Saturday, 8 November 2025

పుస్తకం: కంబగిరి నుంచి శేషగిరి దాక..

 అక్టోబరులో చదివిన పుస్తకం: కంబగిరి నుంచి శేషగిరి దాక..


ఓ చారిత్రక ప్రేమికుని ప్రయాణమే ఈ పుస్తకం.రచయిత అడవాల శేషగిరి రాయుడు(అశేరా)మన చరిత్రని, మన మూలాలను భావితరాలు తెలుసుకునే విధంగా ఈ పుస్తకం ద్వారా ఒక మంచి రచన చేశారు.ఓ రోజు అశేరా గారు కంబగిరిలో నరసింహ స్వామి దేవాలయానికి వెళ్తారు, అక్కడ నీటి కుండంలో ఒక రాగి నాణెం దొరుకుతుంది. ఆ రాగి నాణెం గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాసతో దగ్గరలో ఉన్న అనంతపురం మ్యూజియం కి వెళ్తారు .ఆ మ్యూజియం అధికారి అయిన విజయ్ కుమార్ జాదవ్ గారితో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయమే తర్వాత చారిత్రక ప్రదేశాల పట్ల ఆసక్తి ఉన్న సభ్యులు అందరూ కలిసి విజయకుమార్ గారి మార్గదర్శకంలో ఓ గ్రూప్ గా ఏర్పడి ఎన్నో అనేక ప్రదేశాలు, కట్టడాలు సందర్శనం వైపుకు దారితీస్తుంది. ఆ ప్రదేశాలు వెనుక ఉన్న వింతలు విశేషాలు తెలుసుకొని మనం కూడా సందర్శించిన అనుభూతి కలుగుతుంది.ఈ పుస్తకంలో కొన్ని విశేషాలు.- నేడు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బెలూం గుహలు యొక్క కథ. ఒకప్పుడు ఈ ప్రాంతం స్థానికులకు అపోహలు భయాలతో, మూఢనమ్మకాల గల ప్రదేశంగా ఉండేదట. ఈ గుహలు ప్రదేశంలో ఉన్న చలపతి రెడ్డి గారు జర్మనీ నుంచి ఒక బృందాన్ని పిలిచి సర్వే చేయించి మ్యాప్ గీయించారు, గుహలు పైన ఒక దొంగ స్వామి కళ్ళు పడి, ఆయన చేసే జిమ్ముక్కులతో ఆ ప్రదేశాన్ని ఆనవాళంగా చేసుకుని ఆదాయ వనరుగా మార్చుకోవాలని చూశారు, అడ్డు వచ్చిన వాళ్ల మీద నాటు బాంబులు కూడా ప్రయోగం జరుగుతుంది, కానీ చలపతి రెడ్డి సంకల్పం, విజయ్ కుమార్ జాదవ్ గారి ప్రయత్నం వలన బేలుం గుహలు పురాతన ప్రదేశాలు జాబితాలోకి చేరి ఆసియాలోనే పెద్దదయిన గుహల్లో ఒకటిగా బయటికి వచ్చిందని కథను ఈ పుస్తకంలో మనం తెలుసుకోవచ్చు.-  అభివృద్ధి పేరుతో కదరి నరసింహ స్వామి ఆలయం మార్పులు చేయడం, అదే అభివృద్ధి పేరుతో తిరుమలలో 1000 కాళ్ల మండపాన్ని తొలగించడం. నిధులు నిక్షేపాల కోసం పురాతన కట్టడాలన్నీ కోటలని తవ్విన ఉదంతాలని ఈ పుస్తకంలో చదివాక ఎప్పటినుంచో నన్ను వేధిస్తున్న ప్రశ్న తమిళనాడు, కర్ణాటక లాగా మన తెలుగు రాష్ట్రాల్లో పురాతన కట్టడాలు ఎందుకు తక్కువగా ఉన్నాయో నా ప్రశ్నకి జవాబు అర్థమైంది.-మన తెలుగు నాట జరిగిన లైలా మజ్ను లాంటి అమర ప్రేమ కథను ఈ పుస్తకంలో అశేరా గారు అద్భుతంగా చెప్పారు.  అదే మన కదిరి నరసింహ స్వామి సాక్షిగా జరిగిన చంద్రవదన - మొహియర్ చారిత్రక ప్రేమగాథ‌.- ఆంజనేయ స్వామికి కుమారుడు ఉన్నాడు. ఆయన శక్తిలోను ,స్వామి భక్తిలోనూ తండ్రికి సమానుడు కానీ రావణాసురుడు వద్ద పనిచేయాల్సి వస్తుంది అనే విషయం ఈ పుస్తకంలో రాసిన కథ చదివి ఆశ్చర్యపోయాను.ఆయన విగ్రహం కొలనపాకలో ఉందట. అంతకుముందు ఆ విగ్రహాన్ని ఆంజనేయస్వామి అనుకునేవారుట కానీ విజయ్ కుమార్ గారు దానిని ఆధారాలతో ఆంజనేయస్వామి కుమారుడిని రుజువు చేసిన విధానం చదివాక అద్భుతం అనిపిస్తుంది.- ఓసారి ఓ పెద్దాయన వచ్చి మా ఇంట్లో లంకె బిందెలు ఉన్నాయి సార్ వాటిని తవ్వి తీసి మా గ్రామానికి, మన దేశానికి ఉపయోగపడే పని చేయండి సార్ అని అంటారు, మరొకాయిన నా దగ్గర జింక చర్మం మీద నిధి గురించిన మ్యాప్ ఉంది అంటూ చూడమంటారు ఈ విశేషాలు అన్ని కూడా చదువుతుంటే చాలా ఆసక్తికరంగా, విజ్ఞానదాయకంగా ఉన్నాయి .- ఇంకా మరెన్నో  తిమ్మమ్మ మర్రిమాను కథ, దక్షిణ భారత జలియన్ వాలా బాగ్, శ్రీకృష్ణదేవరాయని కుమారుని గురించిన శాసనాలు. మరెన్నో అద్భుతమైన పురాతన దేవాలయాల విశేషాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.-ఈ చారిత్రక ప్రయాణానికి మార్గదర్శకత్వం వహించిన విజయకుమార్ గారి జీవితం చాలా ఆదర్శవంతంగా అనిపించింది‌, ముఖ్యంగా ఆయన ఎన్నో పల్లెలు తిరిగి స్థానికులతో పోరాడి వారికి ఎంతో నచ్చచెప్పి అనేక విలువైన విగ్రహాలను మ్యూజియాలకు తరలించి భావితరాల కోసం చేసిన కృషి అభినందనీయం.చివరిగా ఓ మాట రచయిత అశేరా గారు చాలా సంఘటనలు ముక్కుసూటిగా రాశారు. చరిత్రని దాయకూడదు అనేది ఆయన ప్రధాన ఉద్దేశ్యం. ఆయన కథనం వైవిధ్య భరితంగా చాలా బాగుంది. ఎన్నెల పిట్ట ప్రచూరణ వారు ఈ పుస్తకాన్ని చాలా బాగా ముద్రించారు. చరిత్ర పట్ల, చారిత్రక కట్టడాలు అంటే ఆసక్తి ఉన్నవారు తప్పక చదవాల్సిన పుస్తకం.- శ్రీనివాస చక్రవర్తి.

No comments:

Post a Comment