ఈ ఏడాది జీవితంలో మొదటిసారి ఒక ఏడాది 10 పైగా పుస్తకాలు పూర్తి చేసాను. ముఖ్యంగా కథలు పుస్తకాలు బాగా చదివాను, ప్రతి కథ కూడా ఎన్నో జీవితాలను , సమాజ స్థితి గతులను ప్రతి బింబించాయి. మానవత్వం పరిమళించే కథలు, సవాళ్ళను అధిగమించి ముందుకు వెళ్ళిన కథలు.. హృదయాన్ని ద్రవింప చేసే కథలు ఎన్నో ఈ ఏడాది చదివాను. వాటితో పాటుగా నాకు ఎంతో ఇష్టమైన యాత్ర చరిత్రలు మరియు జీవిత కథలు కూడా చదివాను.
Srinivasa Chakravarthi writings
Wednesday, 31 December 2025
2025 నా పుస్తక పఠనం
Monday, 22 December 2025
హైదరాబాద్ పుస్తకాల పండుగ 2025 సందర్శన - నేను ఎంచుకున్న పుస్తకాలు సంక్షిప్త పరిచయం
గత 15 సంవత్సరాల నుండి హైదరాబాద్ పుస్తకాలు పండుగ సందర్శిస్తున్నాను , ప్రతి సారి ఏదో కొత్త లోకంలోనికి అడుగు పెడుతున్నట్లు అనిపిస్తుంది. ఈ ఆదివారం మధ్యాహ్నం 02:30 గంటలకు పుస్తకాలు పండుగ జరిగే ప్రదేశం చేరుకున్నాను, పుస్తక పరిమళాలతో ఆహ్వానం పలుకుతున్న ప్రాంగణానికి పుస్తక ప్రియులు అందరూ జ్ఞానకాంక్షతో వరుసగా బారులు తీరారు.నేను నేరుగా తెలుగు కలెక్టివ్ స్టాల్ కి వెళ్ళాను, ఈ జుట్టు సభ్యులు యువతకు తెలుగు సాహిత్యం పరిచయం చేయడానికి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, వీరు సూచించే పుస్తకాలు ఎంతో బాగుంటాయి. ఈ స్టాల్ లో వీరు చదివి బాగా నచ్చిన పుస్తకాలు పెడతారు. ఎవరైనా తెలుగు సాహిత్యంలో ముందుగా ఎలాంటి పుస్తకాలతో మొదలు పెట్టాలి అంటే వీరు మనకు మంచి పుస్తకాలు సూచిస్తారు. అందుకే ముందుగా ఈ స్టాల్ సందర్శనతో మొదలు పెట్టాను నా ప్రయాణం 5 పాటు గంటలు సాగింది.. వివిధ స్టాల్స్ లో తిరిగి ఈ క్రింది పుస్తకాలు సేకరించాను.
1.కథ 2024 : కథా సాహితీ వారు 2024 సంవత్సరంలో అనేక వార, మాస అంతర్జాల పత్రికలు, పుస్తకాలులో వచ్చిన సుమారు 3000 కథలు చదివి అత్యుత్తమ కథలను కూర్చిన సంకలనం ఈ పుస్తకం . వీరు గత 35 సంవత్సరాలుగా ప్రతి ఏడాది నిరంతరయంగా ఇలా పుస్తకాలను తీసుకుని వస్తున్నారు. ప్రస్తుత సమాజం,మనిషి జీవితాలు సృజించే విధంగా ఉంటాయి కథలు. ప్రస్తుతం కథ 2034 అందుబాటులో ఉంది
- విశాలాంధ్ర, నవోదయ స్టాల్స్ లో దొరుకుతుంది.2.ఈస్తటిక్ కథలు 2025: మానవ జీవితాన్ని స్పృశించే ఆలోచన రేకెత్తించే కథలు , ఖమ్మం ఈస్తటిక్ వారు ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కథలు పోటీలో ఎన్నికైన ఉత్తమ కథలు . నేను మొట్ట మొదటి సారి ఈ కథ సంకలనం చదవబోతున్నాను.
- బాల పబ్లిషర్స్ స్టాల్ లో అందుబాటులో ఉంది3.గ్రామ దేవత : మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గ్రామ దేవతలు ఎవరు, వారి వెనుక ఉన్న కథలు ఏంటి అని పరిశోధన చేసి రాసిన గ్రంథం స్త్రీని స్వయం శక్తి అంటాం. భారతదేశంలో స్త్రీ పూజింపబడుతుంది. ఆ పూజింపబడడానికి కారణాలని వెతుకుతూ గ్రామ దేవతల యొక్క ప్రాముఖ్యతను వారికి ఉన్న ప్రాచుర్యాన్ని వెతుకుతూ చేసిన ప్రయాణమే ఈ గ్రామదేవత పుస్తకం.
- అజు పబ్లికేషన్ స్టాల్*4.తెలుగు కథ 1998* : పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారు 1998 సంవత్సరంలో ఎన్నో కథలను పరిశీలించి ఆ ఏడాది వచ్చిన అత్యుత్తమ కథలును ఈ పుస్తకం గా తీసుకుని వచ్చారు.. ఎందరో ప్రముఖ రచయితల కథలు ఉన్నాయి ఈ పుస్తకంలో, ముఖ్యంగా గోపిని కరుణాకర్ గారి "దుత్తలో చందమామ" కథ చదువుదాం అని ఈ పుస్తకం ఎంచుకున్నాను.
- సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ స్టాల్*5.తరతరాల తెలుగు జాతి చరిత్ర:* ఈ పుస్తకంలో మన తెలుగు జాతి చరిత్ర - సంస్కృతి విశేషాలను సంక్షిప్తంగా పరిచయం చేస్తూ,అందమైన బొమ్మలు రూపంలో పొందుపరిచారు .చూడంగానే చాలా నచ్చింది నాకు.
- సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ స్టాల్ లో ఉంది*6.మల్లాది రామకృష్ణశాస్త్రి నవలలు:* ప్రతి ఏడాది పుస్తకాలు చదివే వ్యక్తులను ఓ మంచి పుస్తకం సూచించమని అడుగుతుంటాను, ఈ ఏడాది పుస్తక ప్రియులు, FB వాడ్రేవు కుటుంబ గ్రూప్ నిర్వాహకులు, పుస్తకాలు చదవాలని ప్రోత్సాహించే కొప్పారపు లక్ష్మి నరసింహరావు గారు సూచించిన పుస్తకం మల్లాది వారి "కృష్ణాతీరం" పుస్తకం ఎంచుకున్నాను, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారిని వచనంలో మేస్త్రి అంటారు అంటా చదివి చూడాలి.
- గోదావరి ప్రచురణలు ,నవోదయBook House స్టాల్స్.7.కలవపూడి కథలు : అజు పబ్లికేషన్ వారి బాల్య జ్ఞాపకాలను, పుట్టి పెరిగిన ఊరు సంగతులు గుర్తు చేసే "గాజులు సంచి" పుస్తకం చాలా బాగా నచ్చింది, అలాంటి పుస్తకం ఏదైనా ఉందా అంటే ఆ స్టాల్ లో పుస్తకాలను పరిచయం చేసే వ్యక్తి ఈ పుస్తకం నా చేతిలో పెట్టారు.
- అజు పబ్లికేషన్ స్టాల్8.చలం - బిడ్డల శిక్షణ: అశ్వ శ్రీనివాస్ అన్నయ్య, పిల్లలు పెంపకం గురించి పుస్తకాలు లిస్ట్ ఒకసారి సూచించారు, అందులో ఈ పుస్తకం ఉంది.. ప్రస్తుతం ఇద్దరు చిన్నారుల తండ్రిని అయిన నేను పిల్లలు పెంపకం గూర్చి తెలుసుకోవాలని అనుకుంటున్నాను.
- నవోదయ book house stall9.నల్లమల - ఎర్రమల దారుల్లో: యాత్ర ప్రేమికులు, చరిత్రను అధ్యయనం చేసి చక్కగా చెప్పే పరవస్తు లోకేశ్వర్ గారి యాత్ర పుస్తకం, అనేక చారిత్రక మరియు ప్రముఖ దేవాలయ విశేషాలు ఇందులో ఉన్నాయి. లోకేశ్వర్ గారు స్టాల్ ఉన్నారు, పుస్తకం పైన సంతకం చేసారు.10. అభినిర్యాణం : కాల్పనిక సాహిత్యం - అడ్వెంచర్ థ్రిల్లర్
ఒక కాలేజి విద్యార్థి తమిళనాడు లోని అనంత పద్మనాభస్వామి దేవాలయం సందర్శించడానికి వెళ్లినప్పుడు, అక్కడ ఉన్న నేలమాళిగను తెరిచే తాళం చెవి దొరికే మార్గం తెలుసుకుంటాడు.. అతను చేసిన సాహస ప్రయాణమే ఈ పుస్తకం. పురాతన దేవాలయాలు అంటే ఆసక్తి ఉన్న నాకు ఈ పుస్తకం గురించి తెలుగు కలెక్టివ్ టీం చెప్పిన రివ్యూ ఆధారంగా ఈ పుస్తకం గురించి తెలిసింది.
-పుస్తకం తెలుగు కలెక్టివ్ మరియు గోదావరి ప్రచురణలు స్టాల్స్ అందుబాటులో ఉంది.11.మైరావణ: ఈ ఏడాది ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం పొందిన పుస్తకం. రచయిత ఈ పుస్తకంలో జానపద కథానాయకుడు మైరావణుడు ఆధారంగా బెస్త జీవితాలు, తరాల చరిత్రని రాశారంట.. ఏడు తరాలు, వీరయ్య లాంటి పుస్తకాలు చదివాక తరాల్లో వచ్చిన జీవన విధానం గురించి తెలుసుకోవాలని ఈ పుస్తకం ఎంచుకున్నాను.
- తెలుగు కలెక్టివ్, ఛాయా పబ్లిషర్స్ స్టాల్స్..12. తెలుగు ప్రపంచ మహాసభలు - లఘు గ్రంథాలు : 2012 లో జరిగిన తెలుగు మహాసభలు భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు మన తెలుగు వారికి ముఖ్యంగా యువత కోసం అనేక చిన్న పుస్తకాలు మన దేవాలయాలు, మన కథలు, మన ఆహారం, పర్యాటకం, జానపదం ఇలా అనేక అంశాలు తో చిరు పుస్తకాలు తెచ్చారు. ఒక్కో పుస్తకం 20 రూపాయలు
- సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ స్టాల్ లో ఉన్నాయి.పుస్తకాలు అన్నీ తీసుకున్నాక సమావేశాలు జరిగే వేదిక వద్దకు వెళ్ళాను "పుస్తక స్పూర్తి" అనే అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రతి రోజూ రాత్రి 07:00 నుంచి 09:00 వరకు నిర్వహిస్తున్నారు.. ఈ రోజు ప్రముఖులు తమకు స్పూర్తిని నింపిన పుస్తకాలు రైలు బడి, కన్యాశుల్కం, ఓల్గా రచనలు మరియు ఆంధ్రులు సాంఘీక చరిత్ర ఏవిధంగా ప్రభావితం చేసాయో అద్భుతంగా చెప్పారు. పుస్తక స్పూర్తి నేరుగా వినడం చాలా బాగా అనిపించింది.రాత్రి 09:00 గంటలకు షాపులు అన్నీ మూసివేశారు. బయిటకు వచ్చాను. చలికి వేడి వేడిగా ఏమైనా తినాలనిపించింది. రెండు బజ్జీలు తిని ఇంటికి మాడుగుల(ధర చాలా ఎక్కువ)హల్వా పట్టుకొని బయిలుదేరాను,
పుస్తకాలు తో ఇంటికి మనసు నిండిన ఆనందం.
- శ్రీనివాస చక్రవర్తి.
