Monday, 13 October 2025

పుస్తకం: పాటలు పుట్టిన తావులు


 

ఈ మధ్య కాలంలో చదివిన ఓ అద్భుతమైన పుస్తకం: పాటలు పుట్టిన తావులు.

ఆహా.. ఏమి పుస్తకం.. ఏమి సందర్శనం.. ఏమి కథనం..ఈ పుస్తకం చదువుతుంటే మనం కూడా రచయిత చిన వీరభద్రుడు గారితో కలిసి పాటలు పుట్టిన తావుల్లో స్వయంగా సందర్శించిన అనుభూతిని పొందుతాం. ఎన్నో పురాతన క్షేత్రాలను ఎందరో గొప్ప వ్యక్తులను కలుసుకుంటాం, ఏ సందర్భంలో కవి హృదయం ఎలా స్పందించిందో.. ఆ హృదయం నుంచి జాలువారిన పాటలను/ పదాలను తెలుసుకొని మనం కూడా పరవశించిపోతాం.ఒక సంఘటన చూద్దాం..తమిళ దేశంలో ప్రముఖులైన జ్ఞానసంబంధర్, అప్పర్ ఇద్దరూ కలిసి ఓనాడు తిరుమలైకాడు దేవాలయానికి వెళ్తారు. అక్కడ ప్రధాన ద్వారం మూసి ఉండటం సంబంధర్ చూసి అప్పర్ ని మీరు స్వామిని స్తోత్రం చేస్తూ ఒక పాట పాడండి అంటారు.. మొదటి పాట పాడగానే తలుపులు కిర్రుమంటాయి కానీ అవి తెరుచుకోవు, అప్పుడు వెంటనే అప్పర్ మరో పాట పాడగానే తలుపులు పూర్తిగా తెరుచుకుంటాయి. లోపలికి అడుగుపెట్టగానే తలుపులు మూసుకుపోతాయి. స్వామిని పూజించి తిరిగి వస్తుంటే మూసిన తలుపులు తెరుసుకోవడం కోసం సంబందర్ ను పాట పాడమని ఈసారి అప్పర్ అడుగుతారు, సంబంధర్ పాట ఎత్తుకొని మొదట వాక్యం పలికాడో లేదో వెంటనే తలుపులు బార్ల తెరుచుకుంటాయి. అక్కడ చేరిన జనం ఈ సంఘటన చూసి ఆశ్చర్యానికి లోనవుతారు. ఈ సంఘటన గురించి రచయిత చెబుతూ ఇది ఒక కవిని ఎక్కువ , మరో కవిని తక్కువ చేయడం కాదు ఇది కేవలం రూపాలంకారం మాత్రమే అని చెబుతారు .. మరో సంఘటనలో అప్పర్, సంబంధర్ కరువు సంభవించిన ప్రాంతం ప్రజలు కోసం పాటలతో దేవుణ్ణి ప్రార్థించి బంగారుకాసుల్ని తెప్పించిన ఘటన చాలా అద్భుతంగా ఉంది.కొన్ని జీవితాలకి అభిమానులుగా మారుతాం..ఈ పుస్తకం లో సుబ్రహ్మణ్య భారతి గారి గురించి రచయిత చెప్పిన విధానం నాకు చాలా బాగా నచ్చింది, భారతి గారు 12 భాషల్లో పండితుడు కత్తి సామూ ,మల్ల యుద్ధం, భరతనాట్యం, సంగీతంలో గొప్ప ప్రావీణ్యం సంపాదించడమే కాకుండా పత్రికలు కూడా నడిపారట, గొప్ప సామాజిక సంస్కర్త ,తమిళ గద్య పితామహుడు అని ఒక మంచి పరిచయం చేశారు. ఆయన జీవితంలో ఈ సంఘటన చూడండి.ఓ రోజు భారతి గారు కొంతమంది బీద పిల్లలు తినడానికి తిండి లేక వేప పండ్లు ఏరుకొని తినడం చూశారట, ఆ రోజు నుంచి తనకి తిండి రుచి తెలియకుండా పోయిందని సుబ్రమణ్య భారతి గారు ఒక చోట రాసుకున్నారట.. నిజంగా ఆయనది ఎంత ద్రవించే హృదయం.