోకంలో తల్లులు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ అక్షర అంజలి.

పాట రచనలో సహకారం అందించిన వెంకోరా అన్నయ్యకు మరియు మనోహర్ K గారికి ప్రత్యేక ధన్యవాదాలు.

Full Lyrical Song on YouTube : నవ మాసాలు నన్ను మోసిన ఓ తల్లి

Music & Vocals : Suno AI పల్లవి: నవ మాసాలు నన్ను మోసిన ఓ తల్లి నా జన్మకై నువ్వు పునర్జన్మించావు మళ్ళీ దైవం రూపేనా ఇలలో వెలసిన కల్పవల్లి ప్రతిఫలం కోరక ప్రేమ వెన్నెల కురిపించే నిండు జాబిల్లి.. నవ మాసాలు నన్ను మోసిన ఓ తల్లి నా జన్మకై నువ్వు పునర్జన్మించావు మళ్ళీ చరణం 1: అమ్మా.. తల్లితనం కోసం తల్లడిల్లి.. ఎన్ని నోములు నోచావో.. ఎన్ని పూజలు చేసావో.. నలుసుగా నీ కడుపున పడితే.. ఎన్ని దీక్షలు చేసావో.. ఎన్ని కష్టాలు కోర్చావో.. పుడమికి నే వచ్చినప్పుడు.. ఎంత మురిసి పోయావో... ఎంత కరిగి పోయావో.. నా తొలి అడుగు పడితే.. ఎంత ఆనందించావో.. ఎంత పరవశించావో.. [Chorus] నవ మాసాలు నన్ను మోసిన ఓ తల్లి నా జన్మకై నువ్వు పునర్జన్మించావు మళ్ళీ చరణం 2: నీ చేతి గోరుముద్దలో.. అమృతం అద్దావు నీ నోట లాలిపాటతో.. నిద్రలో ముంచావు నీ ఒడినే బడిగా మార్చి.. పలుకులు నేర్పావు కంటికి కునుకు లేకనే.. నను కాచుకున్నావు బిడ్డ అడుగు బయట పెడితే.. మనిషి ఇంట్లో.. కనులు వాకిట్లో.. ఆ ఎదురు చూపులకు నే ఎదురైతే.. కోటి కాంతుల తేజాన్ని కళ్ళలో కురిపించావు [Chorus] నవ మాసాలు నన్ను మోసిన ఓ తల్లి నా జన్మకై నువ్వు పునర్జన్మించావు మళ్ళీ చరణం 3: ఆకాశమంత అవధి లేని ప్రేమే నీదమ్మా భూమాతకు సాటి సహనం ఓర్పే నీదమ్మా గంగమ్మలా ఉప్పొంగే అనురాగం నీదమ్మా గాలిలా నను వెన్నంటి ఊపిరి నీవమ్మా అగ్ని తేజస్సుతో నిత్యం యజ్ఞమే నీవమ్మా పంచభూతాలకు ప్రతిరూపమే నీవేనమ్మా ఇలలోన నడయాడే దైవమే నీవేనమ్మా నవ మాసాలు నన్ను మోసిన ఓ తల్లి నా జన్మకై నువ్వు పునర్జన్మించావు మళ్ళీ దైవం రూపేనా ఇలలో వెలసిన కల్పవల్లి ప్రతిఫలం కోరక ప్రేమ వెన్నెల కురిపించే నిండు జాబిల్లి.. నవ మాసాలు నను మోసిన ఓ తల్లి.. నిత్యం నీ మదిలో నను మోస్తావు మళ్ళీమళ్ళీ.. నీ ఋణం తీర్చుటకు ఈ జన్మ సరిపోదు నను కన్న తల్లి.. 07/05/2026

Sunday, 12 April 2026

ఉషశ్రీ భాగవతం పుస్తక పఠనం

 


మార్చి నెలలో నేను చదివిన పుస్తకం ఉషశ్రీ భాగవతం. "భాగవతం చదివితే బాగు అవుతాం" అని పెద్దల మాట.




