Sunday, 1 February 2026

నా జీవితం నల్లేరు మీద బండి

 నా జీవితం నల్లేరు మీద బండి - సాకం నాగరాజు. ఒక పుస్తక ప్రేమికుని ఆత్మకథ



"ఒకసారి ఈ పుస్తకం చదవడం మొదలుపెడితే అదే మనల్ని చదివించుకుంటూ ముందుకు తీసుకు పోతుంది, అంత బాగా రాశారు"  అని గల్లా అరుణకుమారి గారు ముందు మాటలో చెప్పినట్లే ఉంది ఈ పుస్తక పఠనం.


పుస్తకాలు అంటే అంతులేని అభిమానం ఉన్న వ్యక్తి . ఒక యజ్ఞం లాగా ఎందరో బడి చిన్నారులకు ,పెద్దలకు పుస్తకాలు అందించి సాహిత్యం పట్ల అభిరుచిని పెంచడానికి కృషి చేసిన వ్యక్తి గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో పుస్తకాన్ని చదవడం మొదలుపెట్టాను.


"బాల్యం అనేది మీకైనా నాకైనా అది ఒక చలమ తవ్వే కొద్ది ఊరుతూనే ఉంటుంది" అంటూ నాగరాజు గారు బాల్య జ్ఞాపకాలని మన ముందు పరిచారు. 


ఆహా ఏమి రుచి: 

"ఓ రోజు మా అవ్వతో పాటు మా మిరప తోట దాకా వెళ్లాను. పొలానికి గాని అడవికి గాని వెళ్తే ఆకలి ఎక్కువగా అవుతుంది. అప్పుడు తిన్న అన్నం భలే రుచి. దీన్ని ఎంజాయ్ చేయడానికి ఎన్నో సార్లు పొలానికి/అడవికి వెళ్లాను". 

పుస్తకంలో ఈ మాటలు చదువుతున్నప్పుడు నాకు చిన్నప్పటికి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. మా అమ్మ నాన్నలకు ఉడత సాయం చేయడానికి నేను కూడా చిన్నప్పుడు మా పొలం వెళుతుండేవాడిని. అప్పుడు పచ్చడితో కలిపిన ముద్దలు తిన్న ఎంతో రుచిగా ఉండేవి. ఇదే విషయం మా నాన్నకు చెప్తే ఇక్కడున్న ప్రదేశంలో చల్లని తాడి చెట్లు నీడ, గాలి, పనిచేసి అలసిపోవడం వలన ఈ వాతావరణంలో నీకు తిన్నది బాగా రుచిగా అనిపిస్తుంది అని చెప్పారు.  నాగరాజు గారు చెప్పిన ఈ సంఘటన నా బాల్యంలోకి తీసుకెళ్ళింది.


డబ్బు అత్యాశ - గుణపాఠం: 

చిన్నప్పుడు నాగరాజు గారి ఇంట్లో డబ్బులు కోసం చిరు దొంగతనాలు చేసేవారట. అప్పుడు ఆ డబ్బులు చూసిన ఇద్దరు మిత్రులు "నీ వద్ద ఉన్న డబ్బును ఇంకా ఎన్నో రెట్లు డబ్బుగా చేస్తాము" అని ఆశ చూపించి పొలం తీసుకుని వెళ్తారు . అక్కడ ఒక గుంత తవ్వి ఆ గొంతులో ఈ ధనాన్ని పూడ్చిపెట్టి ఇలా చెప్తారు "మూడు రోజుల్లో ఈ గుంతలో డబ్బు చెట్టు మొలుస్తుంది. తర్వాత ఆ చెట్టు రోజు డబ్బు కాస్తుంది, కాకపోతే మూడు రోజుల వరకు మనం ఈ చోటికి రాకూడదు అదే నియమం" . ఆరోజు రాత్రి నాగరాజు గారికి నిద్ర పట్టలేదట ఉదయాన్నే లేచి గుంత దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తే.. ఆశ్చర్యం.. ఆ గుంత తవ్వేసి ఖాళీగా ఉంది. ఈ సంఘటన తనకి ఓ గొప్ప గుణపాఠం అంటారు ఆయన, దీని ద్వారా ఆయన ఎప్పుడు కూడా డబ్బు గూర్చి అత్యాశకు పోయి చీటీలు, స్కీం లాంటివాడి కట్టలేదట.

ఇలా ఎన్నో బాల్య జ్ఞాపకాలు ఉమ్మడి కుటుంబం, తను చేసిన చిరు దొంగతనాలు, అవ్వ చేతి ముద్ద.. ఈ పుస్తకంలో పంచుకున్నారు..


విద్యార్థి దశలోని నాయకుడిగా పనిచేసారు ఒకోసారి చదువులో వెనక పడుతున్నానని ఆలోచన కూడా ఉండేది. చదువు పూర్తికాగానే హైదరాబాద్లో బృందావన్ హోటల్లో ఐదు సంవత్సరాలు పాటు పనిచేశారు,‌తరువాత తెలుగు అధ్యాపకుడిగా ప్రయాణం మొదలు పెడతారు.


అధ్యాపకునిగా మొదటి తరగతి: 

నాగరాజు గారి మాటల్లో"నా మొదటి క్లాసు డిగ్రీ మొదటి ఏడాది విద్యార్థులకు శ్రీ శ్రీ ప్రతిజ్ఞ పాఠం చెప్పాను, గీతాన్ని లైన్ తర్వాత లైను నాటికియంగా చదివాను, అంతే క్లాస్ అయ్యాక ఒక అమ్మాయి దేవుడా ఇతనా మా తెలుగు లెక్చరర్ కర్మ ..కర్మ.. అంది. ఆరోజు నుంచి క్లాస్ కి భయంగా ప్రిపేర్ అయ్యేవాడిని , ఒకసారి క్లాస్ కి సరిగ్గా ప్రిపేర్ కాలేదు. తరగతికి వెళ్లి అభాసు పాలయ్యే బదులు సెలవు చీటీ తీసుకొని ప్రిన్సిపాల్ గారికి ఇస్తే.. "కాలేజీకి వచ్చి సెలవు చీటీ ఇవ్వడానికి సమయం ఉంది కానీ గంట సేపు పాఠం చెప్పలేవా" అని అన్నారట..

30 సంవత్సరాలు అధ్యాపకుడిగా పనిచేసిన ఆయన ఇలా ఎన్నో విషయాల్ని నిజాయితీగా ఇలా పంచుకున్నారు. 


మిత్రులు చెప్పిన మాటలు: 

1."ఏ పని లేకపోతే అది మిట్ట మధ్యాహ్నం అయినా పడి తిరుగుతూ వుండు, ఖాళీగా మాత్రం ఉండకు పగటిపూట పడుకోకు" ఇది వజ్రం లాంటి మాట అంటారు నాగరాజు గారు. 

ఆయన అలాగే పాటించి కాలికి బంగారం కట్టుకుని తిరిగారట.


2."కాలేజీ ,బజారు, ఫంక్షన్ కి ముస్తాబయి ఎంత నీటుగా ఉంటామో ఇంట్లోనూ మనం ఆ రీతిగా శుభ్రంగా ఉండాలి.. భార్య బిడ్డలు ముందు కూడా" . నిజంగా ఇది ఎంతో అమూల్యమైన మాట కదా..


పాఠాలు ఆసక్తి కలిగించడానికి: 

పాఠాలు చెబుతున్నప్పుడు ఉపోద్ఘాతాలతో తాను చేసిన ప్రయోగాలను వివరంగా చెప్పారు ముఖ్యంగా శాకుంతలోపాఖ్యానం , ద్రౌపదిపరివేదనను ఉదాహరణ ద్వారా బాగా చెప్పారు. సందులు , చందస్సు ,అలంకారాలు లాంటి వాటిని నిజ జీవితాలకి కనెక్ట్ చేసి ఆయన చెప్పిన వివరణ చాలా బాగుంది.  ఇందులో ఆయన చెప్పిన సూచనలు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు ఎంతో బాగా ఉపయోగపడతాయి. 


తెలుగు భాషొద్యమ సమితి ద్వారా ఎన్నో పుస్తకాలు, ఎందరికో కవులకు ప్రోత్సాహం: 

"2001వ సంవత్సరం నామినితో పరిచయం ద్వారా నా జీవితాన్ని పుస్తకం వైపు మలుపు తిప్పింది" అని చెబుతారు. 

పెళ్లి, పుట్టినరోజు ,మరణం, గృహప్రవేశం.. సందర్భం ఏదైనా వ్యక్తుల పేరు మీద తీసుకు వచ్చిన పుస్తక సంకలనాలు , కొత్త పాఠకులు కావడానికి సాధనం అయ్యాయట. వేలాది మందికి సాహిత్యం పట్ల అభిరుచిని కలిగించాయి. "నా చేతుల మీదగా 50 పుస్తకాలు ప్రతీది చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ" అంటున్నారు.


