Monday, 22 September 2025

కథ 2023 సంకలనం : నాకు నచ్చిన కథలు






ప్రతి ఏడాది అన్ని పత్రికల్లో వచ్చే కథలను పరిశీలించి, మంచి మంచి కథలను తీసుకొని ఓ మంచి కథా సంకలనంగా తీసుకొని రావడం అంటే మాటలు కాదు. 2023 వ సంవత్సరంలో వివిధ మాధ్యమాల్లో వచ్చిన 2500 కథలను చదివి వాటిలో ఒక 15 కథలను ఏరి మన ముందు ఉంచారు కథా సాహితి సభ్యులు. ఇలా 35 సంవత్సరాల నుండి అంతరాయం లేకుండా కథా సంకలనాలు వస్తున్నాయి అని తెలిసి ఆశ్చర్యపోయాను. ఓ రోజు హర్షణీయం పాడ్ క్యాస్ట్ వింటుంటే ఈ కథ సంకలనాలు గురించి వాటి వెనుక ఉన్న విశేషాలు గురించి తెలుసుకున్నాను. ఆ ప్రేరణతో ఈ ఏడాది ఒక కథ సంకలనం చదివి చూద్దాం అని "కథ 2023" పుస్తకం విజయవాడ పుస్తకాల పండుగలో తీసుకొన్నాను. 2025లో నేను మొట్టమొదటిగా చదవడం పూర్తి చేసిన పుస్తకం కూడా ఇదే‌, పూర్తి చేసాక మనసుకు ఓ మంచి సంతృప్తిని కలిగిన అనుభూతి కలిగింది. ఇన్ని సంవత్సరాలు కథా సంకలనాలు ఎలా మిస్ చేసానా అనిపించింది.కొన్ని కథలు చాలా బాగా నచ్చాయి, కొన్ని కథలను అర్థం చేసుకోలేక పోయాను. నాకు బాగా నచ్చిన ఓ 4 కథలు నాకు అర్థం అయిన మేర మీతో పంచుకుంటాను.


1‌.మనసు - మర్మం: అమెరికాలో ఓ గొప్ప యంత్రం వస్తుంది. ఆ యంత్రం ఉన్న గదిలోకి వెళితే మన మనసును Scan చేసి మనసులో ఉన్న విషయాలు అన్నీ చెప్పేస్తుంది. దీనిని పరిక్షించడానికి అన్ని దేశాల ప్రజలు నుంచి లాటరీ విధానంలో ఒక వ్యక్తిని ఎన్నుకుంటారు, అనుకోకుండా ఆ వ్యక్తి మన భారతదేశానికి, మన తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తి అవుతాడు. యంత్రంతో పరీక్షకు వెళ్ళేముందు ఆ వ్యక్తి చిన్నప్పుడు నుంచి ఇప్పటి వరకు మనసులో దాచుకుని బయటకు చెప్పలేని సంఘటనలు అన్నీ ఓసారి రీల్ లాగా గిర్రున తిరుగుతాయి , అవన్నీ ఆ యంత్రం బయట పెడుతుంది ఏమోనని తీవ్రమైన ఒత్తిడికి గురి అవుతాడు మన కథా నాయకుడు. ఆ సంఘటనలు చదువుతుంటే అందులో మనల్ని మనం చూసుకుంటున్నట్లు ఉంటుంది. పరిక్ష జరిగే ముందు రోజు ఓ ప్రముఖ ఛానల్ నుంచి మీరు మానవాళికి ఇచ్చే సందేశం ఏమిటో రికార్డు చేసి పంపమని ఒక మెయిల్ వస్తుంది అందులో చెప్పిన ఈ మాటలు చాలా స్పూర్తివంతంగా ఉన్నాయి ..

"ఎంతకాలం పరదాలు వెనుక దాక్కుంటాం , ఎంతకాలం మంచివాళ్ళలా చెలామణి అవుతాం ఆత్మవంచనతో కాదు, ఆత్మ సంతృప్తితో బతకాలి. బతుకు.. బతకనివ్వు అనే భావన మధురంగా ఉండదూ..?" ఇలా అద్భుతంగా సాగుతాయి ఆయన చెప్పిన మాటలు.

మరి ఇంతకీ మనసులో మర్మాన్ని తెలిపే ఆ యంత్రం కథ చివరిగా ఏమైందో తెలుసుకోవాలంటే ఈ కథను పూర్తిగా చదవాల్సిందే. రచయిత అనిశెట్టి శ్రీధర్ గారు ఓ మంచి సందేశాన్ని ఈ కథ ద్వారా ఇచ్చారు.