Tuesday, 9 December 2025
కథ 2020 పుస్తకం : నాకు నచ్చిన కథలు
నవంబర్ నేను చదివిన ఓ పుస్తకం: కథ 2020
ఈ ఏడాది నేను మొదటిసారి కథా సాహితీ వారి కథ - 2023 పుస్తకం చదివాను.. 2023 అన్ని పత్రికల్లో వచ్చిన సుమారు 2000 కథలు నుంచి ఏరి కూర్చిన మంచి కథలు సంకలనం ఆ పుస్తకం. ఈ పుస్తకం చదివాక పాత సంచికలు ఏమైనా దొరుకుతాయని నెట్లో వెతికాను. అప్పుడు నాకు కథ - 2020 పుస్తకం కనపడింది. 2020 అంటే కోవిడ్ మహామ్మారితో
ప్రపంచం సంక్షోభం ఎదుర్కొన్న సంవత్సరం. ఆ సంవత్సరంలో కథలు ఎలా ఉంటాయో చదువుదామనిపించింది వెంటనే ఆర్డర్ చేశాను.ఈ పుస్తకంలో నాకు నచ్చిన కథలు :
1.ఊరికే పోవాలి - అద్దేపల్లి ప్రభు: కరోనా లాక్ డౌన్ వలన ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయి . పొట్టకూటి కోసం వలస వచ్చిన ఎంతోమంది వలస కార్మికులు జీవితాలు చేయడానికి పని లేక తింటానికి తిండి లేక అతలాకుతలం అవుతాయి. పోనీ సొంత ఊరికి వెళ్దామంటే అన్ని మార్గాలు బంద్ అయిపోతాయి. అలాంటి సమయంలో కొంతమంది కాలినడకని నమ్ముకొని కొన్ని వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయడానికి బయలుదేరుతారు. అలా బయలుదేరిన కొంతమంది వలస కార్మికుల కథే "ఊరికే పోవాలి". నడిచి వెళ్లే దారిలో తినటానికి తిండి లేక తాగడానికి నీరు లేక ఎన్ని అవస్థలు పడ్డారో తీసుకోవాలంటే మనం ఈ కథ చదవాలి.2.మళ్ళీ తేయాకు తోటల్లో కి: కుప్పిలి పద్మ గారు ఈ కథని ఎంతో బాగా రాశారు. అస్సాం తేయాకు తోటలకు ప్రసిద్ధి. అక్కడ కూలీలకు 5 నెలలు తేయాకు తెంపే పని ఉంటుంది. మిగతా సమయంలో పనికోసం ఇతర రాష్ట్రాలకు వలస వస్తారు, అలా గోవింద్ అనే వ్యక్తి ఆంధ్ర ప్రదేశ్ కు పని కోసం వస్తారు. గోవింద్ భార్య కమ్లినీ చిన్న పాపతో అస్సాం కొండ ప్రాంతంలో నివసిస్తూ ఉంటుంది. దేశం అంతా లాక్ డౌన్.. కోవిడ్ లక్షణాలు వలన గోవింద్ ను క్వారంటైన్ కి తరలిస్తారు, అదే సమయంలో వీరి పాపను ఒక విషపురగు కుడుతుంది.. కొన ఊపిరితో పాప, వేల మైళ్ళ దూరంలో భర్త.. చివరికి ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ కథ చదవాలి. పద్మగారి రచన శైలి చాలా బాగుంది.3.అప్పగింతలు - కె వి రమణారావు : ముగ్గురు అన్నదమ్ములు చిన్నకారు రైతులు వారికి ఓ ప్రియమైన చిన్న చెల్లి .. వర్షాధారం పంటలు వలన వ్యవసాయంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆస్తులు పంపకాలు తరువాత ఎవరి జీవనం వారిది అవుతుంది.. చెల్లి పెళ్ళి చేయడం, చూసుకోవడం అనేది ప్రతి ఒక్కరికీ భారం అయినట్టు వారికి అనిపించిడం వలన పరిష్కారం కోసం ఓ పెద్దాయన దగ్గరకు వెళతారు, కథలో చివరి ఘట్టం మనల్ని కదిలించి వేస్తుంది..4.సెకండ్ ఛాన్స్ - మృణాళిని:
అమెరికా లో ఓ రెస్టారెంట్. అందులో చిరునవ్వు చెక్కుచెదరకుండా ఆప్యాయంగా పలకరిస్తూ కస్టమర్లను ఆకట్టుకునే విధంగా అద్భుతంగా పని చేసే స్టాఫ్.. విశేషం ఏంటంటే అక్కడ స్టాఫ్ అందరూ నేర చరిత్ర ఉన్నవారే.. జీవితంలో సెకండ్ ఛాన్స్ ఉందని ఆశాభావంతో పని చేస్తున్నవారు.. వీరిని చూసాక కథానాయిక కి తన చిన్నప్పుడు జీవితంలో జరిగిన సంఘటన గుర్తు వస్తుంది. తన అన్న ఓ తప్పు వలన ఇళ్ళు వదిలి వెళ్ళిపోతాడు.. అతను ఎన్నో సార్లు కుటుంబంతో కలవాలని ప్రయత్నిస్తాడు కానీ అవకాశం ఇవ్వరు.. ఈ రెస్టారెంట్ లో జీవితం లో దొరికిన మరో అవకాశంలో అద్భుతంగా జీవిస్తున్న వారి ప్రభావం వలన కథానాయికకు ఓసారి మళ్ళీ అన్నయ్యతో మాట్లాడాలని, కలవాలని తపించి పోతుంది.. వేకువ ఉదయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.అనుబంధంగా ఇచ్చిన తమిళ తెలుగు రచయిత కి. రాజనారయణ్ గారి "తలుపు" కథ - చిన్నప్పటి జ్ఞాపకాల్లోకి తీసుకొని వెళుతునే , చివరి ఘట్టం హృదయాన్ని కదిలిస్తుంది.
