Monday, 22 September 2025

కథ 2023 సంకలనం : నాకు నచ్చిన కథలు






ప్రతి ఏడాది అన్ని పత్రికల్లో వచ్చే కథలను పరిశీలించి, మంచి మంచి కథలను తీసుకొని ఓ మంచి కథా సంకలనంగా తీసుకొని రావడం అంటే మాటలు కాదు. 2023 వ సంవత్సరంలో వివిధ మాధ్యమాల్లో వచ్చిన 2500 కథలను చదివి వాటిలో ఒక 15 కథలను ఏరి మన ముందు ఉంచారు కథా సాహితి సభ్యులు. ఇలా 35 సంవత్సరాల నుండి అంతరాయం లేకుండా కథా సంకలనాలు వస్తున్నాయి అని తెలిసి ఆశ్చర్యపోయాను. ఓ రోజు హర్షణీయం పాడ్ క్యాస్ట్ వింటుంటే ఈ కథ సంకలనాలు గురించి వాటి వెనుక ఉన్న విశేషాలు గురించి తెలుసుకున్నాను. ఆ ప్రేరణతో ఈ ఏడాది ఒక కథ సంకలనం చదివి చూద్దాం అని "కథ 2023" పుస్తకం విజయవాడ పుస్తకాల పండుగలో తీసుకొన్నాను. 2025లో నేను మొట్టమొదటిగా చదవడం పూర్తి చేసిన పుస్తకం కూడా ఇదే‌, పూర్తి చేసాక మనసుకు ఓ మంచి సంతృప్తిని కలిగిన అనుభూతి కలిగింది. ఇన్ని సంవత్సరాలు కథా సంకలనాలు ఎలా మిస్ చేసానా అనిపించింది.కొన్ని కథలు చాలా బాగా నచ్చాయి, కొన్ని కథలను అర్థం చేసుకోలేక పోయాను. నాకు బాగా నచ్చిన ఓ 4 కథలు నాకు అర్థం అయిన మేర మీతో పంచుకుంటాను.


1‌.మనసు - మర్మం: అమెరికాలో ఓ గొప్ప యంత్రం వస్తుంది. ఆ యంత్రం ఉన్న గదిలోకి వెళితే మన మనసును Scan చేసి మనసులో ఉన్న విషయాలు అన్నీ చెప్పేస్తుంది. దీనిని పరిక్షించడానికి అన్ని దేశాల ప్రజలు నుంచి లాటరీ విధానంలో ఒక వ్యక్తిని ఎన్నుకుంటారు, అనుకోకుండా ఆ వ్యక్తి మన భారతదేశానికి, మన తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తి అవుతాడు. యంత్రంతో పరీక్షకు వెళ్ళేముందు ఆ వ్యక్తి చిన్నప్పుడు నుంచి ఇప్పటి వరకు మనసులో దాచుకుని బయటకు చెప్పలేని సంఘటనలు అన్నీ ఓసారి రీల్ లాగా గిర్రున తిరుగుతాయి , అవన్నీ ఆ యంత్రం బయట పెడుతుంది ఏమోనని తీవ్రమైన ఒత్తిడికి గురి అవుతాడు మన కథా నాయకుడు. ఆ సంఘటనలు చదువుతుంటే అందులో మనల్ని మనం చూసుకుంటున్నట్లు ఉంటుంది. పరిక్ష జరిగే ముందు రోజు ఓ ప్రముఖ ఛానల్ నుంచి మీరు మానవాళికి ఇచ్చే సందేశం ఏమిటో రికార్డు చేసి పంపమని ఒక మెయిల్ వస్తుంది అందులో చెప్పిన ఈ మాటలు చాలా స్పూర్తివంతంగా ఉన్నాయి ..

"ఎంతకాలం పరదాలు వెనుక దాక్కుంటాం , ఎంతకాలం మంచివాళ్ళలా చెలామణి అవుతాం ఆత్మవంచనతో కాదు, ఆత్మ సంతృప్తితో బతకాలి. బతుకు.. బతకనివ్వు అనే భావన మధురంగా ఉండదూ..?" ఇలా అద్భుతంగా సాగుతాయి ఆయన చెప్పిన మాటలు.

మరి ఇంతకీ మనసులో మర్మాన్ని తెలిపే ఆ యంత్రం కథ చివరిగా ఏమైందో తెలుసుకోవాలంటే ఈ కథను పూర్తిగా చదవాల్సిందే. రచయిత అనిశెట్టి శ్రీధర్ గారు ఓ మంచి సందేశాన్ని ఈ కథ ద్వారా ఇచ్చారు.