నాకు పురాతన దేవాలయాలు సందర్శించడం అంటే ఎంతో ఇష్టం. ఆ దేవాలయ గోడలు మీద రామాయణ భారత భాగవత శిల్పాలను చెక్కిన విధానం చూస్తుంటే ఆ శిల్పాల యొక్క అందంతోపాటు , ఆ కథల యొక్క అంతర్యాన్ని తెలుసుకోవాలనిపిస్తుంది. అందులో భాగంగా భాగవతం చదవాలని అనుకున్నాను.  ఉషశ్రీ గారి భాగవతం పుస్తకం ఎంచుకున్నాను. 

ఎన్నో కథలు.. ఎన్నెన్నో వింతలూ విశేషాలు..

ఉషశ్రీ గారి వచనం అమృతం. 


ఈ భాగవత కథల్లో నాకు నచ్చిన కొన్ని విశేషాలను మీతో పంచుకుంటాను. 

ముందుగా తండ్రి మాట కోసం, తండ్రి కోసం తపించిన ముగ్గురు కొడుకులు.. అందులో ఒకరు తండ్రి మాటకై రాజ్యం వదిలి అడవికి వెళితే, మరొకరు తండ్రి అజ్ఞను శిరసావహిస్తూ తన తల్లి శిరసునే ఖండించిన వ్యక్తి, మరో వ్యక్తి  తన తండ్రి కోసం తన యవ్వనాన్ని తండ్రికి ధారపోసి, తండ్రి ముసలితనాన్ని తాను స్వీకరించిన వ్యక్తి.. ఈ ముగ్గురు కథలు భాగవతంలో చదువుతుంటే అద్భుతంగా ఆదర్శంగా అనిపించాయి.. ఆ ముగ్గురు ఎవరో మీరు గుర్తించగలరా? కామెంట్ బాక్స్ లో జత చేయండి. 


మరో కథలో మనవడి ప్రేమ కోసం తాత చేసిన అద్భుతమైన యుద్ధం.. ఈ యుద్ధంలో తాత వెయ్యి చేతుల వ్యక్తిని మరియు శివున్ని ఎదిరించి మనవడి ప్రేమని గెలిపిస్తాడు.. ఆ తాత- ఆ మనవడు ఎవరో చెప్పండి చూద్దాం..?



ఇంకో కథ చూస్తే అందులో ఊర్వశి- పురారవుల ప్రేమ కథ. ఊర్వశి ప్రేమ కోసం పురారవుడు తపించిన విధానం.. ఆ ప్రేమను అంగీకరించడానికి ఊర్వశి విధించిన వింతైన షరతులు(తన రెండు గొర్రెలను బిడ్డలు లాగా చూడాలి, తన ముందు దిగంబరంగా ఉండరాదు) చదువుతుంటే వింతగా అనిపించాయి..


అతిధిని సేవించకుండా ముందే ఆహారం స్వీకరించాడని ఓ ముని కోపగ్రస్తుడైతే ఆ ఋషి జటములోనుంచి ఉద్భవించిన రాక్షసుడు.. తన భక్తుడి కోసం వచ్చిన సుదర్శన చక్రం.. ఆ మునిని ముల్లోకాలు తిప్పి తిరిగి భక్తుని దగ్గరికి వచ్చి శరణు వేడిన విధానం ..అంబరీషుని కథ చదువుతుంటే భగవంతున్ని నమ్మితే ఆయనే నీ తోడు, నీడై ఉంటాడు అనిపించింది.


దక్ష యజ్ఞంలో భాగంగా వీరభద్రుని దాటికి సూర్యుడు దంతాలు కోల్పోవడం.. మెత్తనివే ఆహార పదార్థాలు ఆయనకు ఆహారం అని ఈ భాగవతం చదివాకే నేను తెలుసుకున్నాను.


కృష్ణుడు కి 16 వేల మంది గోపికలు కదా.. మరి వారందరితో ఆయన ఎంత అనురాగంగా ఉంటున్నాడో చూడాలని నారదమునికి ఓసారి కోరిక కలుగుతుంది. కృష్ణుని అంతఃపురమునకు వెళ్తే ఆయన చూపించని లీలలు అద్భుతంగా అనిపించాయి..