******

2. పులస : భూమితో స్నేహం చేసిన ఓ స్త్రీ కథ. ఒక ఊరిలో రవణమ్మ అనే ఆవిడ ఉంటుంది. చిన్నతనం నుండి పొలం పనులు చేయడం అంటే ఆమెకు సరదా మరియు ఎంతో ఇష్టం , రోజులు తెలిసేవి కావు చేను అంటే ప్రాణంగా ఉంటుంది . ప్రక్కనే ఉన్న ఊరులో ఒకాయన తో ఆమెకు వివాహం జరుగుతుంది. భూమి మీద ఉన్న ఇష్టం వలన ఓరోజు తమ పొలం చూపించమని అత్త, భర్తలను అడుగుతుంది ..

"భూమి గురించి నీకెందుకు, తిని ఇంటికాడ కూర్చోవచ్చు కదా" అని అంటారు. భూమితో రుణం తీరిపోయిందా అని బాధపడుతుంది తాను. అదే సమయంలో రవణమ్మ అన్నదమ్ములకు పొలం వాటాలు వేస్తూ ఉంటారు తల్లిదండ్రులు, రవణమ్మ పంచాయతీకి వెళ్ళి భూమిలో తన వాటా సంపాదిస్తుంది . ఆ భూమిని బంగారంగా మారుస్తుంది.. కొంతకాలానికి ఆ భూమి వేరే వాళ్ళ చేతికి వెళ్ళిబోతుంటే ఆ భూమిని తిరిగి సంపాదించాలని రవణమ్మ చేసిన పోరాటం మరియు భూమిని దైవంగా ఆరాదించడమే ఈ కథ.

ఈ కథలో నాకు బాగా నచ్చిన లైన్స్ చేసే పని ఏదైనా ప్రాణం పెట్టాలి అనే విధంగా ఉన్నాయి...

ఓసారి మీరు చదవండి 

" సేనంటే ఏటి? బూవితో సేయితం సెయ్యాల, ఆయమ్మని ముద్దాడలా, ఒడుపుగా ఆయమ్మ సేతిలో సెయ్యెయాలా, అన్నింటికన్నా ముక్కెం మన సెమట సుక్కల్తో ఆ తల్లి సానవాడాల"  

రచయిత్రి కత్తి పద్మ గారు రాసిన విధానం చాలా బాగుంది . ఈ కథ చదివిన చాలా రోజుల వరకు నన్ను వెంటాడుతూనే ఉంది.

*******

3.చప్పుడు చేసే నిశబ్దాలు : ఈ కథను నేను రైలు ప్రయాణంలో చదివాను‌. రచయిత ఛాయా మోహన్ గారు ఈ కథను అద్భుతంగా రాశారు. 

ఉరుకుల పరుగుల జీవితం మన మనుషులు మన పక్కనే ఉన్నారు కదా అనుకుంటాం.. సంవత్సరాలు గడిచిపోతాయి.. పిల్లలు పెద్దలుగా మారతారు చదువులు, ఉద్యోగాలు అని ఎక్కడో స్థిరపడి పోతారు. తల్లి దండ్రులు, భాగస్వామి కాలం ఎవరిని ఎక్కడికి తీసుకొని వెళుతుందో తెలియదు ...

సమయం చేసుకుని మన వాళ్ళతో గడపాలి అదేవిధంగా కనువిప్పు కలిగించే ఈ కథలో సందర్భానుసారంగా మధ్యలో మంచి పాటలు జత చేసారు రచయిత ఛాయా మోహన్ గారు.

*******

4.ముసురు : ఇప్పటి తరం యువత కులవృత్తి పట్ల చూపిస్తున్న నిరాసక్తత . కులవృత్తి మీద ఆధారపడ్డ కుటుంబాలు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను ముసురు కథలో రచయిత్రి స్పూర్తి గారు దృశ్య రూపంలాగా చిత్రీకరించారు, ముఖ్యంగా కురుమయ్య తాతయ్య పాత్ర చాలా బాగా నచ్చింది నాకు.

 కథ-2023 సంకలనం చాలా బాగుంది. ఈ ఏడాది రాబోయో కథ 2024 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఫ్రెండ్స్ మీరు కూడా కథా సంకలనాలతో మరియు కథలతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటారు కదూ..

- శ్రీనివాస చక్రవర్తి.



 

Monday, 15 September 2025

పుస్తకం: జీవనయానం

 ఆత్మకథ సాహిత్యంలో నాకు బాగా నచ్చిన ఓ పుస్తకం : జీవనయానం 



ఈ పుస్తకం లోని రంగాచార్యులు వారి నాలుగు మాటలు "నది జీవితం వంటిది. బిందువుగా మొదలవుతుంది, ఉపనదులు కలుస్తాయి విశాలమవుతుంది. జీవితంలో అనుభవాలు కలుస్తాయి అది విశాలమవుతుంది. నదికి కొండలు కోనలు ఎదురవుతాయి అప్పుడు జలపాతం అవుతుంది, హోరును సృష్టిస్తుంది. జీవితంలో ఆపదలు ఎదురవుతాయి అప్పుడే జీవితనాథం వినిపిస్తుంది. జీవితం వికస్తుంది.చిక్కుల్లో మనిషి ఎదుగుతాడు ,ఆపదల్లో ఉన్నతుడు అవుతాడు. మనిషి అయినా జాతి అయినా అంతే." ఈ వాక్యాలు చదివినప్పుడు ఏదో తెలియని ఉత్సాహం వస్తుంది.