******

2. పులస : భూమితో స్నేహం చేసిన ఓ స్త్రీ కథ. ఒక ఊరిలో రవణమ్మ అనే ఆవిడ ఉంటుంది. చిన్నతనం నుండి పొలం పనులు చేయడం అంటే ఆమెకు సరదా మరియు ఎంతో ఇష్టం , రోజులు తెలిసేవి కావు చేను అంటే ప్రాణంగా ఉంటుంది . ప్రక్కనే ఉన్న ఊరులో ఒకాయన తో ఆమెకు వివాహం జరుగుతుంది. భూమి మీద ఉన్న ఇష్టం వలన ఓరోజు తమ పొలం చూపించమని అత్త, భర్తలను అడుగుతుంది ..

"భూమి గురించి నీకెందుకు, తిని ఇంటికాడ కూర్చోవచ్చు కదా" అని అంటారు. భూమితో రుణం తీరిపోయిందా అని బాధపడుతుంది తాను. అదే సమయంలో రవణమ్మ అన్నదమ్ములకు పొలం వాటాలు వేస్తూ ఉంటారు తల్లిదండ్రులు, రవణమ్మ పంచాయతీకి వెళ్ళి భూమిలో తన వాటా సంపాదిస్తుంది . ఆ భూమిని బంగారంగా మారుస్తుంది.. కొంతకాలానికి ఆ భూమి వేరే వాళ్ళ చేతికి వెళ్ళిబోతుంటే ఆ భూమిని తిరిగి సంపాదించాలని రవణమ్మ చేసిన పోరాటం మరియు భూమిని దైవంగా ఆరాదించడమే ఈ కథ.

ఈ కథలో నాకు బాగా నచ్చిన లైన్స్ చేసే పని ఏదైనా ప్రాణం పెట్టాలి అనే విధంగా ఉన్నాయి...

ఓసారి మీరు చదవండి 

" సేనంటే ఏటి? బూవితో సేయితం సెయ్యాల, ఆయమ్మని ముద్దాడలా, ఒడుపుగా ఆయమ్మ సేతిలో సెయ్యెయాలా, అన్నింటికన్నా ముక్కెం మన సెమట సుక్కల్తో ఆ తల్లి సానవాడాల"  

రచయిత్రి కత్తి పద్మ గారు రాసిన విధానం చాలా బాగుంది . ఈ కథ చదివిన చాలా రోజుల వరకు నన్ను వెంటాడుతూనే ఉంది.

*******

3.చప్పుడు చేసే నిశబ్దాలు : ఈ కథను నేను రైలు ప్రయాణంలో చదివాను‌. రచయిత ఛాయా మోహన్ గారు ఈ కథను అద్భుతంగా రాశారు. 

ఉరుకుల పరుగుల జీవితం మన మనుషులు మన పక్కనే ఉన్నారు కదా అనుకుంటాం.. సంవత్సరాలు గడిచిపోతాయి.. పిల్లలు పెద్దలుగా మారతారు చదువులు, ఉద్యోగాలు అని ఎక్కడో స్థిరపడి పోతారు. తల్లి దండ్రులు, భాగస్వామి కాలం ఎవరిని ఎక్కడికి తీసుకొని వెళుతుందో తెలియదు ...

సమయం చేసుకుని మన వాళ్ళతో గడపాలి అదేవిధంగా కనువిప్పు కలిగించే ఈ కథలో సందర్భానుసారంగా మధ్యలో మంచి పాటలు జత చేసారు రచయిత ఛాయా మోహన్ గారు.

*******

4.ముసురు : ఇప్పటి తరం యువత కులవృత్తి పట్ల చూపిస్తున్న నిరాసక్తత . కులవృత్తి మీద ఆధారపడ్డ కుటుంబాలు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను ముసురు కథలో రచయిత్రి స్పూర్తి గారు దృశ్య రూపంలాగా చిత్రీకరించారు, ముఖ్యంగా కురుమయ్య తాతయ్య పాత్ర చాలా బాగా నచ్చింది నాకు.

 కథ-2023 సంకలనం చాలా బాగుంది. ఈ ఏడాది రాబోయో కథ 2024 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఫ్రెండ్స్ మీరు కూడా కథా సంకలనాలతో మరియు కథలతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటారు కదూ..

- శ్రీనివాస చక్రవర్తి.



 

No comments:

Post a Comment