పుస్తకాలు అచ్చు వేయడం ఒక ఎత్తైతే వాటిని పాఠకులకు చేర్చడం మరో ఎత్తు "స్కూటర్ బండిమీద పెట్టుకొని స్కూళ్లకు తిరిగి..  చిన్నారులకు , పాఠకులకు పుస్తకం గురించి చెప్పాలి.. ఇదో పుస్తక యజ్ఞం". 


పెళ్లి పత్రిక తో పాటు ఓ కథ : 

నాగరాజు గారి మాటల్లో "నేను పాపా నాయుడు పేట కాలేజ్ లో పనిచేసేటప్పుడు క్లాసులో శంకరంమంచి గారి కథ 'అంపకం' చదివి వినిపించాను ఆ కథ విన్నాక ఆడపిల్లల కంట్లో తడి చూశాను" . ఆ కంటి తడే ఎందరి పెళ్లి పత్రికల్లో అనుబంధం అయింది. పెళ్లి పత్రిక కవర్ లో ఆహ్వాన పత్రిక మరియు 'అంపకం' కథారాజం  రెండు వచ్చాయి.. 


అసలు ఎందుకు నాగరాజు గారు ఎన్నో పుస్తకాలు ప్రచురించీ, ఎందరికో పంచుతున్నారంటే ఆయన మాటల్లో "డిగ్రీలో నేను చదివిన ఆ తొలి పుస్తకాలే నా దొంగ బుద్ధిని మార్చి జీవితాన్ని ఒక గొప్ప మలుపు తిప్పాయి.. పుస్తకదానం సమాజంలో ఒక వ్యక్తిగా నా కనీస బాధ్యత, అందుకోసమే ఈ తాపత్రయం.."


ఇంటింటా గ్రంథాలయం కొలువుదీరాలి:

"తల్లిదండ్రులు మీరు కూడా మీ పిల్లల్ని కథలు చదవమనండి రాయమనండి ఒక పుస్తకం కొనుక్కొని సొంత గ్రంథాలయానికి శ్రీకారం చుట్టుమనండి, ఇంటింటా గ్రంథాలయం కొలువుదీరాలి" ఇవి పుస్తకంలోని చివరి మాటలు..


127 పేజీల ఈ చిరు పుస్తకంలో సాకం నాగరాజు గారు తన జీవిత అనుభవాలన్నీ మన ముందు ఎంతో నిజాయితీగా కళ్ళ కట్టినట్లుగా చెప్పారు. ముందుమాటలో తాడి ప్రకాష్ గారు అన్నట్లుగా "ఊరుకో నాగరాజు వుంటే బావుణ్ణు"..


పుస్తకాభిమాని నాగరాజు గారు ఈ పుస్తకంలో సందర్భానికి తగ్గట్లుగా పేర్కొన్న కొన్ని పుస్తకాలు.

1. శ్రీశ్రీ మహాప్రస్థానం : విద్యార్థిగా ఉన్నప్పుడు తనకు ఒక కొత్త చూపుని ఈ కవిత్వం ఇచ్చిందని ఆయన చెప్పారు. 

2. దిగంబర కవిత్వం: డిగ్రీ చదువుతున్నప్పుడు లైబ్రరీ నుంచి తీసుకున్న ఈ పుస్తకాన్ని ఓ రాత్రంతా కూర్చుని చదివారట. 

3. తిక్కన భారతం: డిగ్రీ లో చదివిన పుస్తకం ఇందులో ఘట్టాలు కళ్ళకు కట్టినట్లుగా వర్ణించారట.. 

4. స్వీట్ హోమ్:  నాగరాజు గారు పంచిన పుస్తకాలను చదివి ఓ యువతి ఇలా రాశారట. పెళ్లయిన స్త్రీ స్వీట్ హోమ్ చదివితే "అరెరే మనం బుచ్చిబాబు లాంటి భర్తను మిస్సయ్యామే అని నొచ్చుకుంటుంది", పెళ్లి కాని అమ్మాయి చదివితే "మనకు బుచ్చిబాబు లాంటి అబ్బాయి వస్తే బాగుంటుంద"ని ఆశపడుతుంది.

5. కన్యాశుల్కం : రావిశాస్త్రి గారు ఈ పుస్తకాన్ని "మానవమాత్రుల మాత్రం రాసింది కాదు, దేవతలు రాసింది ఈ పుస్తకం" అని కొనియాడారు. ఈ పుస్తకాన్ని నాగరాజు గారు తమ కూతురికి చదివి వినిపించేవారట.

6. తెలుగు కథకు జేజే: తెలుగు కథల కథా సంకలనం "నిండు పళ్ళబుట్ట" అని అనేక పత్రికలు ప్రశంసలు కురిపించాయి.

7. యేసోపు కథలు: కవితలు లాంటి కథలు పిల్లల పుస్తకం మరియు పెద్దల పుస్తకం. 

8. మిట్టూరోడి పుస్తకం: మాండలికానికి గుడి కట్టిన పుస్తకం. 9.దువ్వూరి వెంకటరమణ శాస్త్రి ఆత్మకథ : చిత్రాకారులు బాపు మెచ్చిన జీవితకథ


నేను నాగరాజు గారికి "నా జీవితం నల్లేరు మీద బండి" పుస్తకం పంపమని మెసేజ్ చేసాను. సార్ నాకు మరిన్ని పుస్తకాలు కూడా పోస్ట్ లో పంపారు. 


పుస్తకం కోసం 94403 31016 సంప్రదించవచ్చు.


- శ్రీనివాస చక్రవర్తి.

Monday, 26 January 2026

వలస పుస్తకం

 వలస - ఈ ఏడాది నేను చదివిన తొలి నవల



"పిల్ల జాగ్రత్తమ్మ.. పిల్లల తరువాతే ఏదైనా .."

ఓ తండ్రి చెప్పిన మాట..

"తల్లిదండ్రులు కొంతవరకే వస్తారు, పిల్లలు కొంత దూరం మనతో నడిచి వేరే దారి పడతారు. కలిసి ఉండేది భార్యాభర్తలిద్దరే.. ఆ అమ్మాయి నీకోసం ఇంత దూరం వస్తుంది, జాగ్రత్తగా చూసుకో" ఓ తల్లి పెళ్లి కాబోతున్న తన కొడుకుతో అన్న మాటలు ఇవి..

తల్లిదండ్రులు పిల్లల కోసం ఏం విధంగా తపిస్తారో ఈ పుస్తకం ద్వారా రచయిత సుస్మితా గారు చాలా బాగా చెప్పారు. 

జీవితంలో ఓ మంచి స్థాయికి ఎదగాలని ఎన్నో కలలు కని అమెరికా వలస వెళ్ళిన NRI ల జీవిత కథలు ఇవి. ఏకబిగిన చదివించే విధంగా ఉంది పుస్తకం..

ఈ పుస్తకం నేను FB group వాడ్రేవు సాహిత్య కుటుంబం సభ్యులు కొప్పారపు లక్ష్మి నరసింహరావు గారి ద్వారా అందుకోవడం జరిగింది. మా ఇంటికి బుక్ పోస్ట్ రాగానే ఆసక్తిగా కవర్ తెరిచి చూసాను. నా సతీమణి ఈ పుస్తకం కవర్ పేజ్ మరియు టైటిల్ చూసి ఆపకుండా రెండు గంటలు ఏకధాటిగా చదివించింది. రాత్రి భోజనం సమయంలో కథ ఏంటి అని తనను అడిగాను. "ఇందులో ఒక కథ కాదు నాలుగైదు కథలు ఒకేసారి నడుస్తున్నాయి. చాలా ఆసక్తికరంగా ఉంది రచన శైలి " అని తను చెప్పింది. గత 5 రోజులు ప్రతి రోజూ ఉదయం ఓ రెండు గంటలు పాటు పుస్తకం చదివాను. అద్భుతమైన రచనా శైలి. చదవడం పూర్తి అయ్యాక మనసు భారం అయ్యింది.

చివర్లో ఈ లైన్ చదువుతుంటే మనసు ఏదో లాగా అయిపోయింది. 

"ఇల్లు ఖాళీ అయిపోయింది. అనుభవిస్తామని ఒక్కో వస్తువు తెచ్చి పేర్చుకున్న ఇల్లు, ఒక్కో సదుపాయంగా తీర్చుకున్న ఇల్లు, ఒక్కో అనుభవం.. నువ్వు, ఏడుపూ.. అన్నిటికీ సాక్ష్యమైన ఇల్లు ఖాళీ అయిపోయింది.." 

ఈ పుస్తకంలో తల్లిదండ్రులు పిల్లల పెంపకంలో ఎదుర్కొనే సవాళ్ళను కళ్ళకు కట్టినట్టు చెప్పారు. ముఖ్యంగా అమ్మలు పిల్లలు గురించి పడే తపన చిన్న పిల్లలు తిండి విషయం నుంచి యుక్త వయస్సు, పెళ్ళి , వారి పిల్లలకు కాన్పులు చేసి చూసుకోవడం... పిల్లల పెంపకంలో ఒక్కో భాగంలో ఒక్కో సవాల్.. అన్నీటిని తల్లిదండ్రులు ఎంత ఓర్పుగా నిర్వహిస్తారో చక్కగా వివరించారు. పుస్తకం చదివాక ఆలోచిస్తుంటే మన తల్లితండ్రులుకి మనం ఎంత ఋణపడి ఉన్నామో కదా అనిపిస్తుంది.