ఓ చోట ఒక భార్య వింజామర విసురుతుంటే కృష్ణుడు కబుర్లు చెబుతూ కనిపిస్తాడు. మరోచోట సింహాసనం అధిష్టించి నారద మహర్షిని చూడగానే దిగివచ్చి నమస్కారం చేసి సాదరంగా ఆహ్వానిస్తాడు. ఇంకోచోట కృష్ణుడు తన భార్య తో కలిసి చదరంగం ఆడుతూ ఉంటాడు. మరోచోట తన ప్రియురాలికి ముత్యాల హారం వేస్తూ ఉంటాడు, మరోచోట తన కుమారులతో ముచ్చట్లు లాడుతూ ఉంటాడు.. ఇలా ఒకే వ్యక్తి అనేక చోట్ల చూపించే శ్రీకృష్ణ లీలలు ఈ భాగవతం కథలో అద్భుతంగా అనిపించాయి.


అంతే కాదు కర్మేంద్రియాలు, పంచేంద్రియాలు, పంచభూతాలు వాటి తత్వాలు ఇలాంటి ఎన్నో విశేషాలను చాలా చక్కగా వివరించారు ఉషశ్రీ గారు ఈ భాగవతం కథలో ఓ చోట.మధ్య మధ్యలో పోతన గారి అందమైన పదాలతో కూడిన భాగవత పద్యాలను కూడా ఈ పుస్తకంలో జత చేశారు..  ఈ పుస్తకం లో ఆ పద్యాలు చదివాక భాగవతం పూర్తి పద్యాలతో చదవాలి అనిపించింది. పద్యాలు పైకి చదువుతుంటే పదాలు, వినసొంపుగా అందంగా ఉన్నాయి.


క్షీరసాగర మథనంలో ఓ పద్యం చూడండి..


హరి సూచిన సిరి సూడదు..

సిరి సూచిన హరియుజూడ సిగ్గును పొందున్..

హరియును సిరియును తమలో..

సరిజూపుల చూడ మరుడు సందడి చేసెన్


పోతన గారి గురించి ఇంటర్నెట్లో చదివాను. ఆయన ఒకపక్క హలం పట్టి వ్యవసాయం చేస్తూనే మరోపక్క ఈ అద్భుతమైన భాగవతాన్ని రచించారని తెలుసుకునే ఆశ్చర్యపోయాను. ఓ చోట ప్రహ్లాదుడు "గృహస్థుడు కి కర్మ ప్రధానం" అని చెబుతారు. అలాగే పోతన తన ప్రధాన జీవనోపాధి అయిన వ్యవసాయం కర్మ చేస్తూ.. మరోవైపు ఈ అద్భుతమైన భాగవతం రచించి ఆచరణలో చూపించారు. నాకు చాలా ప్రేరణగా అనిపించింది. భవిష్యత్తులో పోతన గారు జన్మించిన స్థలాన్ని.. భాగవతాన్ని రాముడు కి అంకితం ఇచ్చిన ప్రదేశాలు సందర్శించాలి అనుకుంటున్నాను.


సులభమైన వచనంలో అందించిన ఉషశ్రీ గారి శైలి అద్భుతం.. ఏకబిగిన చదివించేది ఆయన శైలి. సంక్షిప్త రూపంలో ఉన్న ఉషశ్రీ భాగవతం చదివాక పూర్తి స్థాయిలో ఆ కథలు అన్ని మళ్ళీ చదవాలని మనస్సు ఉవ్విళ్ళూరుతుంది.

మీరు కూడా భాగవతం చదివి ఉంటే ఏ పుస్తకం చదివారో.. మీ అనుభవాలు చెప్పండి.


Friday, 3 April 2026

తాటి సెట్టు కథనే వినరో Song

తాటి సెట్టు కథనే వినరో  పాట వినడానికితాటి సెట్టు కథనే వినరో

[పల్లవి]

తాటి సెట్టు కథనే వినరో..కల్పవృక్షం చరితను కనరో..నిలువెత్తు నిలబడిన రూపం..గ్రామ ప్రజలకు అసలైన నేస్తం!