స.వెం రమేష్ గారు పరిచయం చేసిన తెన్నాడు తెలుగు చాలా బాగుంది.పాత కథా సాహితీ పుస్తకాలు చదవాలని ఎదురు చూస్తున్నా.. మొన్న విజయవాడలో ప్రాచిన గ్రంథమాల కి వెళ్ళాను కానీ దొరికలేదు.హైదరాబాద్ పుస్తకాల పండుగలో ఈ ఏడాది రాబోయే కథ - 2024 మరియు పాత సంకలనాల కోసం ఎదురు చూస్తున్నాను.- శ్రీనివాస చక్రవర్తి.
Saturday, 8 November 2025
పుస్తకం: కంబగిరి నుంచి శేషగిరి దాక..
అక్టోబరులో చదివిన పుస్తకం: కంబగిరి నుంచి శేషగిరి దాక..
ఓ చారిత్రక ప్రేమికుని ప్రయాణమే ఈ పుస్తకం.రచయిత అడవాల శేషగిరి రాయుడు(అశేరా)
మన చరిత్రని, మన మూలాలను భావితరాలు తెలుసుకునే విధంగా ఈ పుస్తకం ద్వారా ఒక మంచి రచన చేశారు.ఓ రోజు అశేరా గారు కంబగిరిలో నరసింహ స్వామి దేవాలయానికి వెళ్తారు, అక్కడ నీటి కుండంలో ఒక రాగి నాణెం దొరుకుతుంది. ఆ రాగి నాణెం గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాసతో దగ్గరలో ఉన్న అనంతపురం మ్యూజియం కి వెళ్తారు .ఆ మ్యూజియం అధికారి అయిన విజయ్ కుమార్ జాదవ్ గారితో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయమే తర్వాత చారిత్రక ప్రదేశాల పట్ల ఆసక్తి ఉన్న సభ్యులు అందరూ కలిసి విజయకుమార్ గారి మార్గదర్శకంలో ఓ గ్రూప్ గా ఏర్పడి ఎన్నో అనేక ప్రదేశాలు, కట్టడాలు సందర్శనం వైపుకు దారితీస్తుంది. ఆ ప్రదేశాలు వెనుక ఉన్న వింతలు విశేషాలు తెలుసుకొని మనం కూడా సందర్శించిన అనుభూతి కలుగుతుంది.ఈ పుస్తకంలో కొన్ని విశేషాలు.
- నేడు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బెలూం గుహలు యొక్క కథ. ఒకప్పుడు ఈ ప్రాంతం స్థానికులకు అపోహలు భయాలతో, మూఢనమ్మకాల గల ప్రదేశంగా ఉండేదట. ఈ గుహలు ప్రదేశంలో ఉన్న చలపతి రెడ్డి గారు జర్మనీ నుంచి ఒక బృందాన్ని పిలిచి సర్వే చేయించి మ్యాప్ గీయించారు, గుహలు పైన ఒక దొంగ స్వామి కళ్ళు పడి, ఆయన చేసే జిమ్ముక్కులతో ఆ ప్రదేశాన్ని ఆనవాళంగా చేసుకుని ఆదాయ వనరుగా మార్చుకోవాలని చూశారు, అడ్డు వచ్చిన వాళ్ల మీద నాటు బాంబులు కూడా ప్రయోగం జరుగుతుంది, కానీ చలపతి రెడ్డి సంకల్పం, విజయ్ కుమార్ జాదవ్ గారి ప్రయత్నం వలన బేలుం గుహలు పురాతన ప్రదేశాలు జాబితాలోకి చేరి ఆసియాలోనే పెద్దదయిన గుహల్లో ఒకటిగా బయటికి వచ్చిందని కథను ఈ పుస్తకంలో మనం తెలుసుకోవచ్చు.- అభివృద్ధి పేరుతో కదరి నరసింహ స్వామి ఆలయం మార్పులు చేయడం, అదే అభివృద్ధి పేరుతో తిరుమలలో 1000 కాళ్ల మండపాన్ని తొలగించడం. నిధులు నిక్షేపాల కోసం పురాతన కట్టడాలన్నీ కోటలని తవ్విన ఉదంతాలని ఈ పుస్తకంలో చదివాక ఎప్పటినుంచో నన్ను వేధిస్తున్న ప్రశ్న తమిళనాడు, కర్ణాటక లాగా మన తెలుగు రాష్ట్రాల్లో పురాతన కట్టడాలు ఎందుకు తక్కువగా ఉన్నాయో నా ప్రశ్నకి జవాబు అర్థమైంది.-మన తెలుగు నాట జరిగిన లైలా మజ్ను లాంటి అమర ప్రేమ కథను ఈ పుస్తకంలో అశేరా గారు అద్భుతంగా చెప్పారు. అదే మన కదిరి నరసింహ స్వామి సాక్షిగా జరిగిన చంద్రవదన - మొహియర్ చారిత్రక ప్రేమగాథ.- ఆంజనేయ స్వామికి కుమారుడు ఉన్నాడు. ఆయన శక్తిలోను ,స్వామి భక్తిలోనూ తండ్రికి సమానుడు కానీ రావణాసురుడు వద్ద పనిచేయాల్సి వస్తుంది అనే విషయం ఈ పుస్తకంలో రాసిన కథ చదివి ఆశ్చర్యపోయాను.ఆయన విగ్రహం కొలనపాకలో ఉందట. అంతకుముందు ఆ విగ్రహాన్ని ఆంజనేయస్వామి అనుకునేవారుట కానీ విజయ్ కుమార్ గారు దానిని ఆధారాలతో ఆంజనేయస్వామి కుమారుడిని రుజువు చేసిన విధానం చదివాక అద్భుతం అనిపిస్తుంది.- ఓసారి ఓ పెద్దాయన వచ్చి మా ఇంట్లో లంకె బిందెలు ఉన్నాయి సార్ వాటిని తవ్వి తీసి మా గ్రామానికి, మన దేశానికి ఉపయోగపడే పని చేయండి సార్ అని అంటారు, మరొకాయిన నా దగ్గర జింక చర్మం మీద నిధి గురించిన మ్యాప్ ఉంది అంటూ చూడమంటారు ఈ విశేషాలు అన్ని కూడా చదువుతుంటే చాలా ఆసక్తికరంగా, విజ్ఞానదాయకంగా ఉన్నాయి .- ఇంకా మరెన్నో తిమ్మమ్మ మర్రిమాను కథ, దక్షిణ భారత జలియన్ వాలా బాగ్, శ్రీకృష్ణదేవరాయని కుమారుని గురించిన శాసనాలు. మరెన్నో అద్భుతమైన పురాతన దేవాలయాల విశేషాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.-ఈ చారిత్రక ప్రయాణానికి మార్గదర్శకత్వం వహించిన విజయకుమార్ గారి జీవితం చాలా ఆదర్శవంతంగా అనిపించింది, ముఖ్యంగా ఆయన ఎన్నో పల్లెలు తిరిగి స్థానికులతో పోరాడి వారికి ఎంతో నచ్చచెప్పి అనేక విలువైన విగ్రహాలను మ్యూజియాలకు తరలించి భావితరాల కోసం చేసిన కృషి అభినందనీయం.చివరిగా ఓ మాట రచయిత అశేరా గారు చాలా సంఘటనలు ముక్కుసూటిగా రాశారు. చరిత్రని దాయకూడదు అనేది ఆయన ప్రధాన ఉద్దేశ్యం. ఆయన కథనం వైవిధ్య భరితంగా చాలా బాగుంది. ఎన్నెల పిట్ట ప్రచూరణ వారు ఈ పుస్తకాన్ని చాలా బాగా ముద్రించారు. చరిత్ర పట్ల, చారిత్రక కట్టడాలు అంటే ఆసక్తి ఉన్నవారు తప్పక చదవాల్సిన పుస్తకం.- శ్రీనివాస చక్రవర్తి.
