ఫిబ్రవరిలో చదివిన ఓ పుస్తకం "అభినిర్యాణం"
"సోలో ట్రిప్స్ అనేవి ఒక వరం. మనం ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆలోచనల ఉత్కంఠ ఒకలా ఉంటుంది.. అదే ఇతరులతో ఉన్నప్పుడు వాళ్లకు తగినట్లు ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఎక్కడికైనా వెళ్లాలి అంటే ఏదో ఒక తోడు ఉంటే బాగుండు అని కోరుకుంటారు. నిజానికి ఒక మనిషికి అత్యంత అమూల్యమైన తోడు ఈ ప్రకృతి. ఏంటి నమ్మరా ? అయితే ఒకసారి ఒంటరిగా ప్రయాణం చేసి చూడండి తిరిగి వచ్చాక మీరే చెప్తారు అనుభూతి గురించి"
పుస్తకంలో ఈ వాక్యాలు నన్ను చాలా బాగా ఆకట్టుకున్నాయి
ప్రయాణాలన్నా ,పురాతన దేవాలయాలు- అక్కడ విశేషాలు తెలుసుకోవాలని ఎంతో ఆసక్తి కనపరిచే నాకు "అభినిర్యాణం" అనే పుస్తకం పుస్తకాలు పండుగలో చాలా ఆసక్తికరంగా కనిపించింది.
ఈ పుస్తకంలో కథ సమాంతరంగా రెండు కాలాల్లో సాగుతూ ఉంటుంది..
ప్రస్తుత కాలంలో అభి అనే యువకుడు మరియు రాయల కాలంలో భారతదేశం యొక్క సంస్కృతి, కళలు తెలుసుకోవాలని ఉత్సాహంతో భారత్ కు వచ్చిన రాయ్ అనే ఇంగ్లాండ్ దేశస్తుడు.. ఇలా ఇద్దరు రెండు వేరు వేరు కాలాల్లో చేసిన ప్రయాణమే అభి నిర్యాణం..
అభి తన ప్రాజెక్ట్ వర్క్ కోసం తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి వెళ్తాడు, అక్కడ దేవాలయంలో అనంతమైన నిధి ఉన్న ఆరో గది విశేషాలు తెలుసుకుంటాడు. దానికి సంబంధించిన తాళపత్ర గ్రంథాలు కూడా దొరుకుతాయి, కానీ ఆ తాళపత్ర గ్రంధాలు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు 5 వారాల సమయంలో నాగబంధనం ఉన్న గది తాళం చెవి సంపాదించాలి లేకపోతే ప్రాణగండం ఉంటుంది..
ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు, ఒంటరిగా ప్రయాణం చేయాలి.. చీకటంటే భయపడే అభి ఏ విధంగా తాళం చెవి సంపాదించాడు. ఆ ప్రయాణంలో ఎదురైన సాహసోపేతమైన సంఘటనలు.. వేరు వేరు కాలాల్లో ప్రయాణించే రాయ్ మరియు అభికి ఉన్న సంబంధం ఏంటి అనేది పుస్తకం చుదువుతుంటే చాలా ఆసక్తిగా అనిపిస్తుంది.
ఈ కథలో విశేషం ఏంటంటే కథానాయకులు అభి , రాయ్ ఇద్దరు కూడా కళను ఆరాధించే వారే.. అభి Profesional photographer మరియు రాయ్ కుంచె తో అద్భుతమైన సృష్టి చేసే చిత్రాకారుడు. ఇద్దరు ఈ ప్రయాణంలో తమ కంటితో చూసిన ఘట్టాలను అందమైన దృశ్యాలులాగా రచయిత చదువరులకు కళ్ళకు కట్టినట్లు చూపించారు.
తిరువనంతపురంలో అభి చూసిన సంఘటన
"సూర్యుడు నిజంగా చిన్నపిల్లాడిలా గోడను పట్టుకుని మెట్లు దిగుతున్నట్లు మెల్లగా కిందకి దిగుతుంటే గోపురం మధ్యభాగం నుండి కనిపించింది." ఆ దృశ్యాన్ని అందమైన ఫోటో తీసాడు అభి.
హంపీలో రాయ్ చూసిన సంఘటన
" అది విజయ విఠల దేవాలయం.. ప్రాంగణం నాట్య ప్రదర్శనకు సిద్ధం అయ్యింది, అతిరథమహారధులు అంతా వీక్షిస్తున్నారు.. సంగీతం పలికించే స్థంబాలు దగ్గర సంగీత విద్వాంసులు వెదురు కర్రలతో స్థంభాన్ని తాకుతుంటే ఒక్కో స్థంభం దగ్గర ఒక్కో శృతి, సరిగమలకు అనుగుణంగా అణువుఅణువున యజ్నంలా నాట్యం చేస్తున్న నర్తకి." ఓ అందమైన దృశ్యాన్ని రాయ్ చిత్రీకరించాడు..
నాగబంధనం ఉన్న ఆరవ గది తాళం వెతికే క్రమంలో మనం కూడా వివిధ ప్రదేశాల్లో ప్రయాణం చేస్తాం..
హంపిలో విజయనగర కాలం లోకి..
ద్వారకాలో గోమతి నది సముద్రం సంగమం అయ్యే ప్రదేశానికి..
పురాతన కాశీలో మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్ ల వద్దకు..
బుద్దగయాలో ప్రేతశిల - యమధర్మరాజు దేవాలయం ఉన్న ఎత్తైన కొండ పర్వతం మీదకు..
ఇలా కథ రెండు వేరు వేరు శతాబ్దాలలో ఆ ప్రాంతం విశేషాలను పాఠకుడు కి చెబుతూ ఎన్నో మలుపులు తిరుగుతూ ఆరవ గది తాళం చెవి శోధించడంలో ఉత్కంఠను కలిగిస్తుంది.
రచయిత ప్రవర్ష్ మనకు ఈ పుస్తక పఠన ప్రయాణంలోఎన్నో విశేషాలను చాలా బాగా పరిశోధించి చెప్పారు..
1.తిరువనంత పురం అనంత పద్మనాభ స్వామి విగ్రహం వెనుక ఉన్న కథ.
2.హంపీలో దేవాలయంలో రక్షణలా కనిపించే యాళీ.
3.కాశీలో అఘోరాలు జీవన విధానం, బెనారస్ చీరలు ప్రాముఖ్యత.
4.మొఘల్ నవాబుల కాలంలో దేవదాసీలు
5.బ్రటీష్ రాజ్యంలో భారత్ ను వంశం చేసుకోవాలనే కోరిక కలిగిన విధానం.
6.ఆలయంలో పూజలు అందుకునే దేవతామూర్తి శిల్పం తయారిలో వివిధ రకాల అంచెలు - శిల్ప కళ విశేషాలు..
ఈ పుస్తకం చదివాక మన భారతదేశంలో అనేక ప్రదేశాలను సందర్శించిన అనుభూతి కలిగింది .
- శ్రీనివాస చక్రవర్తి.

No comments:
Post a Comment