ఈ పుస్తకం చదివాక హర్షణీయం Podcast లో సుస్మితా గారి Interview విన్నాను. ఆమె గత 30 సంవత్సరాలు తన చుట్టూ జరిగిన అనేక విశేషాలను పరిశీలించి ఈ పుస్తక రూపంలో రాశారు అంటా. ముఖ్యంగా ఈ పుస్తకంలో సంభాషణలు చాలా బాగున్నాయి. సుస్మితా గారు సంభాషణలు గురించి మాట్లాడుతూ "పుస్తకం రాసే క్రమంలో సంభాషణలు రాసాక ఒక గదిలో కూర్చుని వాటిని పైకి చదివి చూసేవారట.. నోరు తిరగకపోయిన, గొంతులో ఆయాసం లాంటిది అనిపించినా ఆ సంభాషణలను సవరించారట"

వలస పుస్తకం గురించి Interview link https://open.spotify.com/episode/5PGKeH5YdpqHbNACpoJR0E?si=nHrm2o3fQ02tbkKDPEYxlQ&t=2852&ct=2852

ఓ మంచి పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చి చదవమని  ప్రోత్సహించిన కొప్పారపు లక్ష్మి నరసింహరావు గారికి మరోసారి ధన్యవాదాలు.


- శ్రీనివాస చక్రవర్తి.

Saturday, 3 January 2026

ఈస్తటిక్స్ కథలు - 2025

 ఈస్తటిక్స్ కథలు - 2025 



ఈ ఏడాది నా పుస్తక పఠనం ఖమ్మం ఈస్తటిక్స్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కథలు పోటీలో ఎన్నికైన ఉత్తమ కథలు సంకలనంతో ప్రారంభించాను. ప్రతి కథ కూడా ఒక మంచి ఆలోచన నుంచి పుట్టిన అద్భుతమైన సృజన. ప్రకృతి పట్ల, స్త్రీలు , మూఢాచారాలు, విపత్తులు, శ్రమ జీవనం, మానవుని అత్యాశ ఇలా అనేక అంశాలను ఈ కథల్లో చాలా బాగా సృజించారు రచయితలు. 

ఇందులో నాకు బాగా నచ్చిన కొన్ని కథలు పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తాను.

1.కావలి : అనగనగా భీమప్ప అనే రైతు ఆయనకు సుమారు 60-70 ఏళ్ళ వయసు.ఓ రోజు రాత్రి భీమప్ప శెనగ చేనుకు కాపలా కాయడానికి వరుసకి అల్లుడు అయిన వ్యక్తితో వెళ్తారు.. రాత్రి వంతుల వారీగా చేనుకు కాపలా కాయడానికి ఇద్దరూ సిద్ధం అవుతారు. ఆ సమయంలో అనుకోకుండా ఆకాశంలో మెరుపులు ఆ వెలుతురులో దూరాన పది మంది యువకులు మద్యం మత్తులో ఓ స్త్రీని బలాత్కారం చేయబోతుంటారు వారిని ఎదుర్కొనేందుకు భీమప్ప చేసిన అద్భుతమైన పోరాటమే ఈ కథ. కథలో సంభాషణలు చాలా అద్భుతంగా రాశారు రచయిత.

2.శివుడాజ్ఞ: అది ప్రసిద్ధి చెందిన పాలేశ్వర దేవాలయం ఒక పక్క పారే ఏరు, దాని చుట్టు పక్కల అనేక గ్రామాలు. ప్రతి ఏడాది కార్తీక పౌర్ణమికి జనసందోహంతో నిండిపోయి ఉంటుంది ఆ గుడి.కానీ ఈ ఏడాది అలా లేదు కారణం మానవుడు చేసిన ఓ తప్పిదం వలన ఏరు పొంగి వరద ముంపునకు గురి అవుతుంది. ఆ ఉధృతికి పశువులు కట్టేసిన కట్టుకొయ్యల వద్దే చనిపోతాయి. వరద నుంచి బయట పడిన ఒకామె చివరి క్షణంలో ఇంటిలో ఉన్న బంగారం విషయం గుర్తుకు వచ్చి బీరువా వద్దకు వెళ్ళేసరికి వరద క్షణాల్లో ముంచెత్తడం వలన బీరువా గడి పట్టుకొనే ప్రాణాలు కోల్పోతుంది. అనేకమంది ఆ వరద ధాటికి మృత్యువాత పడతారు.. గుడిలో శివలింగం కూడా ఆ వరదలో కొట్టుకు పోతుంది. ఆ ప్రాంతం నుంచి సౌదీలో చెక్క పనికి వెళ్ళిన ఒక హిందూ- ఒక ముస్లిం మిత్రులు వరద మరియు కొట్టుకుపోయిన శివ లింగం విషయం తెలుసుకొని దేవాలయం కోసం అక్కడ నుంచి వారు ఒక భారీ చెక్క శివలింగాన్ని దీక్షతో తయారు చేసి తీసుకొని వస్తారు.  అక్కడ కొంతమంది ప్రజలు ఒక ముస్లిం చేసిన శివ లింగాన్ని అంగీకరించరు. తరువాత ఏం జరిగింది ? ఇంతకీ మానవుడు చేసిన ఏ తప్పిదం వలన వరద వచ్చింది ? కథకు కీలకమైన "శివుడు ఆజ్ఞ" ఏంటో ఈ కథ చదివి తెలుసుకోవాల్సిందే..

3.అంజమ్మ : ఈరోజుల్లో మానవుడు అత్యాశతో అడవులను ఆక్రమించడం వలన అడువుల్లో ఉండే జంతు జాలానికి నివాస యోగ్యమైన చోటు దొరకడం లేదు‌, ఫలితంగా అవి ఊరులు మీదకు వస్తున్నాయి. అత్యాశతో అడవులను నాశనం చేయడంతో ప్రకృతి లో సమతుల్యం కూడా దెబ్బతింటుంది. ఇలాంటి అంశాన్ని తీసుకుని రచయిత అంజమ్మ అనే కోతితో ఓ మంచి కథ రాశారు. అంజమ్మకి కూడా తన తోటి వారిలాగా పిల్లలు కనాలని ఉంటుంది కానీ మానవుడు చేసిన ఓ పని వలన తనకు పిల్లలు పుట్టే యోగ్యం ఉండదు. ఇంతకీ మనిషి ఏం చేసాడు, ఆ విషయం అంజమ్మ కి ఎలా తెలిసింది? ప్రకృతి జీవజాలం సమతుల్యత యెక్క ప్రాముఖ్యత ఏంటి  అనే విషయాలు ఈ కథ చదివితే మనకు బాగా తెలుస్తాయి.

4.భాగ్యలక్ష్మి : అనగనగా ఒక అడవి ప్రాంతం అక్కడ తరతరాలుగా వస్తున్న ఓ ఆచారం బాలింతలు, నెలసరి వచ్చిన స్త్రీలు ఇంటిలో ఉండరాదు.. ఊరికి కిలోమీటర్ దూరంలో ఏర్పాటు చేసిన కుటీరం (క్వారంటైన్) లో ఉండాలి. దాని వలన స్త్రీలు ఎందరో ఇబ్బంది పడుతూ ఉంటారు.. దానికి తోడు ఊరు పెద్ద అండతో ఆడవారిని లైంగిక హింస చేసే మానవ మృగాలు. ఆ సమయంలో జరిగిన ఓ సంఘటన చూసి భాగ్యలక్ష్మి అనే వనిత కదిలిపోతుంది.. ఇంతకీ ఆ సంఘటన ఏంటి.. తరతరాలుగా వస్తున్న మూఢాచారాలు రూపుమాపలనే భాగ్యలక్ష్మి ప్రయత్నం ఫలించిందా అనేది అసలు కథ.

5.ఓ నల్ల హంస కథ : ప్రకృతిని, చుట్టు పక్కల ఉండే వాతావరణాన్ని ఆరాధించే స్త్రీ "సహజ". తనకు ప్రతీదీ ప్రకృతి సిద్ధంగా జరగాలి అని ఆకాంక్ష. తన కూతురుని కూడా అలాగే ప్రకృతిలో పెంచుతుంది. Good touch - Bad touch.. ఇతరులతో ఎలా ఉండాలి ఇలా ఎన్నో విషయాలు నేర్పిస్తుంది. ఓరోజు యుక్త వయసు వచ్చిన కూతురు తో మాట్లాడుతూ ఉండగా "నీకు ఎవరైనా ఇష్టమా" అని అడుగుతుంది. అప్పుడు కూతురు తన క్లాస్మేట్ గాయత్రి అంటే ఆకర్షణ కలుగుతుంది అని చెబుతుంది.. ప్రతీదీ ప్రకృతికి అనుగుణంగా జరగాలని కోరుకునే సహజ కూతురు చెప్పిన విషయాన్ని స్వీకరిస్తుందా.. ఇంతకీ హంస ఎవరూ అనేది మనం తెలుసుకోవాల్సిన అసలు కథ‌.