ప్రతి స్త్రీలో తల్లిని చూసిన వ్యక్తి భారతి గారు, ఆయన పసిప్రాయంలోనే ఆమె తల్లి ఆయనను వదిలి దివికేగారట, తరువాత భారతి గారు ప్రతి స్త్రీలో కూడా తన మాతృవదనాన్నే దర్శించారట.చిన వీరభద్రుడు గారు ఇక్కడ ఒక మాట చెప్పారు " ప్రతి ఒక్క స్త్రీలో తల్లిని దర్శించడం అంటే ఏమిటి? నువ్వు సదా బాలకుడిగా ఉండటమే కదా..ఈ మాటలు నా చిన్నతనంలో నా హృదయంలో సూది మందు ఎక్కించినట్లుగా నా తల్లిదండ్రులు చెబితే ఎంత బాగుండేది"సుబ్రహ్మణ్య భారతి గారి గురించి చదివాక ఆయనకి అభిమానిని అయిపోయాను నేను.ఇలాంటి ఆదర్శనీయమైన వ్యక్తి మరొకరు అమ్మైయారు, తనను తాను ఒక భూతంగా భావించుకొని భగవంతుని కోసం స్మశానంలో వెతికిందంట,  తిరువాలంగాడు అనేది పరమ పవిత్రమైన ప్రదేశంగా భావించి పాదాలతో తాకరాదని, పాదాలు పైకెత్తి అరచేతుల మీద నడిచే ఘట్టం చదివి ఆశ్చర్యపోయాను ‌.ఈ పుస్తకంలో ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విశేషాలను తెలుసుకొన్నాను.- రమణ మహర్షి తను పుట్టిన ప్రదేశం నుండి అరుణాచలం చేరిన విధానం.- ఎక్కడ గంగైకొండ చోళాపురం ఎక్కడ రాజేంద్ర మహేంద్రవరం. రాజ రాజేంద్ర చోళుడు కుమార్తె మన రాజ రాజ నరేంద్రుని (రాజమహేంద్రవరం) అర్థాంగిగా వచ్చారట.- శ్రీరంగ నాథుడు పూల మాలలు కట్టేవారితో తన భక్తుల గురించి సంభాషించిన సంఘటన‌- చలంగారు - రమణ మహర్షి - అరుణాచలం జీవితాదర్శం ఘట్టాలు- తన భక్తురాలిను గణపతి తొండంతో నేరుగా కైలాసానికి తీసుకొని వెళ్ళిన సంఘటన.- కావేరి నది అందాలు - త్యాగ రాజ ఆరాధన మండపంలో చినవీరభద్రుడు గారు పొందిన అనుభవం.. చిన వీరభద్రుడు గారు ఈ పుస్తకంలో ఓచోట ఓ మాట చెబుతారు."ఎందరో మహానుభావులు చేతిలో చిల్లిగవ్వ లేని జీవితాన్ని అనుభవిస్తూ కూడా తోటి మనుషుల కోసం, భాష కోసం వారు పడ్డ తపన, చేసిన సేవ తెలిసిన కొద్ది.. జీవితం మనకెంతో అవకాశం ఇచ్చిన మనమేం చేస్తున్నాం అనే ప్రశ్న పదేపదే గుచ్చుకుంటుంది"..  ఈ పుస్తకం చదివాక వారి అందరి జీవితాల నుంచి గొప్ప ప్రేరణ పొందుతాం.ఈ నేల మీద, మన వారసత్వపు సంపద మీద మన ప్రేమ రెట్టింపు అవుతుంది.పుస్తకం చదివాక ఆలోచిస్తుంటే మన తెలుగు రాష్ట్రాల్లో జన్మించిన కవులు గురించి, వారు నడయాడిన ప్రదేశాలు గూర్చి తెలుసుకోవాలనే తపన నాలో పెరిగింది. ఇంత గొప్ప రచనను  మన ముందు తీసుకొని వచ్చిన చిన వీరభద్రుడు గారికి , ఈ పుస్తకం అందించి చదవమని ప్రోత్సహించిన కొప్పరపు లక్ష్మి నరసింహరావు గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు.- శ్రీనివాస చక్రవర్తి.