[చరణం 1] ఎండకు వానకు కాచే నీడయ్యింది..కాలువ దాటగ వంతెన అయ్యింది.. ఎండిన మట్టలు వంట చెరుకైంది..అమృతం సరిసమానమైన కల్లు నిచ్చింది!

తాటి సెట్టు కథనే వినరో..కల్పవృక్షం చరితను కనరో..

[చరణం 2]బ్రహ్మంగారి కాలజ్ఞానం..తాలపత్ర భాండాగారం..విజ్ఞానానికి తాటి సెట్టే మూలాధారం..గ్రామ దేవత గుడి ముందర..పోతురాజు రూపమై కొలువైంది!

తాటి సెట్టు కథనే వినరో..కల్పవృక్షం చరితను కనరో..



[చరణం 3]పిల్లల చేతిలో కిరికిరి బండై..తాటి బూరల అల్లరి రాగమై..అట్లతద్దిన ఊయలై మనసును ఊపింది..పేదవాని ఇంటికి నిట్టాడై నిలిచింది!

తాటి సెట్టు కథనే వినరో..కల్పవృక్షం చరితను కనరో..


[చరణం 4]ముంజలై..  తేగలై.. తాటి బెల్లమై..ఎన్నో రుచులతో విందులు చేసింది..బుట్టలై.. చాపలై.. విసనకర్రలై..ఎన్నో రూపాలై సేవలు చేసింది..కొమ్మల్లేని చెట్టైనా కోటి ఉపయోగాలు..తరతరాల తెలుగువారి తీపి జ్ఞాపకాలు!

తాటి సెట్టు కథనే వినరో..కల్పవృక్షం చరితను కనరో..నిలువెత్తు నిలబడిన రూపం..గ్రామ ప్రజలకు అసలైన నేస్తం!

Thursday, 2 April 2026

ఉగాది 2026 Song

ఉగాది  2026  పాట వినడానికి: : ఉగాది 2026 Song 

తెలుగింటి ఉగాది.. వెలుగులకు పునాది..
వసంతాన ఉగాది.. చిగురాశల యుగాది..
[Chorus]
తెలుగింటి ఉగాది.. వెలుగులకు పునాది..
వసంతాన ఉగాది.. చిగురాశల యుగాది..

[Charanam 1]
ఇంట పచ్చ తోరణములు ఆభరణములై తోచే..
చైత్రాన మధుమాసం దరహాసముతో మెరిసే..
కాలరూపమున జగన్మాతను వసంత నవరాత్రులలో కొలిచే..
ప్రకృతిలో‌.. ప్రతి బతుకున.. కొత్త ఆశలు చిగురించే..
ప్రకృతిలో‌.. ప్రతి బతుకున.. కొత్త ఆశలు చిగురించే.. 


[Chorus]
తెలుగింటి ఉగాది.. వెలుగులకు పునాది..
వసంతాన ఉగాది.. చిగురాశల యుగాది..



[Charanam 2]
రైతన్న హలం పట్టి ఏరువాక సాగెను..
పండితుడు గళం ఎత్తి పంచాంగం చదివెను..
భావకవి కలం పట్టి ప్రకృతిని వర్ణించెను..
కోకిలమ్మ కొమ్మలెక్కి రాగమాలపించెను..
కోకిలమ్మ కొమ్మలెక్కి రాగమాలపించెను..