6.మూడో నేత్రం : కొత్తగా పెళ్ళి అయిన జంట తొలి మూడు నెలలు సరదాగా ఆనందంగా గడిచిపోతాయి. పెళ్లి సెలవులు తరువాత భర్త కువైట్ వెళతాడు ‌. ప్రతి రోజూ ప్రతి క్షణం భార్యను చూడాలని ఇంట్లో ఒక CC కెమెరా ఏర్పాటు చేస్తాడు.. అక్కడి నుంచి జరిగే పరిణామాలే ఈ కథ..

ఇలా సాగే ఈస్తటిక్స్ కథలు అన్ని కూడా చాలా బాగున్నాయి. సాహిత్యం అంటే కేవలం కాలక్షేపానికి కాదు మనిషిని ఆలోచింపజేసేది, సమాజాన్ని చెతన్యవంతం చేసేది అనే విధంగా ఈ కథ సంకలనాన్ని  సంపాదకులు తీర్చిదిద్దారు. 

- శ్రీనివాస చక్రవర్తి.


Wednesday, 31 December 2025

2025 నా పుస్తక పఠనం

ఏడాది జీవితంలో మొదటిసారి ఒక ఏడాది 10 పైగా పుస్తకాలు పూర్తి చేసాను. ముఖ్యంగా కథలు పుస్తకాలు బాగా చదివాను, ప్రతి కథ కూడా ఎన్నో జీవితాలను , సమాజ స్థితి గతులను ప్రతి బింబించాయి. మానవత్వం పరిమళించే కథలు, సవాళ్ళను అధిగమించి ముందుకు వెళ్ళిన కథలు.. హృదయాన్ని ద్రవింప చేసే కథలు ఎన్నో ఈ ఏడాది చదివాను. వాటితో పాటుగా నాకు ఎంతో ఇష్టమైన యాత్ర చరిత్రలు మరియు జీవిత కథలు కూడా చదివాను.

ఆ పుస్తకాల చిరు పరిచయం నాకు అర్ధం అయిన విధానంలో మీతో పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను ‌
1.మా తిరుపతి కొండ కథలు: జనవరిలో నేను తిరుపతి వెళ్ళి వచ్చాక ఓ రోజు ప్రయాణం చేస్తూ చదువు App చూస్తుంటే ఆడియో పుస్తకం గమనించి ప్రయాణంలో విన్నాను . కథలు వింటుంటే తిరుపతిలో సంచరిస్తునట్లు అనిపించింది గోపినీ కరుణాకర్ గారి రచన శైలి..అన్ని కథలు బాగున్నాయి. ముఖ్యంగా అమ్మ-నాన్నలను ఆంజనేయ స్వామిలా కలిపిన కోతి "ముత్యాల ముగ్గు" కథ.
తన కంటి చూపు తగ్గడం మూలాన ఉద్యోగం నుంచి తీసివేస్తే దీక్షతో భావి తవ్వి ఎందరో దాహాన్ని తీర్చిన "వాటర్ మాన్ శంకర రెడ్డి" అద్భుతమైన కథ.
స్నేహం కూడా మాగిన కొద్ది పరిమళిస్తుంది అంటూ చెప్పిన "పనస కాయ దొంగలు" కథలు చాలా బాగా నచ్చాయి. కొత్తగా పుస్తకాలు చదవాలి అనుకునేవారికి ఇలాంటి పుస్తకం ఇస్తే చాలా బాగుంటుంది. ముఖ్యంగా చదువు App లో Audioలో చాలా బాగా వినిపించారు ఈ కథలను.

2.కథ 2023 : విజయవాడ పుస్తకాలు పండుగలో తీసుకున్న తొలి పుస్తకం. వివిధ పత్రికల్లో వచ్చే కథలు అన్నీటిని ఏరి కూర్చి ప్రతి ఏడాది అత్యుత్తమ కథలుగా కథ సిరీస్ వేస్తున్నారని ఈ ఏడాది తొలి సారి తెలిసింది వెంటనే ఈ పుస్తకం తీసుకొన్నాను.
ఇందులో "ఆత్మవంచన తో కాదు, ఆత్మసంతృప్తితో బతకాలి.. బతుకు బతకనివ్వు" అని చెప్పే "మనసు - మర్మం" కథ.
ఉరుకులు పరుగులు జీవితాలు మన మనుషులు మన పక్కనే ఉంటారులే అని భావించి యాంత్రిక జీవనంలో పడిపోయాక రోజులు , సంవత్సరాలు ఈ పరుగులో గడిచిపోతే చివరి దశలో ఎంతో కోల్పాయం అని కనువిప్పు కలిగించే "చప్పుడు చేసే నిశబ్దాలు" కథలు చాలా బాగా నచ్చాయి. ఇక ప్రతి ఏడాది కథ సిరీస్ చదవాలి.

3. దీపావళి కథలు - 2024 :ఖదీర్ బాబు గారు కూర్చిన కథల సంకలనం ఈ పుస్తకంలో ఎన్నో మంచి కథలు ఉన్నాయి..ముఖ్యంగా నిజాయితీ- మంచితనం చక్కగా ప్రతిబింబించిన "కోడెల రెడ్లు" కథ ఎంతో బాగా నచ్చింది.. ముఖ్యంగా కథలో చివరి మలుపు అద్భుతంగా రాశారు రచయిత. యువరచయితలు బూదూరి సుదర్శన్ - చారిత్రాత్మక కథ, శ్రీ ఊహ- మహోన్నతుడు మరియు సురేంద్ర శీలం గారి కథలు అద్భుతంగా అనిపించాయి.
4.మిళింద కథలు: చదువు App లో పుస్తకాలు చూస్తుంటే ఈ పుస్తకం కేంద్ర సాహిత్య అకాడెమీ యువ రచయిత పురస్కారం అందుకున్నట్లు చూసాను. మొదటి కథ "అవిటి పెనిమిటి" కథ చదివాక అన్ని కథలు పూర్తి అయ్యేదాకా మరో పుస్తకం ముట్టుకోలేదు. ముఖ్యంగా "అవిటి పెనిమిటి" కథ కనువిప్పు కలిగించే కథ రెండు కోణాల్లో బాగా చిత్రీకరించారు.. ఒకరు భర్త దివ్యాంగులైనా తన భార్యకు సాయపడటం , మరొకరు నేను సంపాదిస్తున్నా కదా అన్ని పనులు భార్యే చూసుకోవాలి అనుకునే వ్యక్తి ఎవరు "అవిటి పెనిమిటి" అనేది తప్పకుండా చదవాల్సిన కథ. ఈ పుస్తకంలో చాలా కథలు ఇలాగే ఉన్నాయి, మానస ఎండ్లూరి గారి రచన శైలి విలక్షణంగా ఉంది.
5.బహుదా కథలు: దీపావళి కథలు 2024 లో సుదర్శన్ గారి శైలి చూసాక బహుదా కథలు చదువుదాం అని చదువు App లో చదవడం మొదలు పెట్టాను. ఇది కూడా ఆపకుండా చదివించే లక్షణం ఉన్న పుస్తకమే. ముఖ్యంగా ఆకర్షణీయమైన కవర్ పేజి నదీ తీరం..ఒక బాలుడు అందమైన రాతి బండ పైన కూర్చుని కనుచూపు మేరలో ఉన్న గ్రామాన్ని చూస్తున్నట్లు చూడముచ్చటగా ఉంది.
"అమ్మంటే ప్రేమ - నాన్నంటే నమ్మకం" అని ఓ‌కథలో చెబుతారు.
ఊహకందని ముగింపు 'చిన్న శేటు - పెద్ద శేటు' ల ప్రేమ కథ
"మనింటి ఆడపిల్లను మరో ఇంటికి పంపడమేరా జీవితంలో మనం తీసుకునే పెద్ద రిస్క్" అని ఓ కథలో కూతురు మీద ప్రేమను పెళ్ళి సమయంలో చెప్పే మాట. బాల్యంలో తీసుకొని వెళ్ళే 'నటరాజ్ పెన్సిల్' , 'జ్ఞాపకాలే ఓదార్పు' హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయి. పుస్తకం చాలా బాగా నచ్చింది.