నేను పుస్తకాల పండుగకు వెళ్ళే మొదటి దశలో ఈ పుస్తకం నాకు చాలా స్టాల్స్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉండేది , కాని కవర్ పేజీని మరియు టైటిల్ ని చూసి ఇదే ఏదో ఆధ్యాత్మికానికి సంబంధించినది అని మనకు అర్థం అయ్యే పుస్తకం కాదు అని మొదట్లో అనుకునేవాడిని.కానీ ఒక్కసారి మన తెలుగులో వచ్చిన అత్యుత్తమ ఆత్మకథలు ఏవి అని తెలుసుకుందామని ప్రయత్నిస్తే అందులో ఇది కూడా ఒకటని తెలిసింది.అప్పుడు చదవడం మొదలుపెట్టాను. ఇంత గొప్ప పుస్తకాన్ని ఇన్ని రోజులు ఎందుకు చదవలేదా అనిపించింది. ఈ పుస్తకం పూర్తి అయ్యేంతవరకు మరో పుస్తకం వైపు చూడలేదు అంత ఆసక్తిగా, అంత అద్భుతంగా అనిపించింది రంగాచార్యులు వారి రచనా శైలి , దృశ్యాలను కళ్ళముందు పరిచారు .


- ఇది రంగాచార్యులు ఆత్మకథే కాదు, మన తెలుగు జాతి ఆత్మకథలాగా నాకు అనిపించింది. నాటి మన తెలుగు రాష్ట్రాల (స్వాతంత్ర్య ఉద్యమ పూర్వ కాలంలో, తరువాత కాలంలో) పరిస్థితులు ఎన్నో విషయాలు కళ్ళకు కట్టినట్లు రాశారు.

- నాకు వింతగా అనిపించింది ఆనాటి కరెన్సీ , అప్పుడు ఖమ్మం నుంచి విజయవాడ రావాలంటే కరెన్సీ మార్చుకోవాలి అంటా నిజాం కరెన్సీ ను బ్రిటిష్ ఇండియా కరెన్సీగా మార్చుకొంటేనే ఆయా ప్రాంతాల్లో లావేదేవీలు జరపగలం అంటా.

- హుస్సేన్ సాగర్ కి ఆ పేరు ఎలా వచ్చింది అంటే కుతుబ్ షాహీల కాలంలో ఇబ్రహీం కూలీ కుతుబ్షాకి జబ్బు చేయడం వలన హుస్సేన్ షావలి అనే ఫకీర్ దగ్గరికి వెళ్ళారట , ఆయన జబ్బు నయం చేయటం వలన కృతజ్ఞత పూర్వకంగా ఆయన పేరు మీద హుస్సేన్ సాగర్ ని 1562 వ సంవత్సరంలో నిర్మించారు అట.

-అలాగే కరీంనగర్, మహబూబ్ నగర్ వీటికి అప్పట్లో వేరే పేర్లు ఉండేవట , వాటిని నిజాం కాలంలో ఎలా మారాయో కూడా చెప్పారు.

- అప్పట్లో తెలుగు ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి ముఖ్యంగా నిజాం పాలనలో ఉర్దూ మీడియంలో చదవాల్సి వచ్చేది , ఉద్యోగాలు కూడా ఆ భాష నేర్చిన వారికే ప్రాముఖ్యత ఉండేది.

ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు రాశారు. ముఖ్యంగా సాయుధ పోరాటం నాటి విషయాలు ,ఆ వీరులు త్యాగాలు చదువుతుంటే మనకు ఈ నేల మీద ఉన్న ప్రేమ రెట్టింపు అవుతుంది.స్వత్వాహాగ ఆయన గొప్ప రచయిత అయి ఉండటం వలన హృదయాలను కదిలించే గొప్ప రచనగా మలిచారు. ప్రతి తెలుగువాడు చదవాల్సిన పుస్తకం జీవనయానం.ఫ్రెండ్స్ మీరు కూడా మీకు బాగా నచ్చిన ఆత్మకథ పుస్తకాలను తెలియజేయండి. మేము వాటిని చదివి ప్రేరణ పొందుతాం.