Monday, 13 October 2025
పుస్తకం: పాటలు పుట్టిన తావులు
ఈ మధ్య కాలంలో చదివిన ఓ అద్భుతమైన పుస్తకం: పాటలు పుట్టిన తావులు.ఆహా.. ఏమి పుస్తకం.. ఏమి సందర్శనం.. ఏమి కథనం..
ఈ పుస్తకం చదువుతుంటే మనం కూడా రచయిత చిన వీరభద్రుడు గారితో కలిసి పాటలు పుట్టిన తావుల్లో స్వయంగా సందర్శించిన అనుభూతిని పొందుతాం. ఎన్నో పురాతన క్షేత్రాలను ఎందరో గొప్ప వ్యక్తులను కలుసుకుంటాం, ఏ సందర్భంలో కవి హృదయం ఎలా స్పందించిందో.. ఆ హృదయం నుంచి జాలువారిన పాటలను/ పదాలను తెలుసుకొని మనం కూడా పరవశించిపోతాం.ఒక సంఘటన చూద్దాం..
తమిళ దేశంలో ప్రముఖులైన జ్ఞానసంబంధర్, అప్పర్ ఇద్దరూ కలిసి ఓనాడు తిరుమలైకాడు దేవాలయానికి వెళ్తారు. అక్కడ ప్రధాన ద్వారం మూసి ఉండటం సంబంధర్ చూసి అప్పర్ ని మీరు స్వామిని స్తోత్రం చేస్తూ ఒక పాట పాడండి అంటారు.. మొదటి పాట పాడగానే తలుపులు కిర్రుమంటాయి కానీ అవి తెరుచుకోవు, అప్పుడు వెంటనే అప్పర్ మరో పాట పాడగానే తలుపులు పూర్తిగా తెరుచుకుంటాయి. లోపలికి అడుగుపెట్టగానే తలుపులు మూసుకుపోతాయి. స్వామిని పూజించి తిరిగి వస్తుంటే మూసిన తలుపులు తెరుసుకోవడం కోసం సంబందర్ ను పాట పాడమని ఈసారి అప్పర్ అడుగుతారు, సంబంధర్ పాట ఎత్తుకొని మొదట వాక్యం పలికాడో లేదో వెంటనే తలుపులు బార్ల తెరుచుకుంటాయి. అక్కడ చేరిన జనం ఈ సంఘటన చూసి ఆశ్చర్యానికి లోనవుతారు. ఈ సంఘటన గురించి రచయిత చెబుతూ ఇది ఒక కవిని ఎక్కువ , మరో కవిని తక్కువ చేయడం కాదు ఇది కేవలం రూపాలంకారం మాత్రమే అని చెబుతారు .. మరో సంఘటనలో అప్పర్, సంబంధర్ కరువు సంభవించిన ప్రాంతం ప్రజలు కోసం పాటలతో దేవుణ్ణి ప్రార్థించి బంగారుకాసుల్ని తెప్పించిన ఘటన చాలా అద్భుతంగా ఉంది.కొన్ని జీవితాలకి అభిమానులుగా మారుతాం..
ఈ పుస్తకం లో సుబ్రహ్మణ్య భారతి గారి గురించి రచయిత చెప్పిన విధానం నాకు చాలా బాగా నచ్చింది, భారతి గారు 12 భాషల్లో పండితుడు కత్తి సామూ ,మల్ల యుద్ధం, భరతనాట్యం, సంగీతంలో గొప్ప ప్రావీణ్యం సంపాదించడమే కాకుండా పత్రికలు కూడా నడిపారట, గొప్ప సామాజిక సంస్కర్త ,తమిళ గద్య పితామహుడు అని ఒక మంచి పరిచయం చేశారు. ఆయన జీవితంలో ఈ సంఘటన చూడండి.
ఓ రోజు భారతి గారు కొంతమంది బీద పిల్లలు తినడానికి తిండి లేక వేప పండ్లు ఏరుకొని తినడం చూశారట, ఆ రోజు నుంచి తనకి తిండి రుచి తెలియకుండా పోయిందని సుబ్రమణ్య భారతి గారు ఒక చోట రాసుకున్నారట.. నిజంగా ఆయనది ఎంత ద్రవించే హృదయం.
ప్రతి స్త్రీలో తల్లిని చూసిన వ్యక్తి భారతి గారు, ఆయన పసిప్రాయంలోనే ఆమె తల్లి ఆయనను వదిలి దివికేగారట, తరువాత భారతి గారు ప్రతి స్త్రీలో కూడా తన మాతృవదనాన్నే దర్శించారట.