6.జోనథన్ లీవింగ్ స్టన్ సీగల్: ఓ రోజు మా ఊరు నుండి వేరు ఊరు వెళుతూ బస్సు ప్రయాణం చేస్తూ చదువు App లో Audio రూపంలో విన్నాను ఈ ప్రేరణాత్మకమైన పుస్తకం. చుట్టు పక్కల వాతావరణం సృష్టించే పరిమితులకు లోబడి లోనున్న ఎంతో గొప్పశక్తి మరుగున పడుతుంది. ప్రయత్నంతో.. దీక్షతో ఆ శక్తిని ఎలా జాగృతం చేయవచ్చో ఈ చిరు పుస్తకంలో పక్షి కథలో చాలా బాగా చూపించారు.
7.వీరయ్య : ఏడు తరాలు, మా నాయన బాలయ్య పుస్తకాలు చదివాక అలాంటి మంచి పుస్తకం చదివిన భావం కలిగింది వీరయ్య పుస్తకం చదివాక .. ఓ వ్యక్తి తన ముత్తాత మూలాలు వెతుక్కుంటూ రాసిన కథ వీరయ్య..దక్షిణాఫ్రికాలో చెరుకు తోటల్లో కూలీగా వెళ్ళి సర్దార్ గా మారిన వీరయ్య , ఓ మంచి స్థాయిలో తిరిగి తన కుటుంబం కలుసుకోవాలని భారత్ వచ్చినప్పుడు ఉన్న పరిస్థితులు చదువరులను కదిలిస్తాయి.ముఖ్యంగా ఆనాడు దక్షిణాఫ్రికాలో భారతీయ కూలీలు పడిన కష్టాలు.. బ్రిటిష్ కాలం నాటి మన తెలుగు ప్రజల జీవన విధానం ఈ పుస్తకంలో చదివి తెలుసుకోవచ్చు.

8.పాటలు పుట్టిన తావులు : కొన్ని పుస్తకాలు చదువుతుంటే మనల్ని ఓ లోకంలో తీసుకొని వెళ్తాయి. చిన్నప్పుడు నేను చదివిన "గలివర్ ట్రావెల్స్" పుస్తకం అలా అనిపించింది. మరలా అలాంటి భావన ఈ "పాటలు పుట్టిన తావులు" చదివాక నేను కూడా రచయిత వాడ్రేవు వీరభద్రుడు గారితో కలిసి పాటలు పుట్టిన తావులు లో సంచరిస్తున్న భావం కలిగింది. ఈ పుస్తకం చదివితే మనం దక్షిణ భారతదేశం యాత్ర చేసినట్టే. ఈ పుస్తకంలో ఎందరో గొప్ప వ్యక్తులను పరిచయం చేసింది. ముఖ్యంగా నాకు ప్రతి స్త్రీలో మాతృమూర్తిని సందర్శించిన వ్యక్తి మరియు బీద బాలురు ఆకలిని చూసి చలించి పోయి రుచిని కోల్పోయిన సుబ్రహ్మణ్య భారతి గారు కథ ఎంతో ప్రేరణాత్మకంగా ఉంది. ఈ పుస్తకం పూర్తి చేసిన చాలా రోజుల వరకు ఓ రకమైన Trance భావం వెంటాడుతూనే ఉంది.

9.నెమ్మినీలం : ఈ పుస్తకం చదవడం అంటే మానవత్వం పరిమళించిన గొప్ప వ్యక్తులను దర్శించడమే. "ఏనుగు డాక్టర్" కథలో పురుగులను కూడా పసి పాపలుగా భావించి చెప్పిన విధానం. "కూటి ఋణం" కథలో ఎందరో ఆకలిని తీర్చే కెతేల్ సాయిబ్బు గారు తిన్న ఆహారానికి డబ్బులు ఇచ్చిన, ఇవ్వక పోయినా అందరి పట్ల సమదృష్టి చూపిన విధానం.
"తాటాకు శిలువ" కథలో కలరా వ్యాధి విజృంభిస్తున్న తరుణంలో ఓ వ్యక్తి రాత్రి దీపాలతో ఇంటి ఇంటికి తిరిగి నివారణ సూచనలు చెబుతూ ధీరుడిలా పోరాడి ధైర్యం చెప్పిన విధానం.
"పిచ్చిమాలోకం" ఓ స్వాతంత్ర్య సమర యోధుడు చేసిన పోరోటం, జీవన విధానం ఎంతో ప్రేరణాత్మకంగా ఉన్నాయి కథలు. ప్రతి కథ చదివి కొంత గ్యాప్ ఇచ్చి అనుభూతి చెందాలి. ఈ పుస్తకంలో కొన్ని కథలు నేను నా జీవిత భాగస్వామి చదివి ఆ వ్యక్తిత్వాలకి - హృదయాన్ని ద్రవించి కన్నీటి భాష్పాలు గా మారాం.
10.కొన్ని కలలు - ఓ స్వప్నం: దాసరి అమరేంద్ర గారు కలలను సాకారం చేసుకుంటూ స్కూటర్ పైన సాగే ఓ సాహస యాత్ర.10 రోజుల ప్రయాణం.. ఎన్నో జ్ఞాపకాలు.. భాషతో సంబంధం లేకుండా అందరితో పరిచయాలు..
పుస్తకంలో దాసరి అమరేంద్ర గారి మాటలు
- 'ఒంటరి ప్రయాణం మనతో మనం గడపడానికి ఉత్తమ మార్గం అంటారు'
- 'ప్రతి అడుగు ఓ ఆవిష్కరణ, ప్రతి ఊరు ఓ కొత్త ఊరు'
- 'ఈ ప్రయాణంలో నాలోకి నేను ప్రయాణం చేయగలిగాను. నన్ను నేను మరికాస్త అర్థం చేసుకున్నాను. నేను లేదనుకున్న సహనం నాలో ఉందన్న ఎరుక కలిగింది. నేను ఉందనుకున్న సర్వమానవ సమభావం పరిపూర్ణ దశలో లేదన్న అనుమానం కలిగింది.'

11.కథ 2020 :నేను మొదటిసారి కథా సాహితీ వారి కథ - 2023 పుస్తకం చదివాను.
. 2023 అన్ని పత్రికల్లో వచ్చిన సుమారు 2000 కథలు నుంచి ఏరి కూర్చిన మంచి కథలు సంకలనం ఆ పుస్తకం. ఈ పుస్తకం చదివాక పాత సంచికలు ఏమైనా దొరుకుతాయని నెట్లో వెతికాను. అప్పుడు నాకు కథ - 2020 పుస్తకం కనపడింది. 2020 అంటే కోవిడ్ మహామ్మారితో
ప్రపంచం సంక్షోభం ఎదుర్కొన్న సంవత్సరం. ఆ సంవత్సరంలో కథలు ఎలా ఉంటాయో చదువుదామనిపించింది..కోవిడ్ కాలంలో జన జీవితాలు ఎలా ప్రభావితం అయ్యిందో కథల్లో చూపించారు.మరోవైపు మానవత్వం స్పృశించే విధంగా కొన్ని కథలు ఆకట్టుకున్నాయి.
12.బుట్టబొమ్మ : చదువు యాప్ నిర్వహించిన ఉగాది పోటీల్లో బహుమతి పొందిన ఓ నవల, పుస్తకం కవర్ పేజీని చూసి హారర్ స్టోరీ అనుకుని చదవడం మొదలుపెట్టాను..
కథ ఏంటంటే:
శారీరక లోపం ఉన్న వ్యక్తి పడే వ్యదని కథలో చెప్పారు.. గ్రహణం మొర్రి ఉన్న వ్యక్తిని చూసి సమాజం చీదరించుకుంటూ ఉంటుంది. చదువును ఆసరాగా చేసుకుని ఉద్యోగం సంపాదించుకున్నాక , తనలో ఉన్న ప్రేమని పంచుకోవడానికి ,జీవిత ప్రయాణంలో చేతిలో చేయి వేసి నడవడానికి ఒక తోడు కావాలనే తపన, కానీ అడ్డు వస్తున్న వైకల్యం.. అనుకోని పరిస్థితుల్లో హంతకుడి గా మారిన వైనం..
రచయిత కథ చాలా ఉత్కంఠంగా రాసారు.ఏకబిగిన చదివించే విధంగా ఉంది ఈ పుస్తకం.

13.కంబగిరి నుంచి శేషగిరి దాక:ఓ చారిత్రక ప్రేమికుని ప్రయాణమే ఈ పుస్తకం.రచయిత అడవాల శేషగిరి రాయుడు(అశేరా) మన చరిత్రని, మన మూలాలను భావితరాలు తెలుసుకునే విధంగా ఈ పుస్తకం ద్వారా ఒక మంచి రచన చేశారు. ఓ రోజు అశేరా గారు కంబగిరిలో నరసింహ స్వామి దేవాలయానికి వెళ్తారు, అక్కడ నీటి కుండంలో ఒక రాగి నాణెం దొరుకుతుంది. ఆ రాగి నాణెం గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాసతో దగ్గరలో ఉన్న అనంతపురం మ్యూజియం కి వెళ్తారు .ఆ మ్యూజియం అధికారి అయిన విజయ్ కుమార్ జాదవ్ గారితో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయమే తర్వాత చారిత్రక ప్రదేశాల పట్ల ఆసక్తి ఉన్న సభ్యులు అందరూ కలిసి విజయకుమార్ గారి మార్గదర్శకంలో ఓ గ్రూప్ గా ఏర్పడి ఎన్నో అనేక ప్రదేశాలు, కట్టడాలు సందర్శనం వైపుకు దారితీస్తుంది. ఆ ప్రదేశాలు వెనుక ఉన్న వింతలు విశేషాలు తెలుసుకొని మనం కూడా సందర్శించిన అనుభూతి కలుగుతుంది.

