Monday, 15 September 2025

పుస్తకం: జీవనయానం

 ఆత్మకథ సాహిత్యంలో నాకు బాగా నచ్చిన ఓ పుస్తకం : జీవనయానం 



ఈ పుస్తకం లోని రంగాచార్యులు వారి నాలుగు మాటలు "నది జీవితం వంటిది. బిందువుగా మొదలవుతుంది, ఉపనదులు కలుస్తాయి విశాలమవుతుంది. జీవితంలో అనుభవాలు కలుస్తాయి అది విశాలమవుతుంది. నదికి కొండలు కోనలు ఎదురవుతాయి అప్పుడు జలపాతం అవుతుంది, హోరును సృష్టిస్తుంది. జీవితంలో ఆపదలు ఎదురవుతాయి అప్పుడే జీవితనాథం వినిపిస్తుంది. జీవితం వికస్తుంది.చిక్కుల్లో మనిషి ఎదుగుతాడు ,ఆపదల్లో ఉన్నతుడు అవుతాడు. మనిషి అయినా జాతి అయినా అంతే." ఈ వాక్యాలు చదివినప్పుడు ఏదో తెలియని ఉత్సాహం వస్తుంది.

నేను పుస్తకాల పండుగకు వెళ్ళే మొదటి దశలో ఈ పుస్తకం నాకు చాలా స్టాల్స్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉండేది , కాని కవర్ పేజీని మరియు టైటిల్ ని చూసి ఇదే ఏదో ఆధ్యాత్మికానికి సంబంధించినది అని మనకు అర్థం అయ్యే పుస్తకం కాదు అని మొదట్లో అనుకునేవాడిని.కానీ ఒక్కసారి మన తెలుగులో వచ్చిన అత్యుత్తమ ఆత్మకథలు ఏవి అని తెలుసుకుందామని ప్రయత్నిస్తే అందులో ఇది కూడా ఒకటని తెలిసింది.అప్పుడు చదవడం మొదలుపెట్టాను. ఇంత గొప్ప పుస్తకాన్ని ఇన్ని రోజులు ఎందుకు చదవలేదా అనిపించింది. ఈ పుస్తకం పూర్తి అయ్యేంతవరకు మరో పుస్తకం వైపు చూడలేదు అంత ఆసక్తిగా, అంత అద్భుతంగా అనిపించింది రంగాచార్యులు వారి రచనా శైలి , దృశ్యాలను కళ్ళముందు పరిచారు .


- ఇది రంగాచార్యులు ఆత్మకథే కాదు, మన తెలుగు జాతి ఆత్మకథలాగా నాకు అనిపించింది. నాటి మన తెలుగు రాష్ట్రాల (స్వాతంత్ర్య ఉద్యమ పూర్వ కాలంలో, తరువాత కాలంలో) పరిస్థితులు ఎన్నో విషయాలు కళ్ళకు కట్టినట్లు రాశారు.

- నాకు వింతగా అనిపించింది ఆనాటి కరెన్సీ , అప్పుడు ఖమ్మం నుంచి విజయవాడ రావాలంటే కరెన్సీ మార్చుకోవాలి అంటా నిజాం కరెన్సీ ను బ్రిటిష్ ఇండియా కరెన్సీగా మార్చుకొంటేనే ఆయా ప్రాంతాల్లో లావేదేవీలు జరపగలం అంటా.

- హుస్సేన్ సాగర్ కి ఆ పేరు ఎలా వచ్చింది అంటే కుతుబ్ షాహీల కాలంలో ఇబ్రహీం కూలీ కుతుబ్షాకి జబ్బు చేయడం వలన హుస్సేన్ షావలి అనే ఫకీర్ దగ్గరికి వెళ్ళారట , ఆయన జబ్బు నయం చేయటం వలన కృతజ్ఞత పూర్వకంగా ఆయన పేరు మీద హుస్సేన్ సాగర్ ని 1562 వ సంవత్సరంలో నిర్మించారు అట.

-అలాగే కరీంనగర్, మహబూబ్ నగర్ వీటికి అప్పట్లో వేరే పేర్లు ఉండేవట , వాటిని నిజాం కాలంలో ఎలా మారాయో కూడా చెప్పారు.

- అప్పట్లో తెలుగు ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి ముఖ్యంగా నిజాం పాలనలో ఉర్దూ మీడియంలో చదవాల్సి వచ్చేది , ఉద్యోగాలు కూడా ఆ భాష నేర్చిన వారికే ప్రాముఖ్యత ఉండేది.

ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు రాశారు. ముఖ్యంగా సాయుధ పోరాటం నాటి విషయాలు ,ఆ వీరులు త్యాగాలు చదువుతుంటే మనకు ఈ నేల మీద ఉన్న ప్రేమ రెట్టింపు అవుతుంది.స్వత్వాహాగ ఆయన గొప్ప రచయిత అయి ఉండటం వలన హృదయాలను కదిలించే గొప్ప రచనగా మలిచారు. ప్రతి తెలుగువాడు చదవాల్సిన పుస్తకం జీవనయానం.ఫ్రెండ్స్ మీరు కూడా మీకు బాగా నచ్చిన ఆత్మకథ పుస్తకాలను తెలియజేయండి. మేము వాటిని చదివి ప్రేరణ పొందుతాం.

- శ్రీనివాస చక్రవర్తి 

No comments:

Post a Comment