చిన వీరభద్రుడు గారు ఇక్కడ ఒక మాట చెప్పారు " ప్రతి ఒక్క స్త్రీలో తల్లిని దర్శించడం అంటే ఏమిటి? నువ్వు సదా బాలకుడిగా ఉండటమే కదా..ఈ మాటలు నా చిన్నతనంలో నా హృదయంలో సూది మందు ఎక్కించినట్లుగా నా తల్లిదండ్రులు చెబితే ఎంత బాగుండేది"
సుబ్రహ్మణ్య భారతి గారి గురించి చదివాక ఆయనకి అభిమానిని అయిపోయాను నేను.ఇలాంటి ఆదర్శనీయమైన వ్యక్తి మరొకరు అమ్మైయారు, తనను తాను ఒక భూతంగా భావించుకొని భగవంతుని కోసం స్మశానంలో వెతికిందంట, తిరువాలంగాడు అనేది పరమ పవిత్రమైన ప్రదేశంగా భావించి పాదాలతో తాకరాదని, పాదాలు పైకెత్తి అరచేతుల మీద నడిచే ఘట్టం చదివి ఆశ్చర్యపోయాను .ఈ పుస్తకంలో ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విశేషాలను తెలుసుకొన్నాను.
- రమణ మహర్షి తను పుట్టిన ప్రదేశం నుండి అరుణాచలం చేరిన విధానం.
- ఎక్కడ గంగైకొండ చోళాపురం ఎక్కడ రాజేంద్ర మహేంద్రవరం. రాజ రాజేంద్ర చోళుడు కుమార్తె మన రాజ రాజ నరేంద్రుని (రాజమహేంద్రవరం) అర్థాంగిగా వచ్చారట.
- శ్రీరంగ నాథుడు పూల మాలలు కట్టేవారితో తన భక్తుల గురించి సంభాషించిన సంఘటన
- చలంగారు - రమణ మహర్షి - అరుణాచలం జీవితాదర్శం ఘట్టాలు
- తన భక్తురాలిను గణపతి తొండంతో నేరుగా కైలాసానికి తీసుకొని వెళ్ళిన సంఘటన.
- కావేరి నది అందాలు - త్యాగ రాజ ఆరాధన మండపంలో చినవీరభద్రుడు గారు పొందిన అనుభవం.. చిన వీరభద్రుడు గారు ఈ పుస్తకంలో ఓచోట ఓ మాట చెబుతారు.
"ఎందరో మహానుభావులు చేతిలో చిల్లిగవ్వ లేని జీవితాన్ని అనుభవిస్తూ కూడా తోటి మనుషుల కోసం, భాష కోసం వారు పడ్డ తపన, చేసిన సేవ తెలిసిన కొద్ది.. జీవితం మనకెంతో అవకాశం ఇచ్చిన మనమేం చేస్తున్నాం అనే ప్రశ్న పదేపదే గుచ్చుకుంటుంది".. ఈ పుస్తకం చదివాక వారి అందరి జీవితాల నుంచి గొప్ప ప్రేరణ పొందుతాం.ఈ నేల మీద, మన వారసత్వపు సంపద మీద మన ప్రేమ రెట్టింపు అవుతుంది.పుస్తకం చదివాక ఆలోచిస్తుంటే మన తెలుగు రాష్ట్రాల్లో జన్మించిన కవులు గురించి, వారు నడయాడిన ప్రదేశాలు గూర్చి తెలుసుకోవాలనే తపన నాలో పెరిగింది. ఇంత గొప్ప రచనను మన ముందు తీసుకొని వచ్చిన చిన వీరభద్రుడు గారికి , ఈ పుస్తకం అందించి చదవమని ప్రోత్సహించిన కొప్పరపు లక్ష్మి నరసింహరావు గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు.- శ్రీనివాస చక్రవర్తి.
Monday, 22 September 2025
కథ 2023 సంకలనం : నాకు నచ్చిన కథలు

ప్రతి ఏడాది అన్ని పత్రికల్లో వచ్చే కథలను పరిశీలించి, మంచి మంచి కథలను తీసుకొని ఓ మంచి కథా సంకలనంగా తీసుకొని రావడం అంటే మాటలు కాదు. 2023 వ సంవత్సరంలో వివిధ మాధ్యమాల్లో వచ్చిన 2500 కథలను చదివి వాటిలో ఒక 15 కథలను ఏరి మన ముందు ఉంచారు కథా సాహితి సభ్యులు. ఇలా 35 సంవత్సరాల నుండి అంతరాయం లేకుండా కథా సంకలనాలు వస్తున్నాయి అని తెలిసి ఆశ్చర్యపోయాను. ఓ రోజు హర్షణీయం పాడ్ క్యాస్ట్ వింటుంటే ఈ కథ సంకలనాలు గురించి వాటి వెనుక ఉన్న విశేషాలు గురించి తెలుసుకున్నాను. ఆ ప్రేరణతో ఈ ఏడాది ఒక కథ సంకలనం చదివి చూద్దాం అని "కథ 2023" పుస్తకం విజయవాడ పుస్తకాల పండుగలో తీసుకొన్నాను. 2025లో నేను మొట్టమొదటిగా చదవడం పూర్తి చేసిన పుస్తకం కూడా ఇదే, పూర్తి చేసాక మనసుకు ఓ మంచి సంతృప్తిని కలిగిన అనుభూతి కలిగింది. ఇన్ని సంవత్సరాలు కథా సంకలనాలు ఎలా మిస్ చేసానా అనిపించింది.కొన్ని కథలు చాలా బాగా నచ్చాయి, కొన్ని కథలను అర్థం చేసుకోలేక పోయాను. నాకు బాగా నచ్చిన ఓ 4 కథలు నాకు అర్థం అయిన మేర మీతో పంచుకుంటాను.
1.మనసు - మర్మం: అమెరికాలో ఓ గొప్ప యంత్రం వస్తుంది. ఆ యంత్రం ఉన్న గదిలోకి వెళితే మన మనసును Scan చేసి మనసులో ఉన్న విషయాలు అన్నీ చెప్పేస్తుంది. దీనిని పరిక్షించడానికి అన్ని దేశాల ప్రజలు నుంచి లాటరీ విధానంలో ఒక వ్యక్తిని ఎన్నుకుంటారు, అనుకోకుండా ఆ వ్యక్తి మన భారతదేశానికి, మన తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తి అవుతాడు. యంత్రంతో పరీక్షకు వెళ్ళేముందు ఆ వ్యక్తి చిన్నప్పుడు నుంచి ఇప్పటి వరకు మనసులో దాచుకుని బయటకు చెప్పలేని సంఘటనలు అన్నీ ఓసారి రీల్ లాగా గిర్రున తిరుగుతాయి , అవన్నీ ఆ యంత్రం బయట పెడుతుంది ఏమోనని తీవ్రమైన ఒత్తిడికి గురి అవుతాడు మన కథా నాయకుడు. ఆ సంఘటనలు చదువుతుంటే అందులో మనల్ని మనం చూసుకుంటున్నట్లు ఉంటుంది. పరిక్ష జరిగే ముందు రోజు ఓ ప్రముఖ ఛానల్ నుంచి మీరు మానవాళికి ఇచ్చే సందేశం ఏమిటో రికార్డు చేసి పంపమని ఒక మెయిల్ వస్తుంది అందులో చెప్పిన ఈ మాటలు చాలా స్పూర్తివంతంగా ఉన్నాయి ..
"ఎంతకాలం పరదాలు వెనుక దాక్కుంటాం , ఎంతకాలం మంచివాళ్ళలా చెలామణి అవుతాం ఆత్మవంచనతో కాదు, ఆత్మ సంతృప్తితో బతకాలి. బతుకు.. బతకనివ్వు అనే భావన మధురంగా ఉండదూ..?" ఇలా అద్భుతంగా సాగుతాయి ఆయన చెప్పిన మాటలు.
మరి ఇంతకీ మనసులో మర్మాన్ని తెలిపే ఆ యంత్రం కథ చివరిగా ఏమైందో తెలుసుకోవాలంటే ఈ కథను పూర్తిగా చదవాల్సిందే. రచయిత అనిశెట్టి శ్రీధర్ గారు ఓ మంచి సందేశాన్ని ఈ కథ ద్వారా ఇచ్చారు.
******
2. పులస : భూమితో స్నేహం చేసిన ఓ స్త్రీ కథ. ఒక ఊరిలో రవణమ్మ అనే ఆవిడ ఉంటుంది. చిన్నతనం నుండి పొలం పనులు చేయడం అంటే ఆమెకు సరదా మరియు ఎంతో ఇష్టం , రోజులు తెలిసేవి కావు చేను అంటే ప్రాణంగా ఉంటుంది . ప్రక్కనే ఉన్న ఊరులో ఒకాయన తో ఆమెకు వివాహం జరుగుతుంది. భూమి మీద ఉన్న ఇష్టం వలన ఓరోజు తమ పొలం చూపించమని అత్త, భర్తలను అడుగుతుంది ..
"భూమి గురించి నీకెందుకు, తిని ఇంటికాడ కూర్చోవచ్చు కదా" అని అంటారు. భూమితో రుణం తీరిపోయిందా అని బాధపడుతుంది తాను. అదే సమయంలో రవణమ్మ అన్నదమ్ములకు పొలం వాటాలు వేస్తూ ఉంటారు తల్లిదండ్రులు, రవణమ్మ పంచాయతీకి వెళ్ళి భూమిలో తన వాటా సంపాదిస్తుంది . ఆ భూమిని బంగారంగా మారుస్తుంది.. కొంతకాలానికి ఆ భూమి వేరే వాళ్ళ చేతికి వెళ్ళిబోతుంటే ఆ భూమిని తిరిగి సంపాదించాలని రవణమ్మ చేసిన పోరాటం మరియు భూమిని దైవంగా ఆరాదించడమే ఈ కథ.
ఈ కథలో నాకు బాగా నచ్చిన లైన్స్ చేసే పని ఏదైనా ప్రాణం పెట్టాలి అనే విధంగా ఉన్నాయి...
ఓసారి మీరు చదవండి
" సేనంటే ఏటి? బూవితో సేయితం సెయ్యాల, ఆయమ్మని ముద్దాడలా, ఒడుపుగా ఆయమ్మ సేతిలో సెయ్యెయాలా, అన్నింటికన్నా ముక్కెం మన సెమట సుక్కల్తో ఆ తల్లి సానవాడాల"
రచయిత్రి కత్తి పద్మ గారు రాసిన విధానం చాలా బాగుంది . ఈ కథ చదివిన చాలా రోజుల వరకు నన్ను వెంటాడుతూనే ఉంది.
*******
3.చప్పుడు చేసే నిశబ్దాలు : ఈ కథను నేను రైలు ప్రయాణంలో చదివాను. రచయిత ఛాయా మోహన్ గారు ఈ కథను అద్భుతంగా రాశారు.
ఉరుకుల పరుగుల జీవితం మన మనుషులు మన పక్కనే ఉన్నారు కదా అనుకుంటాం.. సంవత్సరాలు గడిచిపోతాయి.. పిల్లలు పెద్దలుగా మారతారు చదువులు, ఉద్యోగాలు అని ఎక్కడో స్థిరపడి పోతారు. తల్లి దండ్రులు, భాగస్వామి కాలం ఎవరిని ఎక్కడికి తీసుకొని వెళుతుందో తెలియదు ...
సమయం చేసుకుని మన వాళ్ళతో గడపాలి అదేవిధంగా కనువిప్పు కలిగించే ఈ కథలో సందర్భానుసారంగా మధ్యలో మంచి పాటలు జత చేసారు రచయిత ఛాయా మోహన్ గారు.