14.పి. సత్యవతి కథలు: ఇన్ని రోజులు ఇలాంటి కథలు ఎందుకు చదవలేదా అనిపించింది. ప్రతి కథ చదివాక కొంత విరామం తీసుకుని ఆలోచించాల్సి ఉంటుంది‌, అందుకే అన్ని కథలు ఓ సారి కాకుండా రోజుకు ఒక కథ చొప్పున చదివాను‌‌."ఇల్లు అలకగానే" గృహిణి తన పేరే మర్చిపోవడం, "సూపర్ మామ్ సిండ్రోం" ఒక తల్లి తన కుటుంబం, పిల్లలు కోసం జీవితం ధార పోయడం లాంటి కథలు సత్యవతమ్మ గారి రచన శైలి ఎంతో బాగుంటుంది. ఎన్నో విశేషాలు చెబుతారు.
ఓ కథలో "రామకోటి" బియ్యం గురించి చదివాను.. ఆ రోజుల్లో మహిళలు తమ ఖాళీ సమయంలో ఒక్కో బియ్యం గింజ ఏరుతూ శ్రీరామ అంటూ ఒక డబ్బాలో వేస్తారు..వాటినే రామకోటి బియ్యంలాగా దానం చేస్తారు అంటా.. ఈ పుస్తకంలో 10 కథలు దాకా చదివాను మిగతా కథలు కూడా చదవాలి.
ఈ ఏడాది నా పుస్తక పఠనం చాలా బాగా జరిగింది.జీవితంలో మొదటి సారి డజన్ పైన పుస్తకాలు చదవడం చాలా ఆనందంగా ఉంది. ఎన్నో జీవితాలను, ఎన్నో ప్రదేశాలను , ఎన్నో విశేషాలను సందర్శించిన గొప్ప అనుభూతి కలిగింది.తెలుగు కలెక్టివ్ ఆదిత్య మరియు కొప్పరపు లక్ష్మి నరసింహ రావు గారు లాంటి వారి నుంచి ఎంతో ప్రేరణ పొందాను.
శ్రీనివాస చక్రవర్తి.

Monday, 22 December 2025

హైదరాబాద్ పుస్తకాల పండుగ 2025 సందర్శన - నేను ఎంచుకున్న పుస్తకాలు సంక్షిప్త పరిచయం

 


గత 15 సంవత్సరాల నుండి హైదరాబాద్ పుస్తకాలు పండుగ సందర్శిస్తున్నాను ,  ప్రతి సారి ఏదో కొత్త లోకంలోనికి అడుగు పెడుతున్నట్లు అనిపిస్తుంది. 
ఈ ఆదివారం మధ్యాహ్నం 02:30 గంటలకు  పుస్తకాలు పండుగ జరిగే ప్రదేశం చేరుకున్నాను, పుస్తక పరిమళాలతో ఆహ్వానం పలుకుతున్న ప్రాంగణానికి పుస్తక ప్రియులు అందరూ జ్ఞానకాంక్షతో వరుసగా బారులు తీరారు.నేను నేరుగా తెలుగు కలెక్టివ్ స్టాల్ కి వెళ్ళాను, ఈ జుట్టు సభ్యులు యువతకు తెలుగు సాహిత్యం పరిచయం చేయడానికి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, వీరు సూచించే పుస్తకాలు ఎంతో బాగుంటాయి. ఈ స్టాల్ లో వీరు చదివి బాగా నచ్చిన పుస్తకాలు పెడతారు. ఎవరైనా తెలుగు సాహిత్యంలో ముందుగా ఎలాంటి పుస్తకాలతో మొదలు పెట్టాలి అంటే వీరు మనకు మంచి పుస్తకాలు సూచిస్తారు. అందుకే ముందుగా ఈ స్టాల్ సందర్శనతో మొదలు పెట్టాను నా ప్రయాణం 5 పాటు గంటలు సాగింది.. వివిధ స్టాల్స్ లో తిరిగి ఈ క్రింది పుస్తకాలు సేకరించాను.

1.కథ 2024 : కథా సాహితీ వారు 2024 సంవత్సరంలో అనేక వార, మాస అంతర్జాల పత్రికలు, పుస్తకాలులో వచ్చిన సుమారు 3000 కథలు చదివి అత్యుత్తమ కథలను కూర్చిన సంకలనం ఈ పుస్తకం . వీరు గత 35 సంవత్సరాలుగా ప్రతి ఏడాది నిరంతరయంగా ఇలా పుస్తకాలను తీసుకుని వస్తున్నారు. ప్రస్తుత సమాజం,మనిషి జీవితాలు సృజించే విధంగా ఉంటాయి కథలు. ప్రస్తుతం కథ 2034 అందుబాటులో ఉంది- విశాలాంధ్ర, నవోదయ స్టాల్స్  లో దొరుకుతుంది.2.ఈస్తటిక్ కథలు 2025: మానవ జీవితాన్ని స్పృశించే ఆలోచన రేకెత్తించే కథలు , ఖమ్మం ఈస్తటిక్ వారు ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించే  కథలు పోటీలో ఎన్నికైన ఉత్తమ కథలు . నేను మొట్ట మొదటి సారి ఈ కథ సంకలనం చదవబోతున్నాను.- బాల పబ్లిషర్స్ స్టాల్ లో అందుబాటులో ఉంది3.గ్రామ దేవత : మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గ్రామ దేవతలు ఎవరు, వారి వెనుక ఉన్న కథలు ఏంటి అని పరిశోధన చేసి రాసిన గ్రంథం  స్త్రీని స్వయం శక్తి అంటాం. భారతదేశంలో స్త్రీ పూజింపబడుతుంది. ఆ పూజింపబడడానికి కారణాలని వెతుకుతూ గ్రామ దేవతల యొక్క ప్రాముఖ్యతను వారికి ఉన్న ప్రాచుర్యాన్ని వెతుకుతూ చేసిన ప్రయాణమే ఈ గ్రామదేవత పుస్తకం.- అజు పబ్లికేషన్ స్టాల్*4.తెలుగు కథ 1998* : పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారు 1998 సంవత్సరంలో ఎన్నో కథలను పరిశీలించి ఆ ఏడాది వచ్చిన అత్యుత్తమ కథలును ఈ పుస్తకం గా తీసుకుని వచ్చారు.. ఎందరో ప్రముఖ రచయితల కథలు ఉన్నాయి ఈ పుస్తకంలో, ముఖ్యంగా గోపిని కరుణాకర్ గారి "దుత్తలో చందమామ" కథ చదువుదాం అని ఈ పుస్తకం ఎంచుకున్నాను.- సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ స్టాల్*5.తరతరాల తెలుగు జాతి చరిత్ర:* ఈ పుస్తకంలో మన తెలుగు జాతి చరిత్ర - సంస్కృతి విశేషాలను సంక్షిప్తంగా పరిచయం చేస్తూ,అందమైన బొమ్మలు రూపంలో పొందుపరిచారు .చూడంగానే చాలా నచ్చింది నాకు.- సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ స్టాల్ లో ఉంది*6.మల్లాది రామకృష్ణశాస్త్రి నవలలు:* ప్రతి ఏడాది పుస్తకాలు చదివే వ్యక్తులను ఓ మంచి పుస్తకం సూచించమని అడుగుతుంటాను, ఈ ఏడాది పుస్తక ప్రియులు, FB వాడ్రేవు కుటుంబ గ్రూప్ నిర్వాహకులు, పుస్తకాలు చదవాలని ప్రోత్సాహించే కొప్పారపు లక్ష్మి నరసింహరావు గారు సూచించిన పుస్తకం మల్లాది వారి "కృష్ణాతీరం" పుస్తకం ఎంచుకున్నాను, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారిని వచనంలో మేస్త్రి అంటారు అంటా చదివి చూడాలి.-  గోదావరి ప్రచురణలు ,నవోదయBook House స్టాల్స్.7.కలవపూడి కథలు : అజు పబ్లికేషన్ వారి బాల్య జ్ఞాపకాలను, పుట్టి పెరిగిన ఊరు సంగతులు గుర్తు చేసే "గాజులు సంచి" పుస్తకం చాలా బాగా నచ్చింది, అలాంటి పుస్తకం ఏదైనా ఉందా అంటే ఆ స్టాల్ లో పుస్తకాలను పరిచయం చేసే  వ్యక్తి ఈ పుస్తకం నా చేతిలో పెట్టారు.- అజు పబ్లికేషన్ స్టాల్8.చలం - బిడ్డల శిక్షణ: అశ్వ శ్రీనివాస్ అన్నయ్య, పిల్లలు పెంపకం గురించి పుస్తకాలు లిస్ట్ ఒకసారి సూచించారు, అందులో ఈ పుస్తకం ఉంది.. ప్రస్తుతం ఇద్దరు చిన్నారుల తండ్రిని అయిన నేను పిల్లలు పెంపకం గూర్చి తెలుసుకోవాలని అనుకుంటున్నాను.- నవోదయ book house stall9.నల్లమల - ఎర్రమల దారుల్లో:  యాత్ర ప్రేమికులు, చరిత్రను అధ్యయనం చేసి చక్కగా చెప్పే పరవస్తు లోకేశ్వర్ గారి యాత్ర పుస్తకం, అనేక చారిత్రక మరియు ప్రముఖ దేవాలయ విశేషాలు ఇందులో ఉన్నాయి. లోకేశ్వర్ గారు స్టాల్ ఉన్నారు, పుస్తకం పైన సంతకం చేసారు.10. అభినిర్యాణం : కాల్పనిక సాహిత్యం - అడ్వెంచర్ థ్రిల్లర్ఒక కాలేజి విద్యార్థి తమిళనాడు లోని అనంత పద్మనాభస్వామి దేవాలయం సందర్శించడానికి వెళ్లినప్పుడు, అక్కడ  ఉన్న నేలమాళిగను తెరిచే తాళం చెవి దొరికే మార్గం తెలుసుకుంటాడు.. అతను చేసిన సాహస ప్రయాణమే ఈ పుస్తకం. పురాతన దేవాలయాలు అంటే ఆసక్తి ఉన్న నాకు ఈ పుస్తకం గురించి తెలుగు కలెక్టివ్ టీం చెప్పిన రివ్యూ  ఆధారంగా ఈ పుస్తకం గురించి తెలిసింది.-పుస్తకం తెలుగు కలెక్టివ్ మరియు గోదావరి ప్రచురణలు స్టాల్స్ అందుబాటులో ఉంది.11.మైరావణ: ఈ  ఏడాది ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం పొందిన పుస్తకం. రచయిత ఈ పుస్తకంలో జానపద కథానాయకుడు మైరావణుడు ఆధారంగా బెస్త జీవితాలు, తరాల చరిత్రని రాశారంట.. ఏడు తరాలు, వీరయ్య లాంటి పుస్తకాలు చదివాక తరాల్లో వచ్చిన జీవన విధానం గురించి తెలుసుకోవాలని ఈ పుస్తకం ఎంచుకున్నాను.- తెలుగు కలెక్టివ్, ఛాయా పబ్లిషర్స్ స్టాల్స్..12. తెలుగు ప్రపంచ మహాసభలు - లఘు గ్రంథాలు : 2012 లో జరిగిన తెలుగు మహాసభలు భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు మన తెలుగు వారికి ముఖ్యంగా యువత కోసం  అనేక చిన్న పుస్తకాలు మన దేవాలయాలు, మన కథలు, మన ఆహారం, పర్యాటకం, జానపదం ఇలా అనేక అంశాలు తో చిరు పుస్తకాలు తెచ్చారు. ఒక్కో పుస్తకం 20 రూపాయలు- సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ స్టాల్ లో ఉన్నాయి.పుస్తకాలు అన్నీ తీసుకున్నాక సమావేశాలు జరిగే వేదిక వద్దకు వెళ్ళాను "పుస్తక స్పూర్తి" అనే అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రతి రోజూ రాత్రి 07:00 నుంచి 09:00 వరకు నిర్వహిస్తున్నారు.. ఈ రోజు ప్రముఖులు తమకు స్పూర్తిని నింపిన పుస్తకాలు రైలు బడి, కన్యాశుల్కం, ఓల్గా రచనలు మరియు ఆంధ్రులు సాంఘీక చరిత్ర  ఏవిధంగా ప్రభావితం చేసాయో అద్భుతంగా చెప్పారు. పుస్తక స్పూర్తి నేరుగా వినడం చాలా బాగా అనిపించింది.రాత్రి 09:00 గంటలకు షాపులు అన్నీ మూసివేశారు. బయిటకు వచ్చాను. చలికి వేడి వేడిగా ఏమైనా తినాలనిపించింది. రెండు బజ్జీలు తిని ఇంటికి మాడుగుల(ధర చాలా ఎక్కువ)హల్వా పట్టుకొని బయిలుదేరాను, 