[Chorus]
తెలుగింటి ఉగాది.. వెలుగులకు పునాది
వసంతాన ఉగాది.. చిగురాశల యుగాది

[Charanam 3]
షడ్రుచులను కలగలిపి.. దైవానికి నివేదించి
ప్రసాదంగా స్వీకరించి.. బ్రతుకున అన్వయించి
కష్ట-సుఖాలను సమదృష్టితో చూడమని
ముందుకు మున్ముందుకు సాగమని
కష్ట-సుఖాలను సమదృష్టితో చూడమని
ముందుకు మున్ముందుకు సాగమని
సందేశం ఇచ్చెను. ఈ ఉగాది పచ్చడి!
[Chorus]
తెలుగింటి ఉగాది.. వెలుగులకు పునాది
వసంతాన ఉగాది.. చిగురాశల యుగాది
హే.. వచ్చే వచ్చే ఉగాది.. కొత్త ఆశల యుగాది హే హే.. వచ్చే వచ్చే ఉగాది.. కొత్త ఆశల యుగాది వచ్చే వచ్చే ఉగాది.. కొత్త ఆశల యుగాది!

Sunday, 22 February 2026

పుస్తకం - అభినిర్యాణం

 


ఫిబ్రవరిలో చదివిన ఓ పుస్తకం "అభినిర్యాణం"





"సోలో ట్రిప్స్ అనేవి ఒక వరం. మనం ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆలోచనల ఉత్కంఠ ఒకలా ఉంటుంది.. అదే ఇతరులతో ఉన్నప్పుడు వాళ్లకు తగినట్లు ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఎక్కడికైనా వెళ్లాలి అంటే ఏదో ఒక తోడు ఉంటే బాగుండు అని కోరుకుంటారు. నిజానికి ఒక మనిషికి అత్యంత అమూల్యమైన తోడు ఈ ప్రకృతి. ఏంటి నమ్మరా ? అయితే ఒకసారి ఒంటరిగా ప్రయాణం చేసి చూడండి తిరిగి వచ్చాక మీరే చెప్తారు అనుభూతి గురించి" 

పుస్తకంలో ఈ వాక్యాలు నన్ను చాలా బాగా ఆకట్టుకున్నాయి 


ప్రయాణాలన్నా ,పురాతన దేవాలయాలు- అక్కడ విశేషాలు తెలుసుకోవాలని ఎంతో ఆసక్తి కనపరిచే నాకు "అభినిర్యాణం" అనే పుస్తకం పుస్తకాలు పండుగలో చాలా ఆసక్తికరంగా కనిపించింది.


ఈ పుస్తకంలో కథ సమాంతరంగా రెండు కాలాల్లో సాగుతూ ఉంటుంది..

ప్రస్తుత కాలంలో అభి అనే యువకుడు మరియు రాయల కాలంలో భారతదేశం యొక్క సంస్కృతి, కళలు తెలుసుకోవాలని ఉత్సాహంతో భారత్ కు వచ్చిన రాయ్ అనే ఇంగ్లాండ్ దేశస్తుడు.. ఇలా ఇద్దరు రెండు వేరు వేరు కాలాల్లో చేసిన ప్రయాణమే అభి నిర్యాణం.. 


అభి తన ప్రాజెక్ట్ వర్క్ కోసం తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి వెళ్తాడు, అక్కడ దేవాలయంలో  అనంతమైన నిధి ఉన్న ఆరో గది విశేషాలు తెలుసుకుంటాడు.  దానికి సంబంధించిన తాళపత్ర గ్రంథాలు కూడా దొరుకుతాయి, కానీ ఆ తాళపత్ర గ్రంధాలు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు 5 వారాల సమయంలో నాగబంధనం ఉన్న గది తాళం చెవి సంపాదించాలి లేకపోతే ప్రాణగండం ఉంటుంది..

ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు, ఒంటరిగా ప్రయాణం చేయాలి.. చీకటంటే భయపడే అభి ఏ విధంగా తాళం చెవి సంపాదించాడు. ఆ ప్రయాణంలో ఎదురైన సాహసోపేతమైన సంఘటనలు.. వేరు వేరు కాలాల్లో ప్రయాణించే రాయ్ మరియు అభికి ఉన్న సంబంధం ఏంటి అనేది పుస్తకం చుదువుతుంటే చాలా ఆసక్తిగా అనిపిస్తుంది.