- శ్రీనివాస చక్రవర్తి 

Thursday, 11 September 2025

పుస్తకం : వీరయ్య

ఆగష్టు నెలలో చదివిన ఓ మంచి పుస్తకం : వీరయ్య



 ఈ పుస్తకం చదువుతుంటే నాకు నా చిన్నప్పుడు మా అమ్మమ్మ తో జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. నేను చిన్నప్పుడు మా అమ్మమ్మని అడుగుతూ ఉండేవాడిని "అమ్మమ్మ నువ్వు గాంధీగారిని చూసావా, బ్రిటిష్ వారిని చూసావా అని . మా అమ్మమ్మ అప్పటి విశేషాలు చెప్పేది.

సరిగ్గా అలాంటి విశేషాలనే ఈ వీరయ్య పుస్తకంలో మనం చూడవచ్చు. బ్రిటిష్ కాలం నాటి మన భారత ప్రజల జీవన విధానం. కొంతమంది భారతీయులు పొట్టకూటికోసం ఆఫ్రికా చెరుకు తోటలో కూలీలుగా చేరి అక్కడ బానిసల్లా పడిన కష్టాలు, అప్పటి వాతావరణం, మానవ బంధాలు కళ్ళకు కట్టినట్లు రాశారు రచయిత కృష్ణ.

పుస్తకం చదువుతుంటే మనం కూడా వీరయ్యతో విజయవాడ నుంచి మద్రాసు వరకు రైలులో ప్రయాణం చేసి అక్కడ నుంచి దక్షిణ ఆఫ్రికాకు ఓడలో ప్రయాణం అవుతాం. అక్కడి చెరుకు తోటల్లో, పంచదార కర్మాగారాల్లో విహరిస్తాం . మన భారతీయ కూలీలు పడిన కష్టాలు చూసి చలించిపోతాం. దక్షిణ ఆఫ్రికాలో భారతీయుల కోసం గాంధీ గారి చేసిన ఉద్యమం చూస్తాం.వీరయ్య బతుకు తెరువు కోసం దక్షిణాఫ్రికా లో సాధారణ కూలీగా మొదలై సర్దార్ గా మారిన విధానం చదివి ప్రేరణ పొందుతాం.వీరయ్య గారు 30 సంవత్సరాల తరువాత తమ కుటుంబ సభ్యులను భారత్ లో కలవాలని పడే ఆరాటంలో మనం కూడా భాగం అవుతాం.

కొన్ని సంఘటనలు వింతగా అనిపించాయి.

1. అప్పట్లో రైలులో 4 వ తరగతి ఉండేది, కూలీలు కోసం. అందులో కింద కూర్చుని ప్రయాణం చేసేవారు. వీరయ్య తోటి కూలీలతో కలిసి రైలులో ఇలా విజయవాడ నుంచి మద్రాసు వరకు ప్రయాణం చేసారు.

2.చెరుకు నుంచి పంచదార తయారు చేసే క్రమంలో , పొరపాటున కూలీల చేతులు మిషన్ లో పడితే పక్కనే మధ్యం , పెద్ద కత్తులు ఉండేవి . చేతులు పడిన వారికి బాగా మధ్యం తాగించి వెంటనే చేతులు నరికేసేవారు. యంత్రాలు ఆగకుండా పని చేయాలని ఇలా చేసేవారట.

3. ఆ రోజుల్లో భారతీయులు ఎవరైనా సముద్ర ప్రయాణం చేసినట్లు అయితే వారి మీద నిషేధం ఉండేదట, కాశీ నుంచి పవిత్ర గంగా జలం తెచ్చి ఏవో పూజలు చేస్తే గాని సమాజంలో కలవనిచ్చే వారు కాదు అంట.

ఈ పుస్తకం ముందుమాటలో తనికెళ్ల భరణి గారు ఇలా అన్నారు

"మన ముత్తాత ఫోటో సంపాదించడమే కష్టం, అలాంటిది‌ రచయిత కృష్ణ తన మూలాల్ని వెతుక్కుంటూ చరిత్ర పుటల్లోకి వెళ్లి ఆఫ్రికాలో తన పాత తరాల గాథను వజ్రాలు మూట కట్టి వీరయ్యగా మలిచారు" . ఈ మాటలు అక్షర సత్యం.ఏడు తరాలు, మా నాయన బాలయ్య పుస్తకాలు తరువాత అలాంటి ఓ మంచి పుస్తకం చదివిన గొప్ప అనుభూతి కలిగింది. ఇలాంటి పుస్తకాలు చదివితే మన తాత ముత్తాతలు ఎలా బతికారో, ఏం చేసారో తెలుసుకోవాలనే తపన మనలో కూడా జనిస్తుంది. 

ఈ పుస్తకం నేను చదువు App లో చదివాను.

- శ్రీనివాస చక్రవర్తి.