పుస్తకాలు తో ఇంటికి మనసు నిండిన ఆనందం.- శ్రీనివాస చక్రవర్తి.

Tuesday, 9 December 2025

కథ 2020 పుస్తకం : నాకు నచ్చిన కథలు

 నవంబర్ నేను చదివిన ఓ పుస్తకం: కథ 2020


ఈ ఏడాది నేను మొదటిసారి కథా సాహితీ వారి కథ - 2023 పుస్తకం చదివాను.. 2023 అన్ని పత్రికల్లో వచ్చిన సుమారు 2000 కథలు నుంచి ఏరి కూర్చిన మంచి కథలు సంకలనం ఆ పుస్తకం. ఈ పుస్తకం చదివాక పాత సంచికలు ఏమైనా దొరుకుతాయని నెట్లో వెతికాను. అప్పుడు నాకు కథ - 2020 పుస్తకం కనపడింది. 2020 అంటే కోవిడ్ మహామ్మారితోప్రపంచం సంక్షోభం ఎదుర్కొన్న సంవత్సరం. ఆ సంవత్సరంలో కథలు ఎలా ఉంటాయో చదువుదామనిపించింది వెంటనే ఆర్డర్ చేశాను.ఈ పుస్తకంలో నాకు నచ్చిన కథలు :1.ఊరికే పోవాలి - అద్దేపల్లి ప్రభు: కరోనా లాక్ డౌన్ వలన ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయి . పొట్టకూటి కోసం వలస వచ్చిన ఎంతోమంది వలస కార్మికులు జీవితాలు చేయడానికి పని లేక తింటానికి తిండి లేక అతలాకుతలం అవుతాయి. పోనీ సొంత ఊరికి వెళ్దామంటే అన్ని మార్గాలు బంద్ అయిపోతాయి. అలాంటి సమయంలో కొంతమంది కాలినడకని నమ్ముకొని కొన్ని వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయడానికి బయలుదేరుతారు. అలా బయలుదేరిన కొంతమంది వలస కార్మికుల కథే "ఊరికే పోవాలి". నడిచి వెళ్లే దారిలో తినటానికి తిండి లేక తాగడానికి నీరు లేక ఎన్ని అవస్థలు పడ్డారో తీసుకోవాలంటే మనం ఈ కథ చదవాలి.2.మళ్ళీ తేయాకు తోటల్లో కి: కుప్పిలి పద్మ గారు ఈ కథని ఎంతో బాగా రాశారు. అస్సాం తేయాకు తోటలకు ప్రసిద్ధి. అక్కడ కూలీలకు 5 నెలలు తేయాకు తెంపే పని ఉంటుంది. మిగతా సమయంలో పనికోసం ఇతర రాష్ట్రాలకు వలస వస్తారు, అలా గోవింద్ అనే వ్యక్తి ఆంధ్ర ప్రదేశ్ కు పని కోసం వస్తారు. గోవింద్ భార్య కమ్లినీ చిన్న పాపతో అస్సాం కొండ ప్రాంతంలో నివసిస్తూ ఉంటుంది. దేశం అంతా లాక్ డౌన్.. కోవిడ్ లక్షణాలు వలన గోవింద్ ను క్వారంటైన్ కి తరలిస్తారు, అదే సమయంలో వీరి పాపను ఒక విషపురగు కుడుతుంది.. కొన ఊపిరితో పాప, వేల మైళ్ళ దూరంలో భర్త.. చివరికి ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ కథ చదవాలి. పద్మగారి రచన శైలి చాలా బాగుంది.3.అప్పగింతలు - కె వి రమణారావు : ముగ్గురు అన్నదమ్ములు చిన్నకారు రైతులు వారికి ఓ ప్రియమైన చిన్న చెల్లి .. వర్షాధారం పంటలు వలన వ్యవసాయంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆస్తులు పంపకాలు తరువాత ఎవరి జీవనం వారిది అవుతుంది.. చెల్లి పెళ్ళి చేయడం, చూసుకోవడం అనేది ప్రతి ఒక్కరికీ భారం అయినట్టు వారికి అనిపించిడం వలన పరిష్కారం కోసం ఓ పెద్దాయన దగ్గరకు వెళతారు, కథలో చివరి ఘట్టం మనల్ని కదిలించి వేస్తుంది..4.సెకండ్ ఛాన్స్ - మృణాళిని:అమెరికా లో ఓ రెస్టారెంట్. అందులో చిరునవ్వు చెక్కుచెదరకుండా ఆప్యాయంగా పలకరిస్తూ కస్టమర్లను ఆకట్టుకునే విధంగా అద్భుతంగా పని చేసే స్టాఫ్.. విశేషం ఏంటంటే అక్కడ స్టాఫ్ అందరూ నేర చరిత్ర ఉన్నవారే.. జీవితంలో సెకండ్ ఛాన్స్ ఉందని ఆశాభావంతో పని చేస్తున్నవారు.. వీరిని చూసాక కథానాయిక కి తన చిన్నప్పుడు జీవితంలో జరిగిన సంఘటన గుర్తు వస్తుంది. తన అన్న ఓ తప్పు వలన ఇళ్ళు వదిలి వెళ్ళిపోతాడు.. అతను ఎన్నో సార్లు కుటుంబంతో కలవాలని ప్రయత్నిస్తాడు కానీ అవకాశం ఇవ్వరు.. ఈ రెస్టారెంట్ లో  జీవితం లో దొరికిన మరో అవకాశంలో అద్భుతంగా జీవిస్తున్న వారి ప్రభావం వలన కథానాయికకు ఓసారి మళ్ళీ అన్నయ్యతో మాట్లాడాలని, కలవాలని తపించి పోతుంది.. వేకువ ఉదయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.అనుబంధంగా ఇచ్చిన తమిళ తెలుగు రచయిత కి. రాజనారయణ్ గారి "తలుపు" కథ - చిన్నప్పటి జ్ఞాపకాల్లోకి తీసుకొని వెళుతునే , చివరి ఘట్టం హృదయాన్ని కదిలిస్తుంది.స.వెం రమేష్ గారు పరిచయం చేసిన తెన్నాడు తెలుగు చాలా బాగుంది.పాత కథా సాహితీ పుస్తకాలు చదవాలని ఎదురు చూస్తున్నా.. మొన్న విజయవాడలో ప్రాచిన గ్రంథమాల కి వెళ్ళాను కానీ దొరికలేదు.హైదరాబాద్ పుస్తకాల పండుగలో ఈ ఏడాది రాబోయే కథ - 2024 మరియు పాత సంకలనాల కోసం ఎదురు చూస్తున్నాను.- శ్రీనివాస చక్రవర్తి.