ఈ కథలో విశేషం ఏంటంటే కథానాయకులు అభి , రాయ్ ఇద్దరు కూడా కళను ఆరాధించే వారే.. అభి Profesional photographer మరియు రాయ్ కుంచె తో అద్భుతమైన సృష్టి చేసే చిత్రాకారుడు. ఇద్దరు ఈ ప్రయాణంలో తమ కంటితో చూసిన ఘట్టాలను అందమైన దృశ్యాలులాగా రచయిత చదువరులకు కళ్ళకు కట్టినట్లు చూపించారు.

తిరువనంతపురంలో అభి చూసిన సంఘటన

"సూర్యుడు నిజంగా చిన్నపిల్లాడిలా గోడను పట్టుకుని మెట్లు దిగుతున్నట్లు మెల్లగా కిందకి దిగుతుంటే గోపురం మధ్యభాగం నుండి కనిపించింది." ఆ దృశ్యాన్ని అందమైన ఫోటో తీసాడు అభి.


హంపీలో రాయ్ చూసిన సంఘటన 

" అది విజయ విఠల దేవాలయం.. ప్రాంగణం నాట్య ప్రదర్శనకు సిద్ధం అయ్యింది, అతిరథమహారధులు అంతా వీక్షిస్తున్నారు.. సంగీతం పలికించే స్థంబాలు దగ్గర సంగీత విద్వాంసులు వెదురు కర్రలతో స్థంభాన్ని తాకుతుంటే ఒక్కో స్థంభం దగ్గర ఒక్కో శృతి, సరిగమలకు అనుగుణంగా అణువుఅణువున యజ్నంలా నాట్యం చేస్తున్న నర్తకి." ఓ అందమైన దృశ్యాన్ని రాయ్ చిత్రీకరించాడు..


నాగబంధనం ఉన్న ఆరవ గది తాళం వెతికే క్రమంలో మనం కూడా వివిధ ప్రదేశాల్లో ప్రయాణం చేస్తాం..

హంపిలో విజయనగర కాలం లోకి..

ద్వారకాలో గోమతి నది సముద్రం సంగమం అయ్యే ప్రదేశానికి..

పురాతన కాశీలో మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్ ల వద్దకు..

బుద్దగయాలో ప్రేతశిల -  యమధర్మరాజు దేవాలయం ఉన్న ఎత్తైన కొండ పర్వతం మీదకు..


ఇలా కథ రెండు వేరు వేరు శతాబ్దాలలో ఆ ప్రాంతం విశేషాలను పాఠకుడు కి చెబుతూ ఎన్నో మలుపులు తిరుగుతూ ఆరవ గది తాళం చెవి శోధించడంలో ఉత్కంఠను కలిగిస్తుంది.


రచయిత ప్రవర్ష్ మనకు ఈ పుస్తక పఠన ప్రయాణంలోఎన్నో విశేషాలను చాలా బాగా పరిశోధించి చెప్పారు..

1.తిరువనంత పురం అనంత పద్మనాభ స్వామి విగ్రహం వెనుక ఉన్న కథ.

2.హంపీలో దేవాలయంలో రక్షణలా కనిపించే యాళీ.

3.కాశీలో అఘోరాలు జీవన విధానం, బెనారస్ చీరలు ప్రాముఖ్యత.

4.మొఘల్ నవాబుల కాలంలో దేవదాసీలు 

5.బ్రటీష్ రాజ్యంలో భారత్ ను వంశం చేసుకోవాలనే కోరిక కలిగిన విధానం.

6.ఆలయంలో పూజలు అందుకునే దేవతామూర్తి శిల్పం తయారిలో వివిధ రకాల అంచెలు - శిల్ప కళ విశేషాలు..


ఈ పుస్తకం చదివాక మన భారతదేశంలో అనేక ప్రదేశాలను సందర్శించిన అనుభూతి కలిగింది .


- శ్రీనివాస చక్రవర్తి.