*******
4.ముసురు : ఇప్పటి తరం యువత కులవృత్తి పట్ల చూపిస్తున్న నిరాసక్తత . కులవృత్తి మీద ఆధారపడ్డ కుటుంబాలు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను ముసురు కథలో రచయిత్రి స్పూర్తి గారు దృశ్య రూపంలాగా చిత్రీకరించారు, ముఖ్యంగా కురుమయ్య తాతయ్య పాత్ర చాలా బాగా నచ్చింది నాకు.
కథ-2023 సంకలనం చాలా బాగుంది. ఈ ఏడాది రాబోయో కథ 2024 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఫ్రెండ్స్ మీరు కూడా కథా సంకలనాలతో మరియు కథలతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటారు కదూ..
- శ్రీనివాస చక్రవర్తి.
Monday, 15 September 2025
పుస్తకం: జీవనయానం
ఆత్మకథ సాహిత్యంలో నాకు బాగా నచ్చిన ఓ పుస్తకం : జీవనయానం
ఈ పుస్తకం లోని రంగాచార్యులు వారి నాలుగు మాటలు "నది జీవితం వంటిది. బిందువుగా మొదలవుతుంది, ఉపనదులు కలుస్తాయి విశాలమవుతుంది. జీవితంలో అనుభవాలు కలుస్తాయి అది విశాలమవుతుంది. నదికి కొండలు కోనలు ఎదురవుతాయి అప్పుడు జలపాతం అవుతుంది, హోరును సృష్టిస్తుంది. జీవితంలో ఆపదలు ఎదురవుతాయి అప్పుడే జీవితనాథం వినిపిస్తుంది. జీవితం వికస్తుంది.చిక్కుల్లో మనిషి ఎదుగుతాడు ,ఆపదల్లో ఉన్నతుడు అవుతాడు. మనిషి అయినా జాతి అయినా అంతే." ఈ వాక్యాలు చదివినప్పుడు ఏదో తెలియని ఉత్సాహం వస్తుంది.
నేను పుస్తకాల పండుగకు వెళ్ళే మొదటి దశలో ఈ పుస్తకం నాకు చాలా స్టాల్స్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉండేది , కాని కవర్ పేజీని మరియు టైటిల్ ని చూసి ఇదే ఏదో ఆధ్యాత్మికానికి సంబంధించినది అని మనకు అర్థం అయ్యే పుస్తకం కాదు అని మొదట్లో అనుకునేవాడిని.కానీ ఒక్కసారి మన తెలుగులో వచ్చిన అత్యుత్తమ ఆత్మకథలు ఏవి అని తెలుసుకుందామని ప్రయత్నిస్తే అందులో ఇది కూడా ఒకటని తెలిసింది.అప్పుడు చదవడం మొదలుపెట్టాను. ఇంత గొప్ప పుస్తకాన్ని ఇన్ని రోజులు ఎందుకు చదవలేదా అనిపించింది. ఈ పుస్తకం పూర్తి అయ్యేంతవరకు మరో పుస్తకం వైపు చూడలేదు అంత ఆసక్తిగా, అంత అద్భుతంగా అనిపించింది రంగాచార్యులు వారి రచనా శైలి , దృశ్యాలను కళ్ళముందు పరిచారు .
- ఇది రంగాచార్యులు ఆత్మకథే కాదు, మన తెలుగు జాతి ఆత్మకథలాగా నాకు అనిపించింది. నాటి మన తెలుగు రాష్ట్రాల (స్వాతంత్ర్య ఉద్యమ పూర్వ కాలంలో, తరువాత కాలంలో) పరిస్థితులు ఎన్నో విషయాలు కళ్ళకు కట్టినట్లు రాశారు.
- నాకు వింతగా అనిపించింది ఆనాటి కరెన్సీ , అప్పుడు ఖమ్మం నుంచి విజయవాడ రావాలంటే కరెన్సీ మార్చుకోవాలి అంటా నిజాం కరెన్సీ ను బ్రిటిష్ ఇండియా కరెన్సీగా మార్చుకొంటేనే ఆయా ప్రాంతాల్లో లావేదేవీలు జరపగలం అంటా.
- హుస్సేన్ సాగర్ కి ఆ పేరు ఎలా వచ్చింది అంటే కుతుబ్ షాహీల కాలంలో ఇబ్రహీం కూలీ కుతుబ్షాకి జబ్బు చేయడం వలన హుస్సేన్ షావలి అనే ఫకీర్ దగ్గరికి వెళ్ళారట , ఆయన జబ్బు నయం చేయటం వలన కృతజ్ఞత పూర్వకంగా ఆయన పేరు మీద హుస్సేన్ సాగర్ ని 1562 వ సంవత్సరంలో నిర్మించారు అట.
-అలాగే కరీంనగర్, మహబూబ్ నగర్ వీటికి అప్పట్లో వేరే పేర్లు ఉండేవట , వాటిని నిజాం కాలంలో ఎలా మారాయో కూడా చెప్పారు.
- అప్పట్లో తెలుగు ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి ముఖ్యంగా నిజాం పాలనలో ఉర్దూ మీడియంలో చదవాల్సి వచ్చేది , ఉద్యోగాలు కూడా ఆ భాష నేర్చిన వారికే ప్రాముఖ్యత ఉండేది.
ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు రాశారు. ముఖ్యంగా సాయుధ పోరాటం నాటి విషయాలు ,ఆ వీరులు త్యాగాలు చదువుతుంటే మనకు ఈ నేల మీద ఉన్న ప్రేమ రెట్టింపు అవుతుంది.స్వత్వాహాగ ఆయన గొప్ప రచయిత అయి ఉండటం వలన హృదయాలను కదిలించే గొప్ప రచనగా మలిచారు. ప్రతి తెలుగువాడు చదవాల్సిన పుస్తకం జీవనయానం.ఫ్రెండ్స్ మీరు కూడా మీకు బాగా నచ్చిన ఆత్మకథ పుస్తకాలను తెలియజేయండి. మేము వాటిని చదివి ప్రేరణ పొందుతాం.
- శ్రీనివాస చక్రవర్తి