Saturday, 8 November 2025

పుస్తకం: కంబగిరి నుంచి శేషగిరి దాక..

 అక్టోబరులో చదివిన పుస్తకం: కంబగిరి నుంచి శేషగిరి దాక..


ఓ చారిత్రక ప్రేమికుని ప్రయాణమే ఈ పుస్తకం.రచయిత అడవాల శేషగిరి రాయుడు(అశేరా)మన చరిత్రని, మన మూలాలను భావితరాలు తెలుసుకునే విధంగా ఈ పుస్తకం ద్వారా ఒక మంచి రచన చేశారు.ఓ రోజు అశేరా గారు కంబగిరిలో నరసింహ స్వామి దేవాలయానికి వెళ్తారు, అక్కడ నీటి కుండంలో ఒక రాగి నాణెం దొరుకుతుంది. ఆ రాగి నాణెం గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాసతో దగ్గరలో ఉన్న అనంతపురం మ్యూజియం కి వెళ్తారు .ఆ మ్యూజియం అధికారి అయిన విజయ్ కుమార్ జాదవ్ గారితో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయమే తర్వాత చారిత్రక ప్రదేశాల పట్ల ఆసక్తి ఉన్న సభ్యులు అందరూ కలిసి విజయకుమార్ గారి మార్గదర్శకంలో ఓ గ్రూప్ గా ఏర్పడి ఎన్నో అనేక ప్రదేశాలు, కట్టడాలు సందర్శనం వైపుకు దారితీస్తుంది. ఆ ప్రదేశాలు వెనుక ఉన్న వింతలు విశేషాలు తెలుసుకొని మనం కూడా సందర్శించిన అనుభూతి కలుగుతుంది.ఈ పుస్తకంలో కొన్ని విశేషాలు.- నేడు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బెలూం గుహలు యొక్క కథ. ఒకప్పుడు ఈ ప్రాంతం స్థానికులకు అపోహలు భయాలతో, మూఢనమ్మకాల గల ప్రదేశంగా ఉండేదట. ఈ గుహలు ప్రదేశంలో ఉన్న చలపతి రెడ్డి గారు జర్మనీ నుంచి ఒక బృందాన్ని పిలిచి సర్వే చేయించి మ్యాప్ గీయించారు, గుహలు పైన ఒక దొంగ స్వామి కళ్ళు పడి, ఆయన చేసే జిమ్ముక్కులతో ఆ ప్రదేశాన్ని ఆనవాళంగా చేసుకుని ఆదాయ వనరుగా మార్చుకోవాలని చూశారు, అడ్డు వచ్చిన వాళ్ల మీద నాటు బాంబులు కూడా ప్రయోగం జరుగుతుంది, కానీ చలపతి రెడ్డి సంకల్పం, విజయ్ కుమార్ జాదవ్ గారి ప్రయత్నం వలన బేలుం గుహలు పురాతన ప్రదేశాలు జాబితాలోకి చేరి ఆసియాలోనే పెద్దదయిన గుహల్లో ఒకటిగా బయటికి వచ్చిందని కథను ఈ పుస్తకంలో మనం తెలుసుకోవచ్చు.-  అభివృద్ధి పేరుతో కదరి నరసింహ స్వామి ఆలయం మార్పులు చేయడం, అదే అభివృద్ధి పేరుతో తిరుమలలో 1000 కాళ్ల మండపాన్ని తొలగించడం. నిధులు నిక్షేపాల కోసం పురాతన కట్టడాలన్నీ కోటలని తవ్విన ఉదంతాలని ఈ పుస్తకంలో చదివాక ఎప్పటినుంచో నన్ను వేధిస్తున్న ప్రశ్న తమిళనాడు, కర్ణాటక లాగా మన తెలుగు రాష్ట్రాల్లో పురాతన కట్టడాలు ఎందుకు తక్కువగా ఉన్నాయో నా ప్రశ్నకి జవాబు అర్థమైంది.-మన తెలుగు నాట జరిగిన లైలా మజ్ను లాంటి అమర ప్రేమ కథను ఈ పుస్తకంలో అశేరా గారు అద్భుతంగా చెప్పారు.  అదే మన కదిరి నరసింహ స్వామి సాక్షిగా జరిగిన చంద్రవదన - మొహియర్ చారిత్రక ప్రేమగాథ‌.- ఆంజనేయ స్వామికి కుమారుడు ఉన్నాడు. ఆయన శక్తిలోను ,స్వామి భక్తిలోనూ తండ్రికి సమానుడు కానీ రావణాసురుడు వద్ద పనిచేయాల్సి వస్తుంది అనే విషయం ఈ పుస్తకంలో రాసిన కథ చదివి ఆశ్చర్యపోయాను.ఆయన విగ్రహం కొలనపాకలో ఉందట. అంతకుముందు ఆ విగ్రహాన్ని ఆంజనేయస్వామి అనుకునేవారుట కానీ విజయ్ కుమార్ గారు దానిని ఆధారాలతో ఆంజనేయస్వామి కుమారుడిని రుజువు చేసిన విధానం చదివాక అద్భుతం అనిపిస్తుంది.- ఓసారి ఓ పెద్దాయన వచ్చి మా ఇంట్లో లంకె బిందెలు ఉన్నాయి సార్ వాటిని తవ్వి తీసి మా గ్రామానికి, మన దేశానికి ఉపయోగపడే పని చేయండి సార్ అని అంటారు, మరొకాయిన నా దగ్గర జింక చర్మం మీద నిధి గురించిన మ్యాప్ ఉంది అంటూ చూడమంటారు ఈ విశేషాలు అన్ని కూడా చదువుతుంటే చాలా ఆసక్తికరంగా, విజ్ఞానదాయకంగా ఉన్నాయి .- ఇంకా మరెన్నో  తిమ్మమ్మ మర్రిమాను కథ, దక్షిణ భారత జలియన్ వాలా బాగ్, శ్రీకృష్ణదేవరాయని కుమారుని గురించిన శాసనాలు. మరెన్నో అద్భుతమైన పురాతన దేవాలయాల విశేషాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.-ఈ చారిత్రక ప్రయాణానికి మార్గదర్శకత్వం వహించిన విజయకుమార్ గారి జీవితం చాలా ఆదర్శవంతంగా అనిపించింది‌, ముఖ్యంగా ఆయన ఎన్నో పల్లెలు తిరిగి స్థానికులతో పోరాడి వారికి ఎంతో నచ్చచెప్పి అనేక విలువైన విగ్రహాలను మ్యూజియాలకు తరలించి భావితరాల కోసం చేసిన కృషి అభినందనీయం.చివరిగా ఓ మాట రచయిత అశేరా గారు చాలా సంఘటనలు ముక్కుసూటిగా రాశారు. చరిత్రని దాయకూడదు అనేది ఆయన ప్రధాన ఉద్దేశ్యం. ఆయన కథనం వైవిధ్య భరితంగా చాలా బాగుంది. ఎన్నెల పిట్ట ప్రచూరణ వారు ఈ పుస్తకాన్ని చాలా బాగా ముద్రించారు. చరిత్ర పట్ల, చారిత్రక కట్టడాలు అంటే ఆసక్తి ఉన్నవారు తప్పక చదవాల్సిన పుస్తకం.- శ్రీనివాస చక్రవర్తి.