Monday, 16 February 2026

శివరాత్రి పాట - 2026

మా అన్నయ్య వాళ్ళు AI సాయంతో పాటలకు tunes కడుతూ మంచి మంచి పాటలు Youtube ఛానల్ లో పెడుతుంటే నేను కూడా ప్రయత్నం చేద్దామని.. శివరాత్రి సందర్భంగా ఓ పాట రాసి Suno AI కి చక్కటి సంగీతం ఇచ్చింది. ఈ పాట రాత్రి పూట 12:00 నుంచి 03:30 వరకు రాసాను.
ఆ రాత్రంతా శివ నామస్మరణ నా మనస్సు , దేహంలో ప్రతి కణం చేస్తున్న భావం కలిగింది. ఉదయం మా ఆవిడ లేచాక వినిపించాను. చాలా బాగుంది అని తను చెప్పింది. వెంటనే తన Youtube Channel లో పాటను Upload చేసాము.

పాట వినడానికి: 


Lyrics:
ఆలికి అర్ధభాగమిచ్చిన గౌరీ ప్రాణేశ్వరా..
నీ ఆనతి లేనిదే కదలదు చీమైన లయాకరా..
శివ శివ శంకర కరుణాసాగర దయాకరా..
హర హర శంకర సాంబ సదాశివ పరమేశ్వరా..

[Chrous]ఆలికి అర్ధభాగమిచ్చిన గౌరీ ప్రాణేశ్వరా..
నీ ఆనతి లేనిదే కదలదు చీమైన లయాకరా..

హర హర శంకరా… జయ జయ శంకరా…
శంభో మహాదేవా… శంభో శంకరా… 

నే గొప్పంటే నే గొప్పని బ్రహ్మ–విష్ణువుకు అంతరం కలిగి..
ఆ అంతరాన్ని అంతం చేయాలని 
ఆది–అంతం వెదకమని..
కోటి కాంతుల తేజంతో లింగోద్భవ రూపంగా వెలిసిన.. 
ఆది అంతం లేని అనంతమూర్తి నీవే శివయ్య ..
హర హర శంకరా… జయ జయ శంకరా… శంభో మహాదేవా… శంభో శంకరా… 

వరాహమై విష్ణువు పాతాళలోతుకు వెళ్లెను.. హంసరూపమై బ్రహ్మ ఆకాశమార్గం ఎగిరెను.. ఎంత వెతికినా అంతు చిక్కని మహిమ నీవే.. అనంతరూప.. పరమశివుడివే
హర హర శంకరా… జయ జయ శంకరా… శంభో మహాదేవా… శంభో శంకరా… 

[Chrous]ఆలికి అర్ధభాగమిచ్చిన గౌరీ ప్రాణేశ్వరా..
నీ ఆనతి లేనిదే కదలదు చీమైన లయాకరా..


అమృతం కోసం దేవదానవులు పాలకడలిని చిలికె..
పుట్టిన గరళంతో లోకాలన్నీ గజగజ వణికె..
ప్రళయకాలమున కాలకూటాన్ని కంఠమున ధరించె..
ఆపదలో నేనున్నానని చాటిన లోకరక్షకా నీలకంఠా..

హర హర శంకరా… జయ జయ శంకరా…
శంభో మహాదేవా… శంభో శంకరా… 


గంగకోసమై భగీరథుని కఠిన తపమును మెచ్చి..
అఖండ ప్రవాహ గంగను జటాజూటమున ధరించి..
దివి నుంచి భువికి దింపి పుడమిని పావనం చేసి..
గంగాధరుడిగా మారిన కరుణాసాగరుడివే శంకర..
హర హర శంకరా… జయ జయ శంకరా…
శంభో మహాదేవా… శంభో శంకరా… 

[Chrous]ఆలికి అర్ధభాగమిచ్చిన గౌరీ ప్రాణేశ్వరా..
నీ ఆనతి లేనిదే కదలదు చీమైన లయాకరా..
శివ శివ శంకర కరుణాసాగర దయాకరా..
హర హర శంకర సాంబ సదాశివ పరమేశ్వరా.. ఆలికి అర్ధభాగమిచ్చిన గౌరీ ప్రాణేశ్వరా..
నీ ఆనతి లేనిదే కదలదు చీమైన లయాకరా..

హర హర శంకరా… జయ జయ శంకరా… శంభో మహాదేవా… శంభో